లక్షల్లో లైకులతో వైరల్: ఇదీ దేశభక్తి, వాళ్లకు దేశమే సలాం..
అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో, నడుం లోతు నీళ్లలోను వారు జెండా ఆవిష్కరించి స్పూర్తి చాటుకున్నారు.
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం వస్తుంది అనగానే.. సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం. అందరూ తమ ప్రొఫైల్ పిక్స్గా భారత జెండాను పెట్టుకుని ప్రపంచానికి తమ స్పూర్తిని తెలియజేయాలని. కానీ స్ఫూర్తి అనేది కృతిమంగానో, కృతకంగా జాతీయగీతం పాడితేనో వచ్చేది కాదని ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా దేశాభిమానాన్ని చాటుకోవడమే సిసలైన దేశభక్తి అని నిరూపించారు అసోంకి చెందిన ఓ పాఠశాల వారు.
దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసోంను వరదలు ముంచిన నేపథ్యంలో అక్కడి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది ఈ చిత్రం. అంతటి విపత్కర పరిస్థితుల్లోను వారు జెండా ఆవిష్కరణ జరపడం నిజంగా దేశం గర్వించదగ్గ విషయం.
అసోంలోని ధుబ్రి ప్రాంతంలోని నష్కర ప్రాథమిక పాఠశాలకు చెందిన ఈ చిత్రం సోషల్ మీడియాలో లక్షల్లో లైక్స్ తో వైరల్ గా మారిపోయింది. ఇందులో ఇద్దరు చిన్నారులు భుజాల లోతు నీళ్లలోను, మరో అతను నడుం లోతు నీళ్లలోను, ఇంకో ఉపాధ్యాయుడు మోకాళ్ల లోతు నీళ్లలో ఉండి జెండాకు సెల్యూట్ చేశారు.
పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు మిజనూర్ రెహమాన్ ఈ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి 'ప్రస్తుతం మేము ఎలా ఉన్నామనేది చెప్పలేము.. ఈ ఫొటోనే చెబుతుంది' అంటూ తమ పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు.
కాగా, అసోం రాష్ట్ర నిబంధనల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో జరిగే ప్రతీ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను, ఫొటోలతో సహా విద్యాశాఖకు పంపించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తీసిన ఫోటోను ఉపాధ్యాయుడు మిజనూర్ రెహమాన్ సోషల్ మీడియాలో పెట్టి, జిల్లా విద్యాధికారికి పంపారు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.