ఖైరతాబాద్ ‘శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి(ఫొటో)
హైదరాబాద్: తెలుగురాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణనాథుడు ఈయేడాది కూడా ప్రత్యేక రూపంలో దర్శనమివ్వనున్నాడు. ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు 'శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి' అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. గణపతితోపాటు..రెండు వైపులా ఏర్పాటు చేసే రెండు మండపాల్లో తిరుపతి బాలాజీ, గోవర్దనగిరిధారి ప్రతిమలు తీర్చిదిద్దనున్నారు.
ఇందుకు సంబంధిత నమూనాచిత్రాన్ని శనివారం ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ.. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి చేతుల మీదుగా విడుదల చేసింది. దుర్మిఖి నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని.. మేడిపల్లిలోని సిద్ధాంతి విఠల్ శర్మ విగ్రహ నమూనాకు ఆ పేరు ఖరారు చేసినట్టు ఉత్సవ కమిటీ ఛైర్మన్ సింగరి సుదర్శన్, విగ్రహశిల్పి రాజేంద్రన్లు వెల్లడించారు.
ఈ యేడాది కొంచె ఎత్తు తగ్గి 58 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో వినాయకుడు రూపుదిద్దుకోనున్నారు. విగ్రహం వెనుక శివలింగం, ఆ వెనుక నుంచి పైభాగం వరకు నాంగేంద్రుని పడగలు ఉంటాయి. ప్రతిమ వెనుకభాగం పుట్టతో, పుట్టపైభాగంలో..క్షీరాభిషేకం చేసినట్లు రెండు గోవులు ఉంటాయి.
స్వామికి ఎడమవైపు శక్తిపీఠాల్లోని మొదటిదైన శ్రీలంకలోని శాంకరిదేవి, కుడివైపు సరస్వతి దేవి సింహాసనంపై ఆసీనులై ఉంటారు. మొత్తంగా గణాధిపతి 6 చేతులతో.. కుడి, ఎడమలుగా పైరెండు చేతుల్లో చక్రం, శంఖం, మధ్య చేతుల్లో ఆశీర్వాదం, లడ్డూ, కింది చేతుల్లో గధ, పద్మంతో దర్శనమివ్వనున్నారు.
ప్రతీ యేడాదిలానే ఈ యేడాది కూడా లడ్డూ ప్రసాదాన్ని సురుచి ఫుడ్స్ వారు తయారు చేస్తారు. ఈ దఫా దానికయ్యే ఖర్చును చెల్లించాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. లడ్డూ 500 కిలోల్లో చేయించాలని, లడ్డూను ఏర్పాటుచేసిన మరుసటి రోజు నుంచే ప్రసాదంగా పంపిణీ చేయాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది.