మీకు తెలుసా?: హైదరాబాద్ కోడలైన వీవ్ రిచర్డ్స్ కూతురు!
హైదరాబాద్: అతనొక క్రికెట్ దిగ్గజం. ఆమె ఒక బాలీవుడ్ ప్రముఖ నటి. దేశాలు వేరైనా వారిద్దరూ ప్రేమించుకుని పెళ్లితో ఒక్కటయ్యారు. వారిద్దరే వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వీవ్ రచర్డ్స్ కాగా, అలనాటి బాలీవుడ్ నటి నీనా గుప్తా. కాగా, వీరి ముద్దుల కూతురు మసాబా గుప్తా తిరిగి భారతదేశానికే కోడలిగా రావడం విశేషం. అది కూడా హైదరాబాద్ కు చెందిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత మధు మంతెన వర్మను వివాహం చేసుకుని కావడం గమనార్హం. అంటే ఆమె తెలుగువారింటికి కోడలు అన్నమాట. అయితే ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.
గత రెండు రోజుల క్రితం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి విచ్చేసిన మసాబా తన జీవితానికి సంబంధించిన పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను ఫ్యాషన్ డిజైనర్ అయ్యానని తెలిపారు. చిన్నతనం నుంచే ఆ రంగంపై ఎంతో ఆసక్తి ఉండేదని చెప్పారు.
మధు మంతెనతో ప్రేమాయణం గురించి మాట్లాడుతూ.. హైదరాబాద్కు చెందిన మధు మంతెనలో నిజాయతీ చూసి అతన్ని వదులుకోవద్దని అనుకున్నట్లు చెప్పారు. మూడు నెలల ప్రేమ తర్వాత ఇద్దరం 2015లో ఒకటయ్యామని చెప్పారు. మధు చాలా సాధారణంగా ఉంటారనీ, అదే తనకు అతనిలో నచ్చే గుణమని వివరించారు.
వృత్తి రీత్యా అతను దర్శకునిగా పనిచేస్తుండటం వల్ల ముంబయిలో ఉంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్కు వచ్చిన ప్రతి సారి అత్తగారింటికి వెళ్తానని, తమ అత్తమామలను కలుస్తానని చెప్పుకొచ్చారు. అంతేగాక, తెలుగింటి కోడలు మసాబా' అని ఎవరైనా అంటే గర్వంగా భావిస్తా'నని తెలిపారు. తన తల్లిదండ్రులను కూడా తరచూ కలుస్తుంటామని, అయితే ఈ మధ్య కాలంలో వారిని తరచూ కలవడం కుదరడం లేదని తెలిపారు.
కాగా, ప్రస్తుతం మసాబా దేశంలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గా కొనసాగుతున్నారు. బాలీవుడ్ ప్రముఖ సినీతారలు సోనమ్కపూర్, ఆలియాభట్, కంగనా రనౌత్, బిపాసా బసు, నేహా దూపియా, అదితిరావు ఇలా అనేక మందికి సరికొత్త ఆహార్యం ఇచ్చే దుస్తులు డిజైన్లు చేసినట్లు తెలిపారు. అంతేగాక, 'మసాబా డిజైన్' అనే గుర్తింపు తోపాటు దేశంలోని ఫ్యాషన్ రంగంలో ప్రత్యేకత చాటుకున్నారు మసాబా గుప్తా. ఇక ఆమె భర్త మధు మంతెన బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో తీరిక లేకుండా గడుపుతారు.