ఐస్మ్యాన్: 30 ఏళ్లుగా మంచుగడ్డలే ఈయన ఆహారం!
అహ్మదాబాద్: వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం.. వీటితో నిమిత్తం లేదు. అన్ని కాలాల్లోనూ ఐసు గడ్డలు తిన్నాల్సిందే. ఎందుకంటే.. గత 30 ఏళ్లుగా ఐసు గడ్డలే ఆయన ఆహారం మరి! దీంతో ఈయన్ని అందరూ 'ఐస్మ్యాన్' అని పిలుస్తున్నారు.
గుజరాత్లోని అమ్రెలీకి చెందిన 'ఐస్మ్యాన్'గా పేరొందిన కాంతిభాయ్ మిస్త్రీకి మంచుముక్కలు తినడంతోనే రోజు ప్రారంభమవుతుంది. ఇలా ప్రతీ రెండు గంటలకూ ఐసు గడ్డలు తింటుండటంతో ఇతనిపేరు ఊరూవాడా మారుమోగిపోతోంది.
అత్యంత చలి రోజుల్లో కూడా ఈ వింత మనిషి దినచర్యలో మార్పువుండదు. కాంతిభాయ్ రోజుకు కనీసం 10 నుంచి 15 ఐసు గడ్డలను అలవోకగా లాగించేస్తాడు. ఈ మహానుభావుని ఇంట్లో రెండు ఫ్రిడ్జ్లు ఉండగా, దానిలో ఉబికివచ్చే ఐస్ను కడుపారా ఆరగించేస్తుంటాడు.
కాంతీభాయ్కు ఈ అలవాటు గత 30 ఏళ్లుగా ఉంది. పైగా దీని గురించి అతనికి ఆందోళన లేకపోగా, ఎప్పుడూ వైద్యుణ్ణి సంప్రదించింది కూడా లేదట. కార్పెంటర్ పనిచేసే ఈ 'ఐస్ మ్యాన్' తాను వెళ్లిన ఇంటి యజమానిని ఐసు గడ్డలు అడిగిమరీ ఆరగిస్తుంటాడు.
కాంతీభాయ్ మిస్త్రీ కాశ్మీర్లో స్థిరపడాలని అనుకుంటున్నాడు. అక్కడ మంచుకు కొరత ఉండదని ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఈ వింత అలవాటుపై వైద్యులు మాట్లాడుతూ ప్రపంచంలో ఇలాంటివారు అతి అరుదుగా ఉంటారన్నారు.
రక్తంలో లోటుపాట్ల కారణంగా ఇలా జరుగుతుందని, కాంతిభాయ్ తక్షణమే నిపుణులైన వైద్యులను సంప్రదించాలని, లేని పక్షంలో అతని ప్రాణాలకే ముప్పని వారు హెచ్చరిస్తున్నారు.