ఐఐఎంబీ సమ్మిట్లో ప్రత్యేక ఆకర్షణగా దీపికా పదుకొనె
శనివారం బెంగళూరు నగరంలో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు(ఐఐఎంబీ) అలమినీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐఐఎంబీ లీడర్ షిప్ సమ్మిట్ 2016లో ఆమె పాల్గొన్నారు.
బెంగళూరు: ప్రముఖ బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకొనె ఎప్పుడు తన సొంత నగరం బెంగళూరుకు వచ్చినా.. ఘన స్వాగతం లభిస్తుంది. శనివారం నగరంలో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు(ఐఐఎంబీ) అలమినీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐఐఎంబీ లీడర్ షిప్ సమ్మిట్ 2016లో ఆమె పాల్గొన్నారు. ఆమె రాకతో కార్యక్రమానికి భారీగా అభిమానులు చేరుకున్నారు.
ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి పియూష్ గోయల్, మణిపాల్ ఎడ్యుకేషన్ ఛైర్ పర్సన్, ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్ దాస్ కూడా హాజరయ్యారు. కాగా, దీపికను వేదికపైకి ఆహ్వానించే సమయంలో ఐఐఎంబీ బోర్డ్ ఛైర్ పర్సన్ కిరణ్ మజుందార్.. మన దీపిక పదుకొనె అంటూ సాదరంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సీనియర్ ఎడిటర్ శేఖర్ గుప్తా ఆమెతో ముఖాముఖి నిర్వహించారు. మానసిక సమస్యలు, ఒత్తిడిని ఎలా జయించానో ఈ సందర్భంగా దీపికా పదుకొనే వివరించారు. ఏదైనా కోరిక ఉంటేనే దానికి మార్గం దొరుకుతుందని చెప్పారు.
రాజకీయ ఒత్తిళ్లపై ఎక్కువగా సినీతారలు మాట్లాడరు, ఎందుకు అని ప్రశ్నించగా.. ఏదైనా సమస్య ఉన్నప్పుడు తాను మాట్లాడతానని చెప్పారు. ఒత్తిడిలో మాట్లాడేందుకు ఇష్టపడతానని చెప్పారు. పలు సందర్భాల్లో బాలీవుడ్ కూడా బలిపశువు అవుతోందని అన్నారు.