సత్వరం లాభాలు అసాధ్యం: ఐదేళ్లు ఆగాల్సిందే.. మెట్రో కార్డుతో ఇలా ప్రయాణం తేలిక
హైదరాబాద్: భాగ్యనగర చరిత్రలో మెట్రో ఒక సువర్ణధ్యాయం. వరుసగా ఐదేళ్లు కష్ట పడితేనే లాభాలు.. వాణిజ్య సముదాయాలు, ప్రకటనల ఆదాయమూ ముఖ్యమే. టికెట్ల విక్రయంతో రాబడి సగమే కానీ, దీని నిర్వహణ అంత సులభం కాదు. కత్తి మీద సామే! ప్రాజెక్టు నిర్మాణ సంస్థ 'ఎల్అండ్టీ మెట్రో' లాభాల బాట పట్టడానికి కనీసం ఐదేళ్లు పడుతుందంటున్నారు నిపుణులు. పైగా పలు చర్యలు తీసుకుంటేగాని ఇది సాధ్యం కాదు. ఒప్పంద సమయంలో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.14,130 కోట్లు. పనుల జాప్యంతో ఇది రూ.19,130 కోట్లకు ఎగబాకింది. పెరిగిన మొత్తం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్అండ్టీ లేఖలు రాసింది.
అన్ని మార్గాల్లో మెట్రోరైళ్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రోజూ 15 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా. మొత్తం ఆదాయంలో టికెట్ల ద్వారా 50 శాతం, మాల్స్ నుంచి 45, ప్రకటనల ద్వారా 5% సంపాదించుకోవాలన్నది నిబంధన. కానీ, ప్రస్తుతం మియాపూర్ - నాగోల్ మార్గం మాత్రమే అందుబాటులోకి రానున్నది. దీంతో ఇప్పటికిప్పుడు టికెట్ల ద్వారా రావాల్సిన వాటా రాబడి కూడా రాదన్నమాట.
ఇలా ఖాళీ స్థలాలు ప్రభుత్వ స్థలాల కేటాయింపు
మెట్రో డిపోల కోసం మియాపూర్ దగ్గర 103, నాగోలు వద్ద 100 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. ముఖ్య కూడళ్లు, కీలక ప్రాంతాల్లో మరో 57 ఎకరాలిచ్చింది. ఎర్రమంజిల్, పంజాగుట్ట, మాదాపూర్, మలక్పేట వద్ద వాణిజ్య సముదాయాలు నిర్మాణంలో ఉన్నాయి. రాయదుర్గంలో కేటాయించిన 15 ఎకరాల్లో హైదరాబాద్లోనే రెండు అతిపెద్ద మాల్స్ను ఇక్కడ నిర్మించాలని మెట్రో తలపెట్టింది. మియాపూర్, నాగోలు టెర్మినల్ స్టేషన్ల వద్ద నాలుగేసి ఎకరాలు, సికింద్రాబాద్ పాత గాంధీ ఆస్పత్రి దగ్గర 5.05 ఎకరాలను సర్కారు లీజుకు ఇచ్చింది. వీటన్నిటా పార్కింగ్ వసతితో కూడిన భవనాలను నిర్మించి, అద్దె రాబట్టుకుంటే గాని.. మెట్రోకు 45% ఆదాయ వాటా సమ కూరదు. స్థిరాస్తి అంచనాలకు అనుగుణంగా ఇప్పుడా సంస్థ మాల్స్ నిర్మాణం ప్రారంభించింది. అన్నిచోట్లా నిర్మాణాలు పూర్తి చేయడానికి మూడు నుంచి ఐదేళ్లు ఏళ్లు అవసరమనీ టికెట్లు, మాల్స్ ద్వారా పూర్తిస్థాయి ఆదాయం రావడానికి ఐదేళ్లు పడుతుందని సంబంధిత మెట్రో రైలు వర్గాలు చెబుతున్నాయి. ఇక స్తంభాలపై హోర్డింగులు, ఇతరత్రా రూపాల్లో ప్రకటనల ద్వారా ఆదాయం పుంజుకోవడానికి నాలుగేళ్లు పడుతుందని భావిస్తున్నారు.
సింగపూర్లో ట్రామ్ రైళ్లతో ఇలా అనుసంధానం
సింగపూర్ తదితర కొన్ని దేశాల్లోని మెట్రోలు పూర్తిస్థాయి వసతులు కల్పించి, ప్రజాదరణను చూరగొన్నాయి. సింగపూర్ మెట్రోను కాలనీల నుంచి జనాన్ని తీసుకొచ్చే ట్రామ్ రైళ్లతో అనుసంధానం చేశారు. వాణిజ్య సముదాయాలతో పాటు పెద్దపెద్ద బహుళ అంతస్తుల భవనాలకూ స్టేషన్ల నుంచి ఆకాశ మార్గాలను నిర్మించారు. హైదరాబాద్లోనూ బస్సు, రైల్వేస్టేషన్లు, కీలక షాపింగ్ కాంప్లెక్సులకు ఆకాశ మార్గాలను ఏర్పాటుచేస్తే, మెట్రోరైళ్లు ప్రయాణికుల ఆదరణను పొందుకునే అవకాశం ఉంది. ఇలాంటి చర్యలతో నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ' త్వరగా లాభాలబాట పట్టవచ్చని నిపుణులు అంటున్నారు.
ఇలా 16 సేవలందుకోనున్న మెట్రో స్మార్ట్ కార్డు
మంగళవారం నుంచి సర్వీసులు ప్రారంభించనున్న హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ మెట్రో స్మార్ట్ కార్డును రూపొందించింది. ఈ స్మార్ట్ కార్డుతో మెట్రో రైల్లో టిక్కెట్టు లేకుండానే ప్రయాణీంచొచ్చు. ఆర్టీసీ బస్లోనూ ప్రయాణం చేయవచ్చు. క్యాబ్లోనూ రయ్మంటూ పొవచ్చు. మెట్రో రైల్ స్టేషన్లోని షాపింగ్ కాంప్లెక్స్లలో జాలీగా షాపింగ్ చేయవచ్చు. ఇలా మొత్తం 16 సర్వీసులను అందిస్తోంది స్మార్ట్ కార్డ్. కేవలం రూ. 100 పెట్టి స్మార్ట్ కార్డును కోనుగోలు చేయవచ్చు. నాగోల్ మెట్రో స్టేషన్, తార్నాక మెట్రో స్టేషన్, ప్రకాశ్ నగర్ మెట్రో స్టేషన్, సంజీవరెడ్డి నగర్ మెట్రో స్టేషన్లలో మెట్రో స్మార్ట్ కార్డులను విక్రయిస్తున్నారు. మెట్రో స్మార్ట్ కార్డు కోసం టికేట్ కౌంటర్కు వెళితే ప్యాసింజర్ పేరు, సెల్ ఫోన్ నంబర్, అడ్రస్ వివరాలు స్మార్ట్ కార్డులో పొందుపరుస్తారు. ఇలా క్షణాల్లో స్మార్ట్ కార్డ్ యాక్టివేట్ అవుతుంది.
మెట్రో కార్డు స్మార్ట్ రీ చార్జి చేసుకోవడం ఇలా
స్మార్ట్ కార్డు యాక్టివేషన్ పూర్తయ్యాక మెట్రో స్టేషన్లో మీకు నచ్చినంత అమౌంట్తో రీఛార్జ్ చేసుకోవాలి. స్మార్ట్ కార్డులో డబ్బయిపోతే మళ్లీ మెట్రో స్టేషన్కి వెళ్లి రీచార్జ్ చేయించుకోవాలి. మెట్రో స్మార్ట్ కార్డును స్వైప్ చేస్తే మెట్రో రైల్ తలుపులు తెరుచుకుంటాయి. మెట్రో రైల్లో ఉన్న సిస్టమ్కు మన స్మార్ట్ కార్డ్ను స్కాన్ చేసి ప్రయాణీంచాల్సిన రూట్లను టైప్ చేయాలి. రూట్లలో ఉన్న ఛార్జీలు మెట్రో స్మార్ట్ కార్డ్ నుంచి తగ్గిపోతాయి. ఇలా కార్డ్లో ఉన్న నిల్వ నగదు పూర్తయ్యే వరకు 16 రకాల సర్వీసులు పొందవచ్చు.
స్మార్టు కార్డుతో సులభంగా ప్రయాణం ఇలా
ఇప్పుడు మొదటి నెల మాత్రం మెట్రో ప్రయాణానికే పరిమితం చేస్తున్నారు. రానున్న రోజుల్లో అన్ని సేవలకు విస్తరిస్తారు. మెట్రో స్టేషన్లలో మెట్రో స్మార్ట్ కార్డులను కొనేందుకు హైదరాబాద్ నగరవాసులు ఎగబడుతున్నారు. క్యాష్ లేకుండా కార్డ్తో స్మార్ట్గా ప్రయాణించవచ్చని ప్రయాణీకులు చెబుతున్నారు. టికెట్ కౌంటర్లో నిలబడి సమయం వృధా చేసుకునే బదులు స్మార్ట్ కార్డ్ తీసుకోవడం ఉత్తమం అని అనుకుంటున్నారు.