70% మంది ఐఐటీ బాంబే విద్యార్ధులు రోజూ స్నానం చేయట్లేదు: సర్వే
ముంబై: దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - బాంబే(ఐఐటీ-బీ)లో చదువుతున్న ప్రతీ పది మందిలో ఆరుగురు విద్యార్ధులు వారంలో కేవలం రెండు మూడు రోజులకు ఒకసారి మాత్రమే స్నానం చేస్తున్నారట. మొత్తంగా చూస్తే ఐఐటీ బాంబే విద్యార్ధుల్లో 70 శాతం మంది తరచూ స్నానం చేయడం లేదని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది.
పదిశాతం మంది విద్యార్థులైతే వారానికి ఒకసారి స్నానం చేస్తుండగా 30 శాతం మంది మాత్రం రోజూ స్నానం చేస్తున్నట్టు విద్యార్థులు నిర్వహించిన సీనియర్ సర్వే తేల్చింది. ఐఐటీ బాంబేలోని అండర్ గ్రాడ్యుయేట్లు, డ్యూయల్ డిగ్రీ విద్యార్థులు, ఎంఎస్సీ, ఎంటెక్ గ్రాడ్యుయేట్లు అయిన 332 మందిపై సర్వే నిర్వహించగా విస్మయ పరిచే ఈ నిజాలు బయటకు వచ్చినట్టు సర్వే పేర్కొంది.
అంతేకాదు హాస్టల్లో ఉండి చదువుకునేందుకు ఆసక్తి చూపడం లేదంట. ఇనిస్టిట్యూట్లోని మొత్తం విద్యార్థుల్లో 40 శాతం మంది స్నేహితులతో కలిసి ఉండేందుకు ఆసక్తి చూపిస్తుండగా 27 శాతం మంది ఇంటికి వెళ్లిపోవాలని భావిస్తున్నారు. 19 శాతం మంది ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతుండగా 66 శాతం మంది మాత్రం చదువు ముగిసి ఇంటికి వెళ్లాక కూడా స్నేహం కొనసాగించాలని భావిస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది.
52.4 శాతం మంది విద్యార్ధులు తమ స్నేహితులతో కలిసి గోవాకు రోడ్డు ట్రిప్ వేయడం ద్వారా కాలేజీ విద్యార్ధిగా తమ కలను సొంతం చేసుకుంటున్నామని చెప్పారు. లోకల్ ట్రైన్లలో 70 శాతం మంది విద్యార్ధులు టిక్కెట్ లేకుండా ప్రయాణించేస్తున్నారట. అదే విధంగా హాలీవుడ్ సూపర్ స్టార్ జేమ్స్ బాండ్ సినిమాలంటే ఎంతో ఇష్టమని, ముఖ్యంగా 'కేసినో రాయల్' అనే సినిమాను ప్రేరణగా తీసుకుని పోకర్, బ్లాక్జాక్ ఆటలను ఆడుతున్నారని సర్వేలో వెల్లడైంది.
ఇక పెళ్లి విషయానికి వస్తే 39.15 శాతం మంది పెళ్లితో చావుని కొని తెచ్చుకోలేమని, 21.4 శాతం మంది మూడు లేదా ఐదు సంవత్సరాల్లో పెళ్లి చేసుకుంటామని చెప్పారు. ఇక హాజరు విషయానికి వస్తే 39.75 శాతం మంది అన్ని క్లాసులకు హాజరవుతుండగా, 32.5 శాతం మంది విద్యార్ధులు నచ్చిన లెక్చరర్ల క్లాసులకు మాత్రమే హాజరవుతున్నారు.
ఇక ఆశ్చర్చపోయే విషయం ఏంటంటే 16.2 శాతం విద్యార్ధులు ఇప్పటి వరకు ఇనిస్టిట్యూట్లోని సెంట్రల్ లైబ్రరీకి వెళ్లలేదని సర్వేలో వెల్లడైంది.