ఎలక్ట్రిషియన్ అదృష్టం: ఒక్క రాత్రిలోనే మిలియనీర్ అయ్యాడు!
అబూదాబి: రాత్రికి రాత్రే మిలియనీర్ అవడం ఎవరికీ సాధ్యం కాని విషయమే. కానీ, ఓ పాకిస్థాన్కు చెందిన వ్యక్తికి మాత్రం లాటరీ రూపంలో కలిసి వచ్చింది. దీంతో అతడు ఒక్కరాత్రిలోనే మిలియనీర్ అయిపోయాడు. బతుకు దెరువు కోసం వచ్చి అప్రయత్నంగానే లాటరీ తీసుకున్నా.. అతని అదృష్టం బాగుండి ఆ లాటరీ తగిలి ఒకేసారి ధనవంతుడయ్యాడు.
వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్కు చెందిన అతిప్ నిజాం చౌదరీ ఏడేళ్ల క్రితం బతుకుదెరువు కోసం యూఏఈ వెళ్లాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్లో ఉన్న ఓ ప్రైవేటు సంస్థలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న అతిఫ్.. అక్కడి టెలికాం సంస్థ డీయూ నుంచి లక్కీడిప్కి ఎంపికయ్యాడు.
ఆ సంస్థ నిర్వహించిన లాటరీలో అతిఫ్ కొత్త ప్రీపెయిడ్ కనెక్షన్ను తీసుకున్నాడు. లక్కీడిప్లో అతిఫ్ పేరు ఉండటంతో ఆ సంస్థ మిలియన్ దిర్హమ్లను లాటరీగా ఇచ్చింది. దీంతో చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవితాన్ని సాగిస్తున్న అతగాడు ఒక్కసారిగా యూఏఈ మిలియనీర్ల జాబితాలో చేరిపోయాడు. ఇక అతిఫ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
'ఎప్పుడూ ఇలాంటి అదృష్టాన్ని నేను ఊహించలేదు. ఇంకా ఎలాంటి ప్రణాళికలు చేసుకోలేదు. దీంతో నా కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతాను' అని అతిఫ్ సంతోషంగా చెబుతున్నాడు. కాగా, 'మా వినియోగదారులను ఉత్తేజపరచడానికి ఇలాంటి లక్కీడిప్లను తరచూ నిర్వహిస్తున్నాం. దీనివల్ల కొనుగోలుదారులకు నమ్మకం పెరుగుతోంది. ఆర్థికంగా వారి జీవన స్థితిగతులు కూడా మెరుగుపరుచుకోవడానికి ఆస్కారం ఉంటుంది' అని టెలికాం సంస్థ పేర్కొంది.