హైటెక్ సిటీకి మోనోరైలు?: అధ్యయనానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, ఓకె అయితే!..
మాదాపూర్ నుంచి గచ్చిబౌలి, నానక్ రామ్ గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, పుప్పాలగూడ, కోకాపేట ప్రాంతాలకు మోనోరైలును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.
హైదరాబాద్: మెట్రో రైలు అందుబాటులోకి వస్తే.. రాజధాని ట్రాఫిక్ కష్టాలు కొంతమేర గట్టెక్కుతాయి. అయితే నగర పరిధికి సరిపోయే రీతిలో మెట్రో సేవలు లేకపోవడంతో.. శివారు ప్రాంతాలు, హైటెక్ సిటీ లాంటి పలు ప్రాంతాల్లో మరో ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది.
Recommended Video
ఈ నేపథ్యంలో మోనోరైలు ప్రతిపాదనపై అధ్యయనానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెట్రలో సేవలు అందుబాటులో లేని నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో మోనోరైలు సాధ్యాసాధ్యాలపై నిపుణులు అధ్యయనం చేయనున్నారు. వీరు సమర్పించే రిపోర్టు ఆధారంగా భవిష్యత్తులో మోనోరైలును ప్రవేశపెట్టడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
10లక్షల మంది ఐటీ ఉద్యోగులు
మరికొద్దిరోజుల్లో అందుబాటులోకి రానున్న మెట్రో రైలు సేవలు ఎల్బీనగర్-మియాపూర్, మెట్టుగూడ-నాగోల్, జేబీఎస్-శిల్పారామం మార్గాల్లోనే పరిమితం కానున్నాయి. హైటెక్ సిటీ పరిధిలో శిల్పారామం వరకే మెట్రో సేవలు ఉండటంతో.. అక్కడి నుంచి వారు మరో వాహనాన్ని ఆశ్రయించక తప్పదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 10లక్షల మంది ఉద్యోగులు ప్రస్తుతం హైటెక్ సిటీలో పనిచేస్తున్నారు. ఏటా ఈ లెక్క పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు.
హైటెక్ సిటీ ట్రాఫిక్కు చెక్ పెట్టేందుకు!
హైటెక్ సిటీ పరిధిలోని నానక్ రామ్ గూడ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, ఇనార్బిట్ మాల్ తదితర ప్రాంతాల్లో చాలా ఐటీ కంపెనీలు ఉన్నాయి. భవిష్యత్తులో వీటి సంఖ్య మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మోనోరైలును ప్రవేశపెట్టడంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రంగా ఉంది. ఒక్కోసారి అర్థరాత్రి సమయానికి గానీ ఐటీ ఉద్యోగులు ఇంటికి చేరుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మోనోరైలు ప్రతిపాదనకు ప్రభుత్వం మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.
జయేష్ రంజన్:
మాదాపూర్ నుంచి గచ్చిబౌలి, నానక్ రామ్ గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, పుప్పాలగూడ, కోకాపేట ప్రాంతాలకు మోనోరైలును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయాన్ని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. శుక్రవారం నగరంలో నిర్వహించిన 'ఎఫ్ఎంసీ' సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించినట్టు తెలుస్తోంది.
అసలేంటి మోనోరైలు:
మోనోరైలు ఒకే పట్టా మీద ప్రయాణం సాగిస్తుంది. మెట్రోతో పోల్చితే నిర్వహణలోను, వ్యయంలోను పెద్ద భారం ఉండదు. ప్రస్తుతం దేశంలోని ముంబై, ఢిల్లీ, పుణే నగరాల్లో మోనోరైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో మొట్టమొదటిసారిగా ముంబైలో వీటి సేవలు 2014నుంచి అందుబాటులోకి వచ్చాయి.