కీలక మలుపు: హిల్లరీ-ట్రంప్లలో ఎవరు గెలిచినా సంచలనమే
వాషింగ్టన్: ఇప్పుడు ప్రపంచం చూపు అమెరికా ఎన్నికల పైన ఉంది. ఈ రోజు ఎన్నికలు, రేపు ఫలితాలు వెల్లడి కానున్నాయి. అధికారిక ఫలితాలకు మాత్రం మరికొద్ది రోజులు వేచి చూడాలి. కానీ బుధవారం మధ్యాహ్నానికి ఫలితం మాత్రం తేలిపోనుంది.
డెమోక్రటిక్ అభ్యర్థిగా బరిలో హిల్లరీ క్లింటన్ ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. సర్వేల్లో ట్రంప్ కంటే హిల్లరీయే ముందంజలో ఉన్నారు. అయితే, ట్రంప్ గెలుపును కూడా కొట్టి పారేయలమని మరికొన్ని సర్వేలు చెబుతున్నాయి. ట్రంప్ గెలిచినా, హిల్లరీ గెలిచినా సంచలనమే అవుతుంది.
ఎవరూ గెలిచినా సంచలనమే
హిల్లరీ గెలిస్తే అమెరికా చరిత్రలో తొలి మహిళ వైట్ హౌస్ సారథిగా బాధ్యతలు స్వీకరించినట్లవుతుంది. ట్రంప్ గెలిస్తే తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టి నేరుగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడిన వ్యక్తికి పట్టం కట్టినట్లు అవుతుంది. ఎన్నడూ లేనతంగా ఈసారి ఎన్నికల ప్రచారం అత్యంత వివాదాస్పదమయింది.
ట్రంప్ దుమారం
హుందాగా వ్యవహరించే అమెరికా వ్యవస్థలో రెండు శిబిరాలూ పరస్పరం బురద జల్లుకోవడం అందర్నీ విస్మయానికి గురి చేసింది. ట్రంప్ వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి. ఆయన చేసిన ప్రసంగాలు ప్రకంపనలు సృష్టించాయి. అమెరికా ఉద్యోగాలను భారత్ తదితర దేశాల వారు తన్నుకుపోతున్నారంటూ చేసిన ఆరోపణలు, శరణార్థులు, మెక్సికన్లపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
సొంత కుమార్తె పైనా..
సొంత కుమార్తెపై అసభ్యంగా మాట్లాడిన మాటలు, పలువురు మహిళలు ఆయనపై చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఫలితాలను ఆమోదిస్తానని స్పష్టంగా చెప్పకుండా వివాదాస్పదమయ్యారు. అమెరికా వ్యవస్థ రిగ్గింగ్కు గురయిందని గతంలో ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు ట్రంప్ ఆ వ్యాఖ్యలు చేశారు.
హిల్లరీ వైపే సర్వేల మొగ్గు
ట్రంప్ వ్యవహారశైలితో సొంత పార్టీ నేతలే విసుగెత్తి ఒక దశలో ఆయనకు అభ్యర్థిత్వం దక్కకుండా ప్రయత్నించారు. కానీ చివరకు తన అభ్యర్థిత్వాన్ని నిలబెట్టుకున్నారు. అపార రాజకీయ అనుభవం ఉన్న హిల్లరీ ముందు నిలబడలేరు అనుకున్న ట్రంప్.. తొలుత వివిధ సర్వేల్లో భారీగా వెనకంజలో ఉన్నా తుది దశకు చేరుకునేసరికి అనూహ్యంగా ముందుకు దూసుకొచ్చారు. హిల్లరీపై ఉన్న ఈ-మెయిళ్ల కుంభకోణం ఆరోపణలనే ఆయన తన అస్త్రంగా ములుచుకుని పుంజుకున్నారు. అయితే హిల్లరీకి ఎఫ్బీఐ క్లీన్చిట్ ఇవ్వడంతో పరిస్థితి మారింది.
ముందస్తు ఓటింగ్
గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఏడాది అమెరికా ముందస్తు ఓటింగ్ ప్రక్రియలో రికార్డు స్థాయిలో అమెరికన్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 46.2 మిలియన్ల మంది 2016 యూఎస్ ఎన్నికల ముందస్తు ఓటింగ్లో పాల్గొన్నారు. 2012లో 32.3 మిలియన్ల మంది మాత్రమే ఈ ముందస్తు ఓటింగ్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.