శుభ్రత: మోడీతో చేతులు కలిపిన కాజోల్
న్యూఢిల్లీ: పర్యావరణం, పరిశుభ్రత విషయంలో తన, ప్రధాని మోడీ అభిప్రాయలు ఒక్కటేనని బాలీవుడ్ నటి కాజోల్ వ్యాఖ్యానించారు. హిందూస్తాన్ యూనిలీవర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రచార కార్యక్రమం 'హెల్ప్ ఏ చైల్డ్ రీచ్ 5'లో భాగంగా బుధవారం ఢిల్లీలో ప్రధాని మోడీని ఆమె కలిశారు.
ఈ సందర్భంగా కాజోల్ మాట్లాడుతూ ఒక తల్లిగా, నటిగా ఈ ప్రచార కార్యక్రమంలో భాగస్వామిని కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. చిన్నారుల మరణాలను అరికట్టేందుకు ఈ ప్రచార కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు.
కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛభారత్.. చేతిశుభ్రతపై మేము ప్రారంభించిన కార్యక్రమం రెండూ శుభ్రతకు సంబంధించినవే కావడం యాదృచ్ఛికమన్నారు. అంతేకాదు మేమిద్దరం ఒకే దారిలో ఉన్నామని చెప్పారు. మా లక్ష్యం కూడా ఒక్కటేనని కాజోల్ చెప్పుకొచ్చారు.
ప్రధాని మోడీ స్వచ్ఛభారత్ అభియాన్ అచ్చం 'హెల్ప్ ఏ చైల్డ్ రీచ్ 5' కార్యక్రమం లాగే ఉండటం వల్లనే ఆయనతో కలిసి ఈ కార్యక్రమంపై చర్చించానని పేర్కొన్నారు. ప్రస్తుతం మనకు శుభ్రమైన వాతావరణం కావాలన్న కాజోల్.. ఈ దిశగా మంచి సలహాలను ఇవ్వగలిగే మనిషి ఒక్క ప్రధానేనని కొనియాడారు.
పరిశుభ్రత దిశగా మేము చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ అభినందించారని ఆమె తెలిపారు. మేము ఏమి చేయలనుకుంటున్నామో అందుకు కొన్ని సలహాలను కూడా ఆయన సూచించారు. చిన్నతనం నుంచే చిన్నారులకు పరిశుభ్రతను అలవాటు చేయడం ద్వారా వారి ప్రాణాలను కాపాడిన వారిమవుతామని ఆమె తెలిపారు.