డేరా బాబాను 'దోషి'గా తేల్చిన జడ్జి ఈయనే; బాబా సంతానంలో ఆమె దర్శకురాలు..
రెండేళ్లు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేసిన అనంతరం 2012లో హర్యానా జ్యుడిషియల్ సర్వీసుకు ఎంపికయ్యారు.
చంఢీగఢ్: గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ బాబాను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చడంతో.. పంజాబ్-హర్యానాల్లో ఎంతటి విధ్వంసం చోటు చేసుకుందో తెలిసిందే. ఈ సంచలన తీర్పునిచ్చిన జడ్జి పేరు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
జగ్దీప్ సింగ్ అనే న్యాయమూర్తి బాబాను దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చారు. ఈయన 2000 సంవత్సరంలో పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకున్నారు. రెండేళ్లు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేసిన అనంతరం 2012లో హర్యానా జ్యుడిషియల్ సర్వీసుకు ఎంపికయ్యారు.
గతేడాదే నియామకం:
జిల్లా అదనపు జడ్జిగా మొదట సోనేపట్లో బాధ్యతలు నిర్వహించిన జగ్దీప్సింగ్.. గతేడాది సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. చదువుకునే రోజుల్లో ఆయన మంచి ప్రతిభ కనబర్చేవారని అతని స్నేహితులు చెబుతున్నారు. అంతేకాదు, జగ్దీప్ సింగ్ చాలా ఉదారవాది అని కూడా చెబుతున్నారు.
ఉదారవాది:
ఇందుకు ఉదాహరణగా ఒకసారి రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడి ఉన్న వ్యక్తిని ఆయనే స్వయంగా తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లిన సంఘటనను వారు గుర్తుచేస్తున్నారు. ఎప్పుడూ లో ప్రొఫైల్లో ఉండటమే ఆయనకు అలవాటుగా చెబుతారు.
బాబాకు నలుగురు సంతానం:
గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ భార్య పేరు హుస్నమీత్ ఇన్సా. హుస్నమీత్ మాజీ ఎమ్మెల్యే హర్మీందర్ సింగ్ కుమార్తె. గుర్మీత్-హుస్నమీత్ దంపతులకు నలుగురు సంతానం. పెద్ద కుమార్తె పేరు చరణ్ ప్రీత్ ఇన్సా, చిన్న కుమార్తె పేరు మన్ ప్రీత్ ఇన్సా. కుమార్తెలిద్దరికి పెళ్లిళ్లయ్యాయి.
దత్తత కుమార్తె.. దర్శకురాలు:
మరో అమ్మాయిని కూడా గుర్మీత్ దంపతులు దత్తత తీసుకున్నారు. దత్తత కుమార్తె పేరు హనీ ప్రీత్ ఇన్సా. గుర్ ప్రీత్ నటించిన సినిమాల్లో ఈమె కూడా నటించారు. నటించడమే కాదు, దర్శకత్వ బాధ్యతలు కూడా హనీ ప్రీతే చూసుకున్నారు. ఇక ఆయన కుమారుడు జస్ ప్రీత్ ఇన్సా ప్రస్తుతం డేరా సచ్చా సౌదా కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.