నోట్లరద్దు, జీఎస్టీలతో నో ప్రాబ్లం: పెరుగుతున్న కుబేరుల సంపద
జీఎస్టీ, నోట్ల రద్దుతో సంబంధం లేకుండా కుబేరుల సొమ్ము మరింత పెరిగింది. ఎకాఎకీన 26 శాతం పెరిగిపోవడం ఆసక్తికర పరిణామం.
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పయనం పతనం దిశగా సాగుతున్నా, నోట్ల రద్దుతో సామాన్యులు అవస్థల పాలైనా.. జీఎస్టీతో వ్యాపారులు ప్లస్ ప్రజలు బోరుమంటున్నా ధనవంతులు ప్రత్యేకించి కార్పొరేట్ సంస్థల అధిపతులు మాత్రం మరింత సంపన్నులు కావడానికి ఎటువంటి అడ్డంకులు కాకుండా పోయాయి.
ఆర్థిక సంస్కరణల విషయంలో మోదీ ప్రభుత్వం దేశంలోని అన్ని వర్గాల నుంచి పలు విమర్శలను ఎదుర్కొంటున్నది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్ - జూన్) వృద్ధిరేటు మూడేండ్ల కనిష్టానికి దిగజారి 5.7 శాతానికే పరిమితమైనా భారత్లోని కుబేరుల సంపద మాత్రం బేఫికర్గా పెరుగుతూనే ఉన్నది. వరుసగా పదో ఏడాది ముకేశ్ అంబానీ టాపర్గా నిలవడం విశేషం.
నోట్ల రద్దు, కొత్త పన్ను విధానం జీఎస్టీతో దేశంలోని అన్ని వ్యాపారాలు అంతకంతకూ పడిపోయిన విషయం తెలిసిందే. కానీ స్టాక్ మార్కెట్లు మాత్రం జోరు కనబర్చడం దేశంలోని ధనవంతుల ఆస్తి మరింత పెరుగడానికి దోహదపడింది. ఈ ఏడాది భారత్లోని 100 మంది అత్యంత సంపన్నుల మొత్తం సంపద విలువ 26శాతం వృద్ధితో 47,900 కోట్ల డాలర్లు (రూ.31 లక్షల కోట్లు)గా నమోదు కావడం ఆసక్తికర పరిణామం.
రిలయన్స్ జియో, చమురుశుద్ది లాభాల్లో పురోగతి
ఈ నేపథ్యంలో పోర్బ్స్ ఇండియా 2017 ఏడాదికి విడుదల చేసిన 100 మంది ధనవంతుల జాబితాలో దాదాపు రూ.2.50 లక్షల కోట్ల (3800 కోట్ల డాలర్ల) సంపదతో రిలయన్స్ ఇండిస్టీస్ అధినేత ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. 2016తో పోలిస్తే ఆయన సంపద ఒక్క ఏడాదిలోనే 67 శాతం(1530 కోట్ల డాలర్లు) పెరగడం గమనార్హం. గత పదేళ్లుగా వరుసగా ముకేశ్ తొలిస్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు. ఏడాదిలో ఏకంగా 67 శాతం వృద్ధి చెందింది. చమురు శుద్ధి వ్యాపార లాభాల మార్జిన్లు మెరుగుపడటం, రిలయన్స్ జియో ఘన విజయం ఇందుకు తోడ్పడ్డాయి. దాంతో ఆయన ఆసియా ఖండంలోని ఐదుగురు అత్యంత ధనవంతుల్లో ఒకరిగా నిలిచారని ఫోర్బ్స్ పేర్కొంది.
తొమ్మిదో స్థానానికి దిలీప్ సంఘ్వీ
విప్రో అధినేత అజీం ప్రేమ్జీ 1900 కోట్ల డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. గతేడాది నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న ప్రేమ్జీ.. ఈ సారి రెండు స్థానాలు పైకి ఎగబాకారు. గతేడాదిలో రెండో స్థానంలో నిలిచిన సన్ఫార్మా చైర్మన్ దిలీప్ సంఘ్వీ ఈ ఏడాది ఏకంగా తొమ్మిదో స్థానానికి పడిపోయారు. ఆయన సంపద 1,210 కోట్ల డాలర్లకు క్షీణించింది. సుమారు 12 మంది పారిశ్రామికవేత్తల ఆస్తి గతేడాదితో పోలిస్తే గణనీయంగా తరిగిపోయింది. అందులో సన్ఫార్మా చైర్మన్ దిలీప్ సంఘ్వీ అత్యధికంగా (480 కోట్ల డాలర్లు) నష్టపోయారు. గుప్తా కుటుంబ సంపద 345 కోట్ల డాలర్లు తగ్గగా.. ఎస్సార్ గ్రూపునకు చెందిన శశి రుయా, రవి రుయా సోదరుల ఆస్తి కూడా భారీగా క్షీణించింది.
హిందూజా సోదరులు
హిందూజా సోదరులు 1840 కోట్ల డాలర్లతో మూడో స్థానంలో, లక్ష్మీమిట్టల్ 1650 కోట్ల డాలర్లతో నాలుగో స్థానంలో, పల్లోంజీ మిస్త్రీ 1600 కోట్ల డాలర్లతో ఐదోస్థానంలో నిలిచారు. గోద్రేజ్ కుటుంబం 1420 కోట్ల డాలర్లతో ఆరోస్థానంలో, హెచ్సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివనాడార్ 1360 కోట్ల డాలర్లతో ఏడో స్థానంలో, ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత కుమార్ బిర్లా 1260 కోట్ల డాలర్లతో ఎనిమిదో స్థానంలో, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ 1100 కోట్ల డాలర్లతో పదో స్థానంలో నిలిచారు.
పెరిగిన 27 మంది కుబేరుల నికర ఆస్తులు
యోగా గురువు రామ్దేవ్బాబా సన్నిహితుడైన పతంజలి ఆయుర్వేద సంస్థ అధినేత ఆచార్య బాలకృష్ణ 655 కోట్ల డాలర్ల(రూ.43,000 కోట్ల)తో 19వ స్థానానికి ఎగబాకారు. గతేడాది ఈయనది 48వ స్థానం మాత్రమేనన్నది గమనార్హం. ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ ఈ లిస్టులో 45వ స్థానానికి జారుకున్నారు. ఆయన ఆస్తి 315 కోట్ల డాలర్లకు పడిపోయింది. నిరుడు 340 కోట్ల డాలర్ల సంపదతో అనిల్ 32వ స్థానంలో ఉన్నారు. అంతక్రితం ఏడాది 29వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలోని వారందరూ బిలియనీర్లే. కనీసం 100 కోట్ల డాలర్ల ఆస్తి కలిగినవారే. కనిష్ఠంగా 146 కోట్ల డాలర్ల ఆస్తి కలిగిన వారి పేర్లను ఈసారి జాబితాలో చేర్చారు. గతేడాది జాబితాలో ఆస్తి కనీస పరిమితి 125 కోట్ల డాలర్లుగా ఉంది. వీరి షేర్హోల్డింగ్స్తోపాటు స్టాక్ ఎక్సేంజ్లు, విశ్లేషకులు, నియంత్రణ మండళ్ల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ లిస్ట్ రూపొందించినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. ఈ జాబితాలో ఉన్న ఐదింట నాలుగోవంతుకు పైగా మంది ఆదాయం ఎగబాకింది. 27 మంది నికర ఆస్తి 100 కోట్ల డాలర్లు, అంతకంటే పెరిగింది.
పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ వర్మకు స్థానం
ఈ ఏడాది జాబితాలో కొత్తగా చోటు దక్కించుకున్న వారిలో నుస్లీ వాడియా తొలిస్థానంలో నిలిచారు. కుకీస్ తయారీ నుంచి ఎయిర్లైన్ వ్యాపారం వరకు నిర్వహించే వాడియా 560 కోట్ల డాలర్ల సంపదతో 25వ స్థానం దక్కింది. బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగినా టాప్ 100 - లో మాత్రం ఆరుగురికి మాత్రమే చోటు దక్కింది. వాడియాతోపాటు కొత్తగా ఎంట్రీ ఇచ్చినవారిలో ఈ గవర్నెన్స్ సేవల సంస్థ వాక్రంజీకి చెందిన దినేశ్ నంద్వానా (172 కోట్ల డాలర్ల ఆస్తితో 88వ స్థానం), పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ (147 కోట్ల డాలర్లు-99వ స్థానం), యెస్ బ్యాంక్కు చెందిన రాణా కపూర్ (146 కోట్ల డాలర్లు-100వ స్థానం) ఉన్నారు.
కిరణ్ మజుందార్ కు 72వ ర్యాంక్
ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో కేవలం ఏడుగురు మహిళలకే చోటు లభించింది. అందులో ఓపీ జిందాల్ గ్రూపు చైర్పర్సన్ సావిత్రి జిందాల్కు 750 కోట్ల డాలర్ల సంపదతో 16వ స్థానంలో నిలిచారు. యూఎస్వీ ఇండియాకు చెందిన లీనా తివారీకి (220 కోట్ల డాలర్లు) 71వ స్థానం దక్కగా, బయెటెక్నాలజీ సంస్థ బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్షాకు (220 కోట్ల డాలర్లు) 72వ స్థానం లభించింది.
ఫ్యూచర్ గ్రూప్ సీఈవో కిశోర్ బియానీ కూడా
ధనికుల జాబితాలో తిరిగి చోటు సంపాదించుకున్నవారిలో డిమార్ట్ సూపర్ మార్కెట్ల నిర్వహణ సంస్థ అధినేత రాధాకిషన్ ధమానీ ఉన్నారు. డీమార్ట్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన నేపథ్యంలో ఆయన ఆస్తి భారీగా పుంజుకొని ఏకంగా 930 కోట్ల డాలర్లకు చేరుకొంది. దాంతో ఆయనకు ఈ సారి లిస్ట్లో 12వ స్థానం దక్కింది. రీఎంట్రీ ఇచ్చిన ప్రముఖుల్లో ఫ్యూచర్ గ్రూపు సీఈవో కిశోర్ బియానీ సైతం ఉన్నారు. 275 కోట్ల డాలర్ల ఆస్తితో ఆయన 55వ స్థానంలో నిలిచారు. సోదరులు మురళీ ధర్, బిమల్ గ్యాన్చందానీకి (196 కోట్ల డాలర్లు) 75వ స్థానం దక్కింది.