రద్దీకి పరిష్కారం: పండుగల వేళ ‘మధ్యేమార్గం’ శరణ్యం.. మెట్రో ప్లాన్ ఇలా
హైదరాబాద్: మెట్రో రైళ్ల ఆరంభ స్టేషన్లు మియాపూర్, నాగోల్, ఉప్పల్లోనే కోచ్లన్నీ నిండిపోతున్నాయి. అమీర్పేటలో కాలు పెట్టలేని పరిస్థితి. ఇప్పుడంటే చూసేందుకు జనం ఎగబడుతున్నారు. మున్ముందు పండుగల సమయంలో సికింద్రాబాద్, హైదరాబాద్ (నాంపల్లి) రైల్వే స్టేషన్లు, పికెట్ లోని జుబ్లీ బస్టాండ్, ఇమ్లీబన్ బస్టాండ్కు ప్రయాణికులు పోటెత్తుతారు. ప్రత్యేకించి దసరా సమయంలో తెలంగాణ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, సంక్రాంతి వేళ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు వెళ్లే వారితో సికింద్రాబాద్, హైదరాబాద్ (నాంపల్లి) రైల్వేస్టేషన్లు, పికెట్, ఇమ్లిబన్ బస్టాండ్లు రద్దీగా ఉంటాయి. కనుక పండుగల వేళ మెట్రో రూట్లలోనూ ప్రత్యేక సర్వీసులు నడుపాల్సి రావచ్చునని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇక ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లోనూ ఆఫీసులకు వెళ్లేవారు, వచ్చేవారితో బస్సుల మాదిరిగానే మెట్రో రైళ్లు రద్దీగా ఉంటాయి. కనుక లూప్ సర్వీసులు అనివార్యంగా నడుపాల్సి వస్తుంది.
మధ్యమధ్యలో మెట్రో సర్వీసుల నిర్వహణ తప్పదిలా
పండగ వేళల్లో ఇమ్లిబన్కు వెళ్లే ప్రయాణికులు ఎక్కువ. కనుక ఆ సమయంలో మియాపూర్ నుంచి ఎల్బీనగర్ కారిడార్లో చివరి వరకు మెట్రో నపడటమే కాదు.అవసరమైతే మియాపూర్ నుంచి ఇమ్లీబన్కు వరకు, అలాగే ఎల్బీనగర్ నుంచి ఇమ్లీబన్ వరకే రైళ్లను నడుపుతారు. తాజాగా మెట్రో రైలు అందుబాటులోకి వచ్చినందున ప్రస్తుతానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, పికెట్ లోని జుబ్లీ బస్టాండ్కు జనం రద్దీ గురించి చెప్పడం కష్ట సాధ్యమే. ఇప్పటికే ప్రారంభమైన మార్గంలో చూస్తే నాగోల్ నుంచి అమీర్పేట వరకు కాక పండగ వేళల్లో సికింద్రాబాద్ వరకే మెట్రో సర్వీసులు నడిపే అవకాశం ఉంది.
విదేశాల్లో ఇలా స్ల్పిట్ రివర్సల్ సర్వీసులు
కనుక మున్ముందు మెట్రో రైలుకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగానే ఉంటుందని ఇతర నగరాల్లో మెట్రో అనుభవాలు చెబుతున్నాయి. దీనికి పరిష్కారంగా ఉదయం, సాయంత్రం రద్దీ వేళ్లల్లో మధ్య నుంచి మెట్రో రైళ్లు నడిపేందుకు వీలున్నది. వీటినే మన దేశంలో లూప్ ట్రిప్స్ అని, విదేశాల్లో స్ల్పిట్ రివరల్స్ సర్వీసులు పిలుస్తున్నారు. మన దగ్గర మెట్రో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక రద్దీ ఉంటే ఇదే విధంగా మధ్యలో నుంచి కూడా మెట్రో రైలు సర్వీసులు నడపనున్నారు.
మెట్రో రైలులోనూ ఇదే పరిస్థితి
సిటీలో ఆర్టీసీ బస్సు మధ్యలో ఎక్కితే సీటు దొరకడం కష్టమే. ఆఫీసులకు వెళ్లే రద్దీ వేళల్లో సీటు కాదు కదా.. ఒక్కోసారి బస్సునూ ఎక్కలేం. మెట్రో రైలు ఇందుకతీతం కాదు. మన మెట్రోతో పాటూ.. ఇప్పటికే ప్రారంభమైన వేర్వేరు నగర మెట్రో రైల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీనికి పరిష్కారంగా విదేశాల్లో స్ల్పిట్ రివర్సల్ను అమలు చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రోలోనూ ఇదే విధానాన్ని అనుసరించేందుకు ఎంపిక చేసిన మార్గంలో ట్రాక్పై స్ల్పిట్ రివర్సల్ను ఏర్పాటు చేశారు. ఫలితంగా రద్దీ ఉన్న చోటు నుంచే మెట్రో రైలు సర్వీసు నడిపేందుకు వీలు ఉంటుంది. రివర్సల్ ఏర్పాటుతోనే మెట్రో మార్గం సగం మాత్రమే పూర్తైనా ప్రస్తుతం ఒక కొన నుంచి మరో కొన వరకు మెట్రో అనుసంధానం చేయగలిగారు.
ప్రత్యామ్నాయంగా లూప్, స్ల్పిట్ రివర్సల్ ప్రయోగాలు
సాధారణంగా మెట్రో రైలు కొద్దిదూరాల కోసం వినియోగించే ప్రజా రవాణా. అందుకే సీట్లు తక్కువ.. నిలబడేందుకు స్థలం ఎక్కువ. విదేశాల్లో ఒక్కో కారిడార్ మధ్య చాలా తక్కువ దూరం ఉంటుంది. కానీ మన అవసరాలు పూర్తిగా భిన్నం. ఎక్కువ దూరం గమ్యస్థానం చేర్చేలా కారిడార్లను డిజైన్ చేశారు. మనమే కాదు కొన్ని దేశాల్లోనూ సుదూర మెట్రో కారిడార్లు ఉన్నాయి. ఇలాంటి చోట్ల ప్రయాణికులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మధ్య స్టేషన్లలో ఎక్కే ప్రయాణికులకు నిలబడేందుకూ చోటు దొరకడం లేదు. వీటికి పరిష్కారం చూపకపోతే ప్రజా రవాణాను వదిలి సొంత వాహనాలను వినియోగించే ప్రమాదం ఉండటంతో లూప్, స్ల్పిట్ రివర్సల్ ప్రయోగాలు చేస్తున్నారు.
పొడవైన కారిడార్లలో సీట్లు దొరకడం కష్టమే మరి
ఢిల్లీ మెట్రోలో సగటున ప్రతిరోజు 25 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. దేశంలో విజయవంతంగా నడుస్తున్న ఒకటిగా నడుస్తున్న ఢిల్లీ మెట్రోలోనూ ప్రయాణికులు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. అతి పొడవైన కారిడార్లు ఢిల్లీలో ఉన్నాయి. మధ్యలో ఎక్కి చివరి స్టేషన్కు చేరుకోవాలనుకునే వారికి సీట్లు దొరకడం లేదు. అందుకే వీరిలో చివరి స్టేషన్ / మొదటి స్టేషన్ చేరుకుని అక్కడి నుంచి తిరిగి వచ్చేవారు. ఉదాహరణకు లింగంపల్లి వెళ్లాల్సిన బస్సుకు నాంపల్లిలో సీట్లు దొరకవు. అందువల్ల కోఠికి వెళితే సీట్లు సులభంగా దొరకడం అన్నమాట. మెట్రో రైళ్లలోనూ ఈ పరిస్థితికి విరుగుడుగా దుబాయ్ మెట్రోలో స్ల్పిట్ రివర్సల్ అమలు చేస్తున్నారు. రెండు చివరల నుంచి అటూఇటై మాత్రమే కాక రద్దీకి అనుగుణంగా మధ్య నుంచి మధ్య వరకు రైళ్లను నడిపే అవకాశం ఉంటుంది.
సాఫీగా సాగుతున్న మెట్రో ప్రయాణం
మెట్రో రైలు ప్రజలకు అందుబాటులోకి వచ్చి ఆరు రోజులు గడుస్తున్నా రద్దీ తగ్గనే లేదు. శని, ఆదివారాల మాదిరిగా కాకున్నా, అధికారుల అంచనాల కంటే ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు. సోమవారం సుమారు లక్ష మంది మెట్రో ఎక్కినట్లు అధికారులు తెలిపారు. గత రెండు, మూడు రోజులతో పోల్చితే స్టేషన్లలో రద్దీ కొంతవరకు తగ్గడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం చాలామంది మెట్రోలో ప్రయాణానికి ఆసక్తి చూపారు. మెట్రోపై నగర వాసుల్లో అవగాహన కూడా పెరిగింది. రైలు ఎక్కేందుకు క్యూ పద్ధతి పాటిస్తున్నారు. ప్లాట్ఫాంపై ఉన్న పసుపు గీతను దాటకుండా జాగ్రత్త పడుతున్నారు.
మెట్రో స్టేషన్లలో ఉన్న సమస్యలపై అధికారులు దృష్టి
నాగోల్ - మియాపూర్ మధ్య మెట్రో స్టేషన్లలో గల సమస్యల పరిష్కారంపై అధికారులు ద్రుష్టి సారిస్తున్నారు. మరుగుదొడ్ల ఏర్పాటుకు హైదరాబాద్ ఎల్అండ్టీ మెట్రో టెండర్లు పిలిచింది. ఈ ప్రక్రియ పూర్తయితే ప్రయాణికులకు మరిన్ని మరుగుదొడ్లు అందుబాటులోకి రానున్నాయి. తాగునీటి సమస్యనూ పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. పిల్లలతో రైలు ఎక్కేవారు నీళ్లు, పాల సీసాలు తమతోపాటు తీసుకెళుతుంటారు. గేట్ల వద్ద సిబ్బంది అనుమతించడం లేదని అంటున్నారు.
ప్రత్యామ్నాయాలు సూచిస్తున్న అధికారులు
ఇక స్టేషన్ల కింద యథావిధిగా పార్కింగ్ కష్టాలు వేధిస్తున్నాయి. మెట్రో స్టేషన్ వద్ద కింద ఎక్కడ పడితే అక్కడ పెట్టి మెట్రోలో కొంత దూరం వెళ్లి వస్తున్నారు. ఇంతలో పోలీసులు వాటిని తమ వాహనాల్లో ఎక్కించి పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. కొందరైతే తమ వాహనం దొంగతనానికి గురైందని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తర్వాత అసలు విషయం తెలిసి జరిమానా కట్టి తెచ్చుకొంటున్నారు. మెట్రోలో ప్రయాణించాలనుకునే వారు బస్సులో వెళ్లి సమీప స్టేషన్ వద్ద దిగడం మంచిదని అధికారులు పేర్కొంటున్నారు.