ఒకే కులంలో పెళ్లా?.. ఇదీ ముప్పు: సీసీఎంబీ పరిశోధనలో వెలుగుచూసిన నిజాలు..
వందల ఏళ్లుగా మనదేశంలో కొనసాగుతున్న ఇలాంటి అంతర్వివాహాల వల్ల భవిష్యత్తులో ప్రమాదమే అంటున్నారు శాస్త్రవేత్తలు.
హైదరాబాద్: భారత్ లాంటి సాంప్రదాయ దేశాల్లో పెళ్లంటే కులం పట్టింపులు, జాతకాల పట్టింపులు ఎంతలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఆస్తి, అంతస్తు, విలువల కన్నా ముందు కులం, జాతకమే ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ రెండూ కుదిరితేనే పెళ్లి గురించి ఆలోచించడానికి ఇష్టపడుతారు. లేదంటే అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేస్తారు.
వందల ఏళ్లుగా మనదేశంలో కొనసాగుతున్న ఇలాంటి అంతర్వివాహాల వల్ల భవిష్యత్తులో ప్రమాదమే అంటున్నారు శాస్త్రవేత్తలు. చూడాల్సింది జాతకాలు, కులాలు కాదని జన్యుక్రమాన్ని విశ్లేషించుకోవాలని చూస్తున్నారు. అంతర్వివాహా(ఒకే కులంలో పెళ్లి) పద్దతుల వల్ల కొన్ని దీర్ఘకాలిక మొండి వ్యాధులు.. తరతరాలకు వ్యాపిస్తున్నాయని చెబుతున్నారు.
సీసీఎంబీ సైంటిస్టులు తేల్చారు:
సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లోని దాదాపు 2800మంది జన్యువులను విశ్లేషించడం ద్వారా ఈ అంచనాకు వచ్చినట్లు సీసీఎంబీ శాస్త్రవేత్త కె.తంగరాజ్ మంగళవారం తెలిపారు.
పరిశోధన వివరాల ప్రకారం.. దక్షిణాసియాలోని దాదాపు 5,500 వరకు ప్రత్యేక జనసమూహాలు ఉన్నాయి. వీరిలో చాలావరకు సమూహాలు అంతర్వివాహా పద్దతినే పాటిస్తున్నారు. బయటి కులాలకు, జాతులకు చెందినవారిని వీరు వివాహం చేసుకోరు. దీంతో వీరిలో కొన్ని అరుదైన జన్యువ్యాధులు ప్రబలుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
Recommended Video
దీర్ఘకాలిక వ్యాధులు ఒకే కులంలో:
ఇందుకు కొన్ని ఉదాహరణలను కూడా వివరిస్తున్నారు. కొన్ని సామాజిక వర్గాలకు చెందినవారికి శస్త్రచికిత్సల సమయంలో ఇచ్చే అనస్తీషియా(మత్తు మందు) పనిచేయదని చెబుతున్నారు. అలాగే కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక సామాజిక వర్గ ప్రజలకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కవంటున్నారు. మరో కులానికి చెందినవారిలో ఆర్థరైటిస్(మోకాళ్ల నొప్పుల) సమస్యలు ఎక్కువని గుర్తించారు.
జన్యుక్రమాలపై పరిశోధన:
ఈ వ్యాధులకు కారణాలేంటో తెలుసుకునేందుకు దక్షిణాసియాలోని దాదాపు 275భిన్న ప్రాంతాలకు చెందిన 2,800మంది జన్య క్రమాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. వీరిలో దాదాపు వంద తరాలుగా వారసత్వంగా వస్తున్న డీఎన్ఏ భాగాలను గుర్తించారు. ఈ డీఎన్ఏ భాగాన్ని ఐడెంటిటీ బై డీసెంట్ అని పిలుస్తారు.
వీరిలో దాదాపు 81వర్గాల ప్రజల్లోని జన్యువులో కొన్ని వ్యాధులకు సంబంధించిన మార్పులను గుర్తించారు. ఇందులో భిన్న కులాల, మతాల, భాషలు మాట్లాడేవారు ఉన్నారు. ఇలాంటి జన్యు మార్పులు ఒకే కులంలో లేదా వర్గంలో ఎక్కువగా జరుగుతూ వస్తున్నందువల్ల.. అంతర్వివాహాం చేసుకునే జంటల పిల్లలకు ఈ వ్యాధులు సంక్రమించే అవకాశముంది.
కులాంతర వివాహాలు జరగకపోవడం వల్ల ఒక్క కులానికే ఇవన్ని పరిమితమైపోయాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కులాంతర వివాహాల వల్ల మాత్రమే ఈ పరిస్థితిలో మార్పు వస్తుందంటున్నారు.
జాతకాలు కాదు జన్యు క్రమమే ముఖ్యం:
ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టాలనుకునేవాళ్లు.. జాతకాలకు బదులు జన్యు క్రమాలున పరీక్షించుకోవాలని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. యూదులు జన్యు పరీక్షల తర్వాతే పెళ్లి చేసుకుంటారని గుర్తుచేస్తున్నారు.
డోర్ యషోరిమ్ అనే వెబ్ సూట్ యూదుల జన్యు క్రమాన్ని విశ్లేషించి ఆ సమాచారాన్ని రహస్యంగా ఉంచుతుందని, వివాహం చేసుకోవాలనుకుని ఎవరైనా సంప్రదిస్తే.. వారిలో వ్యాధి కారక మార్పులు ఏమైనా ఉన్నాయా లేదా అన్నది వారు తెలియజేస్తారని చెప్పారు.
దక్షిణాసియా ప్రజలకు ఇలాంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే తర్వాతి తరాలు మరింత ఆరోగ్యంగా ఉంటాయన్నారు.