వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూగర్భంలో ముంచుకొస్తున్న ముప్పుకు ఏదీ దారి?

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సమాజానికి శక్తినిచ్చే ప్రకృతి సంపదే విపత్తుగా మారుతుంది. మానవ ప్రయత్నాలకు లొంగని మారణహోమంగా అవతరిస్తుంది. ఖనిజ సంపదకు నిలయమైన జార్ఖండ్‌లో జరుగుతున్నదిదే. భూగర్భంలోని బొగ్గు అగ్నికీలలుగా మారింది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పూర్తిగా అదుపులోకి రావడం లేదు. ఇదేదో ఈ మధ్య తలెత్తిన ఉపద్రవం కాదు. అక్షరాలా వందేళ్లనాటిది.

ప్రకృతి వైపరీత్యాలతో పాటు, మానవ తప్పిదాలూ ఈ దారుణానికి కారణాలు. బొగ్గు గనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ అనుభవం నుంచి తప్పకుండా గుణపాఠం నేర్చుకోవాల్సి ఉంటుంది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ అంటే పరిశ్రమలకు కేంద్రం. సమీపంలో ఉన్న ఝరియా బొగ్గు గనులకు నిలయం. ఈస్ట్‌ ఇండియా కంపెనీ హయాంలో అంటే 1894లోనే ఇక్కడ బొగ్గు తవ్వకాలు ప్రారంభమయ్యాయి.

గుజరాత్‌లోని కచ్‌ ప్రాంత వాసి ఖోరా రాం చావ్డా తొలిసారిగా ఇక్కడ బొగ్గుగని ఏర్పాటు చేశారు. ఈ రంగంలో ప్రవేశించిన తొలి భారతీయుడూ ఆయనే. 1916లో తొలిసారిగా ఓ గనిలో మంటలు కనిపించాయి. 1930లో చావ్డాకు చెందిన ఖాస్‌ ఝరియా, గోల్డెన్‌ ఝరియా అనే రెండు గనులు కూలిపోయాయి. ఆయన బంగళా కూడా భూగర్భంలో కలిసిపోయింది. ఈ గనుల్లోనూ మంటలు వ్యాపించాయి. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో మంటలు విస్తరిస్తూనే ఉన్నాయి.

Jharia mine fire: People in danger zone to be shifted at any cost, says coal secretary Sushil Kumar

భూమిలోనే మండుతుండడంతో కొన్ని చోట్ల మంటలు పైకి కనిపించవు. భూగర్భం నుంచి వచ్చే పొగలు కనిపిస్తుంటాయి. నేల బాగా వేడక్కడంతో చెప్పుల్లేకుండా నడవడమూ కష్టమే. కొన్ని సార్లు వూపిరి తీసుకోవడానికీ ఇబ్బందే. 72 చోట్ల మంటలు కనిపిస్తుండగా, ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా అందులో కొన్ని చల్లబడ్డాయి. ఈ ప్రమాదం వల్ల 3.7 కోట్ల టన్నుల బొగ్గు వృథా అయిందని అంచనా. మరో 200 కోట్ల టన్నుల బొగ్గు తవ్వడానికి వీలు లేకుండా పోయింది.

డబ్బు సంపాదనపై ఆశతో ఇలా ప్రక్రుతి నాశనం

సాధారణంగా బొగ్గు భూమిలో 200 - 300 మీటర్ల లోతున దొరుకుతుంది. కానీ ఇక్కడ 15 మీటర్ల లోతున కూడా లభిస్తుంది. దీన్నే శాస్త్రీయ పరిభాషలో అవుట్‌ క్రాప్‌ ఏరియాలో బొగ్గు లభించడమే ఇప్పుడు శాపంలా మారింది. పై పొరల్లో ఉన్న ఒత్తిడి కారణంగా నిప్పు పుడుతుంది. తొలి దశలో ప్రమాదాలకు ఇదే కారణం. బాగా పైభాగంలోనే బొగ్గు నిల్వలు ఉండడం వల్ల త్వరగా మంటలు వ్యాపించడానికి ఆస్కారం కలిగింది.

1934లో సంభవించిన నేపాల్‌-బిహార్‌ భూకంపం తర్వాత మంటలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. పిడుగులు పడడంతోనూ మంటలు చెలరేగిన సందర్భాలు ఉన్నాయి. మొదట్లో బొగ్గు తవ్వకాల్లో అంతగా శాస్త్రీయ ప్రమాణాలు పాటించేవారు కాదు. నిల్వలు పూర్తయిన గనులను మూసివేసేటప్పుడు కూడా కచ్చితమైన విధానాలను అమలు చేయాలి. అప్పట్లో అవన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండడంతో దీనికి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు.

Jharia mine fire: People in danger zone to be shifted at any cost, says coal secretary Sushil Kumar

కాలక్రమంలో గనుల్లో మిగిలిన బొగ్గుకు మంటలు అంటుకొని సమీప ప్రాంతాలకు వ్యాపించాయి. అన్నింటికన్నా ముఖ్యమైనది అక్రమ తవ్వకాలు. సాధారణ పని ముట్లతో తవ్వినా బొగ్గు దొరికే అవకాశం ఉండడంతో చాలా మందికి ఇది స్వయం ఉపాధిలా మారింది. ఇటీవల కాలం ప్రమాదాలకు ఇదే అసలు కారణం. ఇష్టం వచ్చినట్టు గోతులు తవ్వడం, తరువాత వాటని అలాగే వదిలేయడంతో ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రమాదం ముంచుకొస్తోంది. ఇక్కడి పొలాలు, అడవులు బొగ్గు గనులుగా మారడం వల్లనే ఉపాధి కోసం ఈ అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని కొందరు చెబుతున్నారు. పెద్దగా కష్టపడకుండా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో ప్రకృతి సంపదను నాశనం చేస్తున్నారని ఇంకొందరు విమర్శిస్తున్నారు.

రైలు మార్గం బదిలీ ఇలా

1971లో బొగ్గు గనులను జాతీయం చేసి వీటిని ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ కోకింగ్‌ కోల్‌ సంస్థకు అప్పగించాక పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. మంటలు విస్తరించకుండా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. గనుల్లోకి నీరు పంపడం, ఇసుకతో నింపడం, నైట్రోజన్‌ గ్యాస్‌ను పంపడం వంటి చర్యలతో కొన్ని చోట్ల మంటలు విస్తరించకుండా అదుపులోకి వచ్చాయి.

ఇక్కడ వారికి సురక్షిత ప్రాంతాల్లో పునరావాసం కల్పించడానికి ఝరియా పునరావాసం, అభివృద్ధి ప్రాధికార సంస్థ (జేఆర్‌డీఏ) ఏర్పాటైంది. బాధితుల కోసం బహుళ అంతస్తుల భవనాలు నిర్మించింది. అక్కడా అవినీతి చోటు చేసుకోవడం, అర్హులకు ఫలాలు అందకపోవడంతో అక్రమ తవ్వకాలు ఆగలేదు. భూ గర్భంలోని బొగ్గు మండుతూ పైకి వ్యాపించడంతో అది రైలు పట్టాలను తాకే పరిస్థితికి వచ్చింది. దాంతో గత నెలలో ధన్‌బాద్‌ - చంద్రాపుర రైల్వే లైనును పూర్తిగా ఎత్తివేశారు. మొత్తం 35 కి.మీ. పొడవు ఉన్న ఈ మార్గంలో 14 కి.మీ. అత్యంత ప్రమాదకరంగా మారింది.

Jharia mine fire: People in danger zone to be shifted at any cost, says coal secretary Sushil Kumar

కొన్ని చోట్ల 15 అడుగుల పొడవున మంటలు కనిపించాయి. బస్జోరా స్టేషన్‌ వద్ద వీటి ఉద్ధృతి అధికంగా ఉండడంతో ఏకంగా ఈ మార్గాన్నే రద్దు చేసి రైళ్లను వేరే మార్గంలో మళ్లించారు. ఇది శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ వంటి 26 ప్రధాన రైళ్లు తిరిగే మార్గం కావడం గమనార్హం. ఝరియా ప్రాంతంలోని ఓ కాలనీని కూడా ఖాళీ చేయించారు. కొన్ని ప్రాంతాల్లో మంటలు క్రమేణా పెరుగుతున్నాయి. 2009లో పాట్నా నుంచి హజారీబాగ్‌, కొడేరమా మీదుగా రాంచీ వెళ్లే జాతీయ రహదారిని మూసివేయాల్సి వచ్చింది.

ముందస్తు చర్యలతోనే సేఫ్

కొత్త ప్రాంతాలకు విస్తరించకుండా చూడడం తప్ప ఎప్పటి నుంచో ఉన్న మంటలను పూర్తిగా ఆపడం దాదాపుగా అసాధ్యం. కొన్ని చోట్ల ఉష్ణోగ్రత 700 డిగ్రీల సెల్సియస్‌ కూడా ఉంటుంది. పరిస్థితులను గమనిస్తూ నిత్యం అప్రమత్తంగా ఉండి ప్రజలను కాపాడవలసి ఉంటుంది. దీనిపై గోదావరిఖనిలోని సింగరేణి సంస్థకు చెందిన మైనింగ్‌, అగ్నిమాపక నిపుణుడు బీమోహన్‌ మాట్లాడుతూ 'శాస్త్రీయంగా చెప్పాలంటే ఇంధనం, ఆక్సిజన్‌, ఉష్ణోగ్రత.. ఈ మూడు కలిసినప్పుడు అగ్ని పుడుతుంది.

ఇక్కడి భూమికి పగుళ్లతో వాయువు లోపలికి ప్రవేశిస్తోంది. బొగ్గు పొరల్లో సహజంగానే ఉండే ఒత్తిడికి వేడి ఉద్భవిస్తుంది. ఈ కారణంగానే మంటలు అదుపులోకి రావడం లేదు. భూమి పగుళ్లు కనిపించినప్పుడు దానిపై సిమెంట్ పూత రాసి గాలి చొరబడకుండా కొంతవరకు ప్రయత్నిస్తున్నారు. భూమిలోపలికి నీరు పంపిస్తున్నారు. ఇవన్నీ మంటలు విస్తరించకుండా చేయడానికే. తీవ్రతను గమనించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది' అని వివరించారు.

English summary
People living in the danger zone of underground mine fire in Jharia would have to be shifted at any cost, Union Coal Secretary Sushil Kumar said. The government cannot let the people die in subsidence due to underground fire and would rehabilitate them in safe places, said Kumar who visited mine fire affected residential areas of Jharia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X