నేవీ ఆణిముత్యం విరాట్కిక సెలవ్!
ఐఎన్ఎస్ విరాట్ యుద్ధ నౌకను మదర్ (అమ్మ)గా గానీ, గ్రాండ్ ఓల్ట్ లేడీ (పెద్దావిడ)అని గానీ పిలుస్తారు. 1959లో బ్రిటిష్ నేవీలో సేవలు ప్రారంభించిన ఐఎన్ఎస్ విరాట్.. అప్పట్లో దీనిపేరు హెచ్ఎంఎస్ హెర్మిస్.
ముంబై: ఐఎన్ఎస్ విరాట్ యుద్ధ నౌకను మదర్ (అమ్మ)గా గానీ, గ్రాండ్ ఓల్ట్ లేడీ (పెద్దావిడ)అని గానీ పిలుస్తారు. 1959లో బ్రిటిష్ నేవీలో సేవలు ప్రారంభించిన ఐఎన్ఎస్ విరాట్.. అప్పట్లో దీనిపేరు హెచ్ఎంఎస్ హెర్మిస్. సుమారు 27 ఏళ్ల పాటు బ్రిటిష్ నేవీలో పనిచేసిన తర్వాత 1987లో దీనిని భారత్ రూ.604.5 కోట్లకు కొనుగోలుచేసి దానికి ఐఎన్ఎస్ విరాట్ అని పేరు పెట్టింది. బ్రిటిష్ తర్వాత భారత నేవీకి 30 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలందించిన ఘన చరిత్ర ఐఎన్ఎస్ది. 'జలమేవ యస్య బలమేవ తస్య' అనేది దీని నినాదం. సముద్రంపై ఎవరికి ఆధిపత్యం ఉన్న వారే శక్తిమంతులు అని దాని అర్థం. 17 శతాబ్దిలో ఛత్రపతి శివాజీ మహారాజు తన నౌకాదళ-సైనిక వ్యూహానికి ఈ నినాదాన్నే ఎంచుకున్నారు.
భారత నౌకాదళానికి అగ్రస్థాయి సేవలందించిన విమాన వాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్ కాలగర్భంలో కలిసిపోయిది. దేశానికి విరాట్ సేవలు సోమవారంతో ముగిశాయి. సాయంకాలం సూర్య భగవానుడు అస్తమిస్తున్న వేళ.. సుదీర్ఘకాలం సేవలందించి గిన్నిస్ రికార్డుకెక్కిన యుద్ధనౌకకు అంతిమవీడ్కోలు పలికారు. సేవల నుంచి విరమించిన విరాట్ను ఏం చేయాలనేది ఇంకా తేలలేదు. విరాట్ను సముద్ర జలాల్లో ముంచివేసి డైవర్లకు పర్యాటక ఆకర్షణగా మార్చడం అనేది ఒక ప్రత్యామ్నాయమని నౌకాదళాధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా అన్నారు. మన టూరిస్టు హార్బర్లలో ఒకదానిని ఎంచుకుని విరాట్ను జలనిక్షిప్తం చేయడం, మెరైన్ మ్యూజియంగా మార్చి డైవర్లకు ఆకర్షణగా మలుచడం అనేది ఒక ప్రతిపాదన. ఇదివరకే కొన్ని విమాన వాహక నౌకలను అలా నీటిలో భద్రపరిచామని లాంబా చెప్పారు.
నాలుగు నెలల్లో ఎవరూ కొనేందుకు ముందుకు రాకపోతే నౌకను ముక్కలు చేసి తుక్కు కింద అమ్మేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎవరి బిడ్ విజయవంతమై కాంట్రాక్టు దక్కుతుంది? అనే దానిపై అంతా ఆధారపడి ఉంటుందని లాంబా వివరించారు. నౌకను ముక్కలు చేసేందుకు గుజరాత్లోని ఆళంద్ రేవుకు తరలిస్తున్నారా? అని అడిగితే ఏదైనా నాలుగు నుంచి ఆరు మాసాల తర్వాతే జరుగుతుందని సమాధానమిచ్చారు. 'నా మనసులో మరో ప్రతిపాదన కూడా ఉంది.. దానిని ముందుకు తెస్తాను.. ఏం జరుగుతుందో చూద్దాం' అని అడ్మిరల్ లాంబా అన్నారు. ఘన చరిత్ర గల ఐఎన్ఎస్ విరాట్ యుద్ధ నౌకను హోటల్ గా గానీ, మ్యూజియంగా మార్చేందుకు అనుమతించి, దాన్ని తమకు అప్పగించాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించింది.
అలలపై అమ్ములపొది
ఐఎన్ఎస్ విరాట్ యుద్ధ నౌక బరువు 28,700 టన్నులు. దీని పొడవు 226.5 మీటర్లు. వెడల్పు 48.78 మీటర్లు. 150 మంది అధికారులు, 1500 మంది నావికులు ఉండే ఈ యుద్ధనౌక మీద వైట్ టైగర్స్ అని పిలిచే సీహ్యారియర్స్ యుద్ధ విమానాలు ప్రధాన పోరాటశక్తిగా ఉండేవి, ఇవే కాదు జలాంతర్గాములను ధ్వంసం చేసే 'సీకింగ్ ఎంకే42బీ' విమానాలు, హార్పూన్లుగా పిలువబడే 'సీకింగ్ ఎంకే42సీ' విమానాలు, చేతన్, ధ్రువ్, రష్యన్ కామోవ్ హెలికాప్టర్లు దీని మీద ఉండేవి.
కీలక ఆపరేషన్లలో భాగస్వామ్యం
ఐఎన్ఎస్ విరాట్ పలు కీలక ఆపరేషన్లలో పాల్గొన్నది. శ్రీలంక శాంతిస్థాపక కార్యకలాపాల్లో భాగంగా చేపట్టిన ఆపరేషన్ జూపిటర్లో ప్రధాన పాత్ర పోషించింది. భారత పార్లమెంట్పై దాడి జరిగినప్పుడు దాయాది దేశం పాకిస్థాన్తో అమీతుమీ తేల్చుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ పరాక్రమ్లోనూ ఐఎన్ఎస్ విరాట్ ముఖ్యభాగంగా ఉంది. 2,250 రోజుల సుదీర్ఘ సేవాకాలంలో 10.94 లక్షల కిలోమీటర్లు ప్రయాణం సాగించింది. ఇది భూమి చుట్టూ 27 సార్లు ప్రదక్షిణం చేయడంతో సమానం. దీనిపై ఉండే విమానాలు 22,034 కిలోమీటర్ల దూరం గగనతలంలో విహరించాయి.
చివరి మజిలీ
ఐఎన్ఎస్ విక్రాంత్ తర్వాత రెండో విమానవాహక యుద్ధనౌకగా నిలిచిన విరాట్ చివరి యాత్ర గత ఏడాది జూలైలో ముంబై నుంచి కోచి వరకు సాగింది. సేవావిరమణ కార్యక్రమం కోసం గతేడాది అక్టోబర్లో మళ్లీ ముంబైకి తరలించారు. ముంబైలో జరిగిన అంతిమ వందనసమర్పణ కార్యక్రమంలో నౌకాదళాధిపతి అడ్మిరల్ లాంబా, పశ్చిమ నౌకాదళ కమాండర్ వైస్ అడ్మిరల్ గిరీశ్ లుథ్రా పాల్గొన్నారు. విరాట్లో పనిచేసిన 22 మంది మాజీ కమాండర్లలో 21 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.