పాత ఐదువందల నోట్లతో విద్యుత్: ఒడిశా కుర్రాడి ప్రయోగం..
లచ్మన్ దుండి అనే ఇంటర్మీడియట్ విద్యార్థి పాత ఐదువందల నోటుతో విద్యుత్ ను పుట్టించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
భవనేశ్వర్: గత నవంబర్8న పాత ఐదు వందల నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించడంతో.. మరుసటి రోజే ఐదు వందల నోట్లకు దండేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలానే దర్శనమిచ్చాయి. ఇక పాత ఐదు వందల నోట్లను బఠానీలు, పకోడీలు వంటి తినుబండారాలను కట్టుకోవడానికి వాడుకోవచ్చంటూ సెటైర్లు వేశారు.
ఇవన్నీ సోషల్ మీడియాలో విపరీతంగా హల్ చల్ చేశాయి. అయితే అదే చెల్లని పాత ఐదు వందల నోటుతో ఒడిశాకు చెందిన లచ్మన్ దుండి అనే ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ విద్యార్థి చేసిన ప్రయోగం ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. పాత ఐదు వందల నోటు నుంచి ఏకంగా విద్యుత్ ను పుట్టించే ప్రక్రియను విజయవంతంగా చేసి చూపించాడు.
సైన్స్ పట్ల ఆసక్తితో పాటు ఏదైనా కొత్త దాన్ని ఆవిష్కరించాలనే తపన లచ్మన్ తో ఈ అద్భుతం చేయించింది. ఆ క్రమంలోనే ఐదువందల నోటుపై ప్రయోగాలు మొదలుపెట్టిన లచ్మన్.. దాని నుంచి విద్యుత్ పుట్టించి కరెంటు బల్బును వెలిగిస్తున్నాడు.
అయితే ఇలా ఎలా సాధ్యమన్న ప్రశ్నకు అతను చెబుతున్న సమాధానం ఏంటంటే.. 5వందల నోటుపై సూర్యకాంతి కానీ, ఏదైనా వెలుతురు కానీ పడితే దానిపై ఉన్న సిలికాన్ ప్లేట్ వల్ల ఉష్ణం పుడుతుందని, దాని నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని చెబుతున్నాడు. ప్రస్తుతం లచ్మన్ చేసిన ఈ ప్రయోగం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అతని ప్రయత్నాన్ని స్థానికులంతా అభినందిస్తుండగా.. ప్రభుత్వం సహాయం అందిస్తే అతను మరింత రాటుదేలే అవకాశముందని చెబుతున్నారు.