కిడ్నాప్ల సంచలనాలు: బంధువులే నిందితులు!
హైదరాబాద్: నగరంలో జరుగుతున్న వరుస కిడ్నాప్లు కలకలం సృష్టిస్తున్నాయి. జరుగుతున్న కిడ్నాపుల్లో ఎక్కువ శాతం బాధితుల బంధువులే నిందితులుగా ఉండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. డబ్బుకే ప్రాధాన్యమిస్తూ.. అనుబంధాలను పక్కన పెట్టేస్తూ.. ఈ కిడ్నాపులకు పాల్పడుతున్నారు నిందితులు.
గడిచిన ఐదేళ్లలో హైదరాబాద్ నగరంలో కిడ్నాప్ల పరంపర రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది. 80శాతం వరకూ కిడ్నాప్ పన్నాగంలో బంధువులు, స్నేహితులే సూత్రధారులుగా మారుతున్నారు. వ్యవస్థీకృత నేరాలపై నిఘా ఉంచగల పోలీసులు కూడా ఇంటిదొంగల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.
ఇటీవల ఎల్బీనగర్లో మార్బుల్ వ్యాపారి కుమారుడు ఆశీష్ విజయ్ పాత్రను కిడ్నాప్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేశారు. ప్రముఖులను కిడ్నాప్ చేసేందుకు అవసరమైన డబ్బు సంపాదించేందుకు ఈ ఎత్తు వేసిన నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన నిందితుల్లో బాధితుడి బందువు కూడా ఉండటం గమనార్హం. బేగంబజార్లో రిక్షాపుల్లర్ కుమారుడు కార్తీక్ను ఓ మహిళ కిడ్నాప్ చేసింది. ఈ వ్యవహారంలో మరో ఇద్దరు నిందితులను గుర్తించిన పోలీసులు అపహరణకు కారణాలను తెలుసుకునే పనిలో ఉన్నారు.
రాజేంద్రనగర్కు చెందిన రాధిక అనే గృహిణి తననెవరో కిడ్నాప్ చేశారంటూ ఆడిన నాటకం అప్పట్లో సంచలనం సృష్టించింది. సాఫీగా సాగుతున్న సంసారాన్ని కాలదన్ని ప్రియుడి మోజులో కోల్కతా చేరింది. భర్త నుంచి పెద్ద మొత్తంలో డబ్బు గుంజేందుకు ప్రియుడితో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడింది. తిలకాన్ని రక్తమని నమ్మించారు.
బందీగా చేతులు కాళ్లు కట్టేసినట్లు ఉన్న వీడియో దృశ్యాలను వాట్సప్ ద్వారా భర్తకు పంపారు. వాస్తవాన్ని పోలీసులు తేల్చడంతో ప్రియుడితో సహా జైలు ఊసల వెనక్కి వెళ్లింది. ఇలాంటి ఘటనలు నగరంలో చాలానే చోటు చేసుకున్నాయి.
గురువారం జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాకేశ్ రెడ్డి అనే యువకుడి కిడ్నాప్, హత్య నగరంలో సంచలనం సృష్టించింది. ఇది కుటుంబ కక్షల నేపథ్యంలో జరిగిన హత్యగా పోలీసులు.. ప్రాథమిక విచారణలో తేల్చారు. గతంలో అరుదుగా జరిగే కిడ్నాప్లు.. ఇటీవలి కాలంలో మరింత పెరిగాయి.
2009లో 107 కిడ్నాప్ లు జరిగితే.. 2015, ఆగస్టు వరకు జంట కమిషనరేట్లలో నమోదైన కేసులు 175 వరకు ఉన్నాయి. పోలీసుల దృష్టికి తీసుకెళ్లకుండా గుట్టుచప్పుడుకాకుండా కిడ్నాపర్లు అడిగినంత ఇచ్చి చెర విడిపించే వారు 40శాతం వరకూ ఉండొచ్చని పోలీసులే అంగీకరిస్తున్నారు.
జంట కమిషనరేట్లలో 2012 నుంచి జరిగిన కిడ్నాప్ లను ఒక్కసారి పరిశీలించినట్లయితే.. 2012లో హైదరాబాద్లో 74, సైబరాబాద్లో 134, 2013లో హైదరాబాద్లో 120, సైబరాబాద్లో 170, 2014లో హైదరాబాద్లో 199, సైబరాబాద్లో 172, 2015, ఆగస్టు వరకు హైదరాబాద్లో 78, సైబరాబాద్లో 86 కేసులు నమోదయ్యాయి.
నగరంలో జరుగుతున్న కిడ్నాప్, నేరాలపై సైబరాబాద్ క్రైం డిసిపి నవీన్ కుమార్ మాట్లాడుతూ.. ఆర్థిక లావాదేవీలు, వ్యాపార వ్యవహారాలు, కుటుంబతగాదాలే కిడ్నాప్లకు ప్రధాన కారణమవుతున్నాయని తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే నిందితులు కిడ్నాప్లను ఎంచుకుంటున్నారని తెలిపారు.
కిడ్నాప్లలో ఎక్కువగా పిల్లలే సమిధలవుతున్నారని అన్నారు. ప్రజలు ఇలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండటం అవసరమని నవీన్ కుమార్ సూచించారు.
కాలనీలు, ఇళ్లల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నిందితులను పట్టుకోవడం సులభమవుతుందని చెప్పారు. బంజారాహిల్స్ ఏసిపి డి ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు తమ కుటుంబసభ్యులు, పిల్లల పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోవాలని. ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు ముందుగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.