కాపు కోటా సాధ్యమేనా: తొమ్మిదో షెడ్యూల్ అంటే ఏమిటి?
హైదరాబాద్: రిజర్వేషన్లు యాభై శాతం దాటితే అమలు కావడం కష్టమే అవుతుంది. అయితే, అంతకు మించి అమలు చేయాలనుకుంటే దాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాల్సి ఉంటుంది.
కాపులకు యాభై శాతం వెలుపల ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించడం ఆ షెడ్యూల్ మరోసారి చర్చలోకి వచ్చింది. తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడం ద్వారానే తమిళనాడులో యాభై శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అయితే, ఇప్పటికీ అది కోర్టుల పరిధిలో ఉంది.
వివిధ సామాజిక వర్గాల నుంచి ఒత్తిడి వస్తుండడంతో వివిధ రాష్ట్రాలు ఇతర వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడానికి ముందుకు వస్తున్నాయి. కానీ, వాటికి సుప్రీంకోర్టు తీర్పు అడ్డంకిగా మారింది. 9వ షెడ్యూల్లో చేరిస్తే తీర్పు ఆదేశాలను అధిగమించవచ్చుననే అభిప్రాయంతో రాష్ట్రాలు ఉన్నాయి.
తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నాయి. కేంద్ర దాన్ని భుజాన వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఒక్కసారి దానికి పూనుకుంటే అంతు ఉండదనేది కూడా కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా చెప్పవచ్చు.
రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్చిన చట్టాలను న్యాయస్థానాలు సమీక్షించలేవనే అభిప్రాయం ఉండడం వల్ల కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నాయని భావించాల్సి ఉంటుంది.
ఎలా ముందుకు వచ్చింది....
భూ సంస్కరణలకు రాజ్యాంగ రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో 1951లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తొలిసారి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూలును రాజ్యాంగంలో పొందుపరిచారు. ఈ షెడ్యూలులో ఇప్పటివరకూ ప్రభుత్వం 284 చట్టాలను చేర్చింది. తమిళనాడు రాష్ట్రంలో 69 శాతం రిజర్వేషన్లు కల్పించే తమిళనాడు రిజర్వేషన్ల చట్టం కూడా వాటిలో ఒక్కటి
ఒక చట్టాన్ని 9వ షెడ్యూలులో చేరిస్తే ఆర్టికల్ 31- బి ప్రకారం ఆ చట్టాన్ని న్యాయస్థానాలు సమీక్షించలేవు. కానీ 9వ షెడ్యూలులో చేర్చిన 30 చట్టాలపై న్యాయస్థానాల్లో ఫిర్యాదులు చేశారు. అవి న్యాయస్థానాల విచారణలో ఉన్నాయి.
కాపులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఆ రాష్ట్రంలో రిజర్వేషన్లు 55 శాతానికి పెరుగుతాయి. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి పూనుకుంది. దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని కోరుతోంది.
కోర్టు తీర్పులు ఇలా...
రిజర్వేషన్లు మొత్తం 50 శాతానికి మించరాదని ఇందిరా సాహ్నీ - యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు న తీర్పు ఇచ్చింది. దీనికి మండల్ తీర్పుగా ప్రస్తావించింది. అప్పటి నుంచి రాష్ట్రాల్లో అయినా, కేంద్రంలో అయినా రిజర్వేషన్ల గరిష్ట పరిమితి 50 శాతంగా ఉంటూ వస్తోంది.
తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, ఒడిశా రాష్ట్రాల్లో కొన్ని కులాలకు రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాలు చేశాయి. కోర్టు తీర్పులు ఆటంకంగా మారడంతో తాము చేసిన రిజర్వేషన్ల చట్టాలను రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
న్యాయసమీక్షకు అతీతం కాదా...
9వ షెడ్యూలులో చేర్చిన చట్టాలు న్యాయసమీక్షకు అతీతమనే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు ఒప్పుకోవడం లేదు. తమిళనాడు రిజర్వేషన్ల చట్టంపై దాఖలైన (ఐఆర్ కోయెల్హో- వర్సెస్- స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు) పిటీషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైకే సభర్వాల్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం 2007లో తీర్పు చెప్పింది. 9వ షెడ్యూలులో చేర్చిన చట్టాలన్నీ న్యాయసమీక్షకు అతీతం కాదని ఆ తీర్పులో తేల్చి చెప్పింది.
ఆ చట్టాలు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విఘాతం కలిగించే విధంగా ఉంటే వాటిని సమీక్షించవచ్చని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో 1973 తర్వాత కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్చిన చట్టాలను సమీక్షించే అవకాశం కోర్టులకు చిక్కింది.
ఇరువురు సీఎంలు మభ్యపెడుతున్నారా?
తద్వారా, తెలంగాణలో కేసీఆర్ లేదా ఏపీలో చంద్రబాబు ప్రజలను రాజకీయ అవసరాల కోసం తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 9వ షెడ్యూల్లో పెడితే చాలు రిజర్వేషన్లు ఓకే అవుతాయనే భ్రమలను పెంచుతున్నారని అంటున్నారు. కానీ నిజానికి సుప్రీం కోర్టు ఆ షెడ్యూల్ స్ఫూర్తినే సమీక్షించబోతున్నదని కొందరు గుర్తు చేస్తున్నారు.