గణేశుడి లడ్డూలను పాడుకున్న ముస్లింలు
హైదరాబాద్: తెలంగాణలో వినాయక ఉత్సవాలు మత సామరస్యాన్ని చాటాయి. ముస్లింలు వేలం పాటల్లో వినాయకుడి లడ్లను సొంతం చేసుకున్నారు. హైదరాబాదులో 45 ఏళ్ల ముస్లిం వ్యాపారవేత్త మొహమ్మద్ నజీరుద్దీన్ చాంద్రాయణగుట్ట వినాయకుడి లడ్డును పాడుకున్నారు. రూ.1.21 లక్షల రూపాయలకు ఆ లడ్డును కొనుక్కున్నాడు.
వినాయకుడి లడ్డు ప్రసాదాన్ని పొలాల్లో చల్లితే పంట బాగా పండుతుందనే నమ్మకంతోనే తాను లడ్డును పాడుకున్నట్లు ఆయన తెలిపారు తాను 2006లో కంచన్బాగ్ లడ్డు వేలం పాటలో పాల్గొని 11 వేల రూపాయలకు పాడుకున్నట్లు, ఆ లడ్డు ప్రసాదాన్ని నల్లగొండ జిల్లాలోని భువనగిరిలో గల తన పొలాల్లో చల్లినట్లు, ఆ తర్వాతి ఏడాది పంటలు బాగా పండినట్లు నజీరుద్దీన్ తెలిపారు. ఆయనకు యాకుత్పురాలో ఎలక్ట్రికల్ షాపు ఉంది.
ఇదిలావుంటే, గణేష్ లడ్డూని వేలంపాటలో ఓ ముస్లిం సోదరుడు దక్కించుకున్న సంఘటన వరంగల్లోని సెకండ్ బ్యాంక్ కాలనీలో జరిగింది. దీంతో అక్కడ మత సామరస్యం వెల్లివిరిసింది.
గణేష్ నవరాత్రుల ఉత్సవాల సందర్బంగా ఇక్కడ ఏర్పాటు చేసిన గణనాథుడి లడ్డూను వేలం పాటలో రూ. 51వేలకు మహ్మాద్ రషీద్ సొంతం చేసుకున్నాడు. లడ్డూని దక్కించిన సంతోషంలో రషీద్ మాట్లాడుతూ గణేష్ లడ్డూని దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు.
వినాయకుడి లడ్డూలు లక్షల రూపాయలు పలికిన సంఘటనలు హైదరాబాదులో పలు చోట్ల జరిగాయి. విశాఖపట్నంలోని ఓ వినాయకుడి లడ్డు అత్యధిక ధర పలికి రికార్డు సృష్టించింది.