'పెళ్లి'పై నేటితరం యువతులు: ఇవీ వారి ఆలోచనలు.. అందం కన్నా!
ఇక అబ్బాయి నచ్చాలే గానీ కులం, మతం, జాతకాలు వంటి పట్టింపులకు అమ్మాయిలు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు.
హైదరాబాద్: కాలం మారుతున్న కొద్ది పెళ్లిళ్ల విషయంలో మగువల ఆలోచనలు మారిపోతున్నాయి. ఒకప్పుడు తల్లిదండ్రులు చూపించిన వరుడినే.. మరో మాట లేకుండా వివాహం చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.
నచ్చిన వరుడిని ఎంచుకోవడంలో తల్లిదండ్రులు కూడా వారికి స్వేచ్చనిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి నిర్వహించిన ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. పెళ్లి విషయంలో నేటితరం మగువల ఆలోచనలు ఎలా ఉంటున్నాయో సర్వే స్పష్టం చేసింది.
ఉమ్మడి కుటుంబాలు వద్దంటున్నారు:
ముఖ్యంగా ఈ తరం అమ్మాయిలు పెళ్లి తరువాత ఉమ్మడి కుటుంబాల్లో ఉండేందుకు ఏమాత్రం సుముఖంగా లేరని సర్వేలో వెల్లడైంది. ఉమ్మడి కుటుంబాల్లో అంత స్వేచ్చ ఉండదనేది వారి భావన. ఇక అబ్బాయి నచ్చాలే గానీ కులం, మతం, జాతకాలు వంటి పట్టింపులకు అమ్మాయిలు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు.
ప్రొఫెషన్ తర్వాతే అందం
చాలామంది అమ్మాయిలు వృత్తిరీత్యా.. తమ ప్రొఫెషన్ కు చెందిన అబ్బాయినే కోరుకుంటున్నట్టు తేలింది. ముందు ప్రొఫెషన్, ఆ తర్వాత అందం గురించి ఆలోచిస్తున్నారట. ఒకే ప్రొఫెషన్ కు చెందినవాడైతే బాగుంటుందని 90శాతం మంది చెప్పారట.
విదేశీ వరుడు కావాలనేవారు 80శాతం
80శాతం మంది యువతులు విదేశీ వరుడు అంటే ఆసక్తి కనబరచగా.. 65శాతం మంది కుల మతాలతో పని లేదని చెప్పారట. ఇక 50శాతం మంది జాతకాలు కూడా అవసరం లేదన్నారట. ఉమ్మడి కుటుంబం వద్దని 80శాతం మంది అభిప్రాయపడినట్టు సర్వే వెల్లడించింది.
పడిపోయిన బ్యూరో పెళ్లిళ్లు:
ఒకప్పుడు మ్యారేజ్ బ్యూరోల వెంట పరిగెత్తిన చాలామంది తల్లిదండ్రులు ఇప్పుడు వాటి ముఖం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. చాలావరకు బ్యూరో పెళ్లిళ్లు ఏదో ఒక కారణంతో పెటాకులవుతున్న పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. దీంతో తెలిసినవాళ్ల సంబంధాల కోసమే తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు. గడిచిన కొన్నేళ్లుగా బ్యూరో పెళ్లిళ్ల సంఖ్య గణనీయంగా పడిపోయిందని తెలుస్తోంది.