కూచిపూడి గిన్నిస్ రికార్డ్: ఒకే వేదికపై చంద్రబాబు, లోకేష్, దేవాన్ష్(పిక్చర్స్)
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, టిడిపి జాతీయ కన్వీనర్ నారా లోకేష్, ఆయన కుమారుడు, అంటే చంద్రబాబు మనవడు దేవాన్ష్ ఒకే వేదికపై సందడి చేశారు. ఆదివారం నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం మైదానంలో సిలికానాంధ్ర అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం జరిగింది.
నాట్య సమ్మేళనానికి 18 దేశాలకు చెందిన కళాకారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమామహేశ్వరరావు, ఏపీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్, కృష్ణాజిల్లా పరిషత్ ఛైర్పర్సన్ గద్దె అనురాధ, తదితరులు పాల్గొన్నారు.
కాగా, ఈ కార్యక్రమంలో నారా లోకేశ్తో పాటు ఆయన తనయుడు దేవాన్ష్ కూడా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ మూడు తరాలను చూసిన టిడిపి అభిమానులు ముచ్చటపడ్డారు. గిన్నిస్ రికార్డే లక్ష్యంగా ఏర్పాటు చేసిన కూచిపూడి మహాబృంద నాట్యప్రదర్శన ఆకట్టుకుంది.
బాబు, లోకేష్, దేవాన్ష్
కూచిపూడి నృత్యం ప్రపంచంలోని అన్ని కళలలో అగ్రగామిగా నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. నాట్యాన్ని నేర్చుకునేందుకు ప్రపంచం నలుమూలల నుండి ఎంతోమంది ఔత్సాహిక కళాకారులు ఇక్కడి వస్తుండటం గర్వకారణమన్నారు. కూచిపూడికి మరింత వైభవం తెచ్చే క్రమంలో అన్ని పాఠశాలల్లో కూచిపూడి నాట్యాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.
మనవడితో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, సిలికానాంధ్ర సంయుక్తంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఐదవ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనాన్ని మూడు రోజులపాటు నిర్వహించారు. ఆదివారం జరిగిన ముగింపు కార్యక్రమానికి తన మనవడు దేవాన్ష్తో కలిసి హాజరైన సిఎం చంద్రబాబు మాట్లాడారు.
గిన్నిస్ రికార్డు
ప్రపంచ రికార్డు నెలకొల్పిన కూచిపూడి నృత్యం గురించి ఇక ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. కూచిపూడి నాట్యాచార్యులకు తగిన గుర్తింపు ఇవ్వడంతోపాటు వారికి 12 వేల రూపాయల వేతనంతో ఉద్యోగమిచ్చి వారి సేవలను వినియోగించుకుంటామన్నారు. సిద్ధేంద్రయోగి కళా క్షేత్రాన్ని ఇక నుంచి కూచిపూడి నాట్యారామం ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. సిద్ధేంద్రయోగి ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించి పిహెచ్డి స్థాయి వరకు విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ యక్షగాన కళాకారుడు పసుపర్తి రత్తయ్యకు చంద్రబాబు ప్రభుత్వం తరఫున ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
మరువలేని కళలు
మరో ముఖ్య అతిథి, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ జాతి జీవనానికి ఆధారమయిన కళలను ఎప్పటికీ మరవకూడదని, అది మరచిననాడు అంతా నిస్తేజం అవుతుందని అభిప్రాయపడ్డారు. సాంకేతికత విస్తరిస్తున్న తరుణంలో ప్రపంచం మొత్తం ఆధ్యాత్మికత కోసం ప్రస్తుతం భారత్ వైపే చూస్తోందన్నారు.
ప్రదర్శన అద్భుతం
ఐదవ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనంలో 17 దేశాల నుంచి 6117 మంది నాట్యకళాకారులు ప్రదర్శించిన ‘జయహో కూచిపూడి' నాట్య ప్రదర్శన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది. సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు, కూచిపూడి నాట్యారామం చైర్మన్ కూచిపూడి ఆనంద్ ఆధ్వర్యంలో కళాకారులు సుమారు 11 నిమిషాల పాటు కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించారు. అనంతరం శివుడి ఆనందతాండవాన్ని 19 నిముషాల పాటు ప్రదర్శించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి రుషికేష్ ప్రదర్శనను ఆద్యంతం తిలకించి, వరల్డ్ రికార్డు నమోదు అయినట్లు అధికారికంగా ప్రకటించి, అవార్డును ముఖ్యమంత్రికి అందించారు.