ఇంట్లోనుంచే రాననుకున్నారు: బలహీనతనే బలంగా మార్చిన దీప
రియో డి జనీరో: రియో పారాలింపిక్స్లో భారత్కు పతకం అందించిన తొలి మహిళగా రికార్డులకెక్కిన దీపా మాలిక్ వెనక ఎంతో కృషి, కఠోర శ్రమ దాగివుంది. కాళ్లు చచ్చిపడిపోవడంతో ఎంతో వేదనకు గురైన ఆమె.. తర్వాత తనకు తాను తన బలహీనతను బలంగా మార్చుకునేందుకు నిశ్చయించుకుంది.
రజత విజేత దీపా మాలిక్
ప్రస్తుతం జరుగుతున్న రియో పారాలింపిక్స్లో దీపా మాలిక్ రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెపై రాష్ట్రపతి, ప్రధాని, క్రీడా, రాజకీయ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తూ అభినందనలు తెలిపారు. హర్యానా ప్రభుత్వం ఏకంగా రూ. 4 కోట్ల నజరానాను కూడా ప్రకటించింది. దీప సాధించిన ఘనతను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కొనియాడారు.
కఠోర శ్రమతోనే పతకం
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దీపా మాలిక్ మాట్లాడుతూ.. రజత పతకం సాధించడం వెనుక ఎంతోమంది కృషి, కఠోర శ్రమ దాగుందని చెప్పింది. తన కాళ్లు చచ్చుబడిపోయిన తర్వాత ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టలేనని అనుకున్నారని, కానీ అందరి అంచనాలను తలకిందులు చేసి తాను విజేతగా నిలిచానని ఆమె పేర్కొంది.
తొలి భారత మహిళగా రికార్డు
‘పారాలింపిక్స్లో పతకం గెలిచిన తొలి భారత మహిళగా రికార్డు సృష్టించడం ఆనందంగా ఉంది. అయితే ఈ పతకం వెనుక ఎంతోమంది కృషి, కఠోర శ్రమ ఉంది. నా భర్త, పిల్లలు మానసికంగా నాకెంతో శక్తినిస్తే.. కోచ్, ట్రైనర్ శారీరకంగా నన్ను బలాఢ్యురాలిని చేశారు' అని దీపా మాలిక్ తెలిపింది.
పతక విజేతగా గొప్పగా ఉంది
అంతేగాక, ‘కాళ్లు చచ్చుబడిపోయినప్పుడు నేను కనీసం ఇంటి నుంచి బయటకు రాలేనని అందరూ అనుకున్నారు. భారత్లో తొలి పారా బైకర్, స్విమ్మర్గానే కాక తొలి మహిళా పారాలింపిక్స్ పతక విజేతగా నిలవడం చాలా గొప్పగా ఉంది' అని దీపా ఆనందం వ్యక్తం చేసింది.