నన్ను కొట్టొద్దమ్మా!: సాక్షితో మోడీ, సచిన్ కార్లు ఇవే(పిక్చర్స్)
న్యూఢిల్లీ/హైదరాబాద్: తనను కొట్టొద్దని రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత రెజ్లర్ సాక్షి మాలిక్తో ప్రధాని నరేంద్ర మోడీ సరదాగా వ్యాఖ్యానించారట. ఈ విషయాన్ని స్వయంగా సాక్షి మాలిక్ వెల్లడించింది. అంతేగాక, తాము గోదా(రింగ్)లోనే దూకుడుగా ఉంటామని, బయట మెత్తటి హృదయం కలిగిన వారమని ఆయనకు తెలిపినట్లు చెప్పింది.
కాగా, ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం జాతీయ క్రీడా అవార్డు గ్రహీతలకు తన నివాసంలో విందు ఇచ్చారు. ఈ విందులో రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన పీవీ సింధు తోపాటు కంచు పతకం సాధించిన సాక్షి మాలిక్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ షూటర్ జితూ రాయ్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కూడా హాజరయ్యారు. ఈ నలుగురూ సోమవారం జాతీయ క్రీడాదినం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా రాజీవ్ ఖేల్ రత్న అవార్డును అందుకోనున్నారు.
క్రీడాకారులకు ప్రధాని జాతీయ క్రీడా దినం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మోడీకి సింధు, సాక్షి తాము సాధించిన పతకాలను చూపించారు. రియో ఒలింపిక్స్లో దేశ గౌరవాన్ని కాపాడింది మన అమ్మాయిలేనని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. విందుకు హాజరైన క్రీడాకారులు, శిక్షకులతో ప్రధాని గ్రూప్ ఫొటో దిగారు. కార్యక్రమం అనంతరం మోడీ క్రీడాకారులను పేరుపేరునా పొడుగుతూ ట్వీట్లు రాశారు. మన్ కీ బాత్ కార్యక్రమంలోనూ ఈ క్రీడాకారులను ప్రశంసించారు. పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తిని పెంచేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు.
క్రీడాకారులతో మోడీ
జాతీయ క్రీడా అవార్డులకు ఎంపికైన ఆటగాళ్లతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. ఆదివారం తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రియో పతకధారులు పీవీ సింధు, సాక్షి మాలిక్తో పాటు ఇతర అథ్లెట్లను మోడీ కలుసుకున్నారు. వారందరినీ ప్రధాని అభినందించారు.
క్రీడాకారులతో మోడీ
మోడీని కలిసిన వారిలో సింధు, సాక్షితో పాటు షూటర్ జీతు రాయ్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఉన్నారు.
మోడీతో సింధు, సాక్షి
‘నిన్ను కలవడం చాలా ఆనందంగా ఉంది. నీవు సాధించిన దాన్ని చూసి ప్రతీ భారతీయుడూ గర్వించాడు' అని సింధూ గురించి మోడీట్వీట్ చేశారు.
మోడీతో పీవీ సింధు
‘ప్రధానికి నా పతకం చూపించా. ఆయన చాలా సంతోషించారు. అభినందించారు. బాగా ఆడానని, దేశాన్ని గర్వించేలా చేశానని మెచ్చుకున్నారు. ఈ రోజు నాకు మరపురాని రోజు. ఆయనతో మాట్లాడటం చాలా సంతోషకరమైన విషయం. ఒలింపిక్ పతకం సాధించడం చాలా అద్భుతంగా అనిపించింది. అది నా కల. నిజమైంది. చాలా సంతోషంగా ఉంది. గోపీ సర్, అమ్మా నాన్న, నాకు మద్దతుగా నిలిచిన ప్రభుత్వం, స్పాన్సరర్లు అందరికీ కృతజ్ఞతలు' అని పీవీ సింధు తెలిపింది.
సచిన్తో సింధు, సాక్షి, దీప, గోపి
రియో ఒలింపిక్స్లో పతకాలు సాధించిన క్రీడాకారులను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు. ఒలింపిక్స్లో పతకాలు సాధించిన పివి సింధు, సాక్షి మలిక్తో పాటు జిమ్నాస్టిక్స్లో అసాధారణ ప్రదర్శన చేసిన దీప కర్మాకర్, కోచ్ గోపీచంద్కు ఆదివారం గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో సచిన్ బీఎండబ్ల్యూ కార్లు బహుకరించాడు.
సచిన్తో..
తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరినాథ్, యర్నేని నవీన్, వెంకట రమణ, తాతినేని శ్రీనివాస్ల బృందం ఈ కార్లను నజరానాగా ప్రకటించింది. గోపీచంద్ ఎంతోమందికి స్ఫూర్తిప్రదాత అని సచిన్ అన్నాడు.
సచిన్తో సెల్ఫీ
‘భారత క్రీడారంగానికి ఇవి గొప్ప క్షణాలు. దేశానికి పేరుప్రఖ్యాతులు తీసుకొచ్చిన మిమ్మల్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి. ఉన్నత శిఖరాలు అధిరోహించాలి' అని సచిన్ అన్నాడు.
సచిన్
‘కాంస్యం సాధించిన సాక్షి స్వర్ణంపై గురిపెట్టడం గొప్ప విషయం. మీకెప్పుడూ మా సహకారం ఉంటుంది. యావత్ భారత్ మీ వెన్నంటి ఉంటుంది. గోపీచంద్ గొప్ప స్ఫూర్తిప్రదాత. అతనో హీరో. ఈరోజు ఎంతోమంది గోపీని ఆరాధిస్తున్నారు. గోపీ శిక్షణలో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి'' అని సచిన్ వివరించాడు.
సచిన్-అంజలితో..
ఆదివారం ఉదయం 9 గంటలకు సచిన్, అంజలి అకాడమీకి వచ్చారు. అకాడమీని పరిశీలించిన సచిన్.. సింధు, సాక్షి, దీపాలతో విడివిడిగా మాట్లాడాడు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలంటూ వారిలో స్ఫూర్తినింపాడు.
కార్లతో..
‘చాముండి సర్ గతంలో నాకు కారు బహుమతిగా ఇచ్చారు. ఒలింపిక్స్లో పతకం సాధిస్తే బీఎండబ్ల్యూ కారు ఇస్తానని చెప్పారు. చాముండి, సచిన్లకు కృతజ్ఞతలు. ఒలింపిక్స్ పతకంతో నా కల నిజమైంది' అని సింధు తెలిపింది.
కార్లతో..
‘ఒలింపిక్స్లో పతకం గెలవడం ఆనందంగా ఉంది. టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం గెలవడం నా లక్ష్యం. సచిన్ చేతుల మీదుగా కారు తీసుకోనుండటం అనిపిస్తుంది. సచిన్ అంటే నాకు, మా కుటుంబానికి ఎంతో ఇష్టం. సచిన్ ఒప్పుకుంటే కుటుంబంతో కలిసి ఫొటో తీసుకుంటా' అని సాక్షి పేర్కొంది.
నవ్వులు విరిశాయి
‘ఒలింపిక్స్లో పతకం గెలవకపోయినా ఇంత గొప్పగా ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతలు' దీపా కర్మాకర్ తెలిపింది.
కార్లతో ఇలా..
‘రియో ఒలింపిక్స్లో అమ్మాయిలే దేశం పరువు కాపాడారు. అందరూ అద్భుతంగా రాణించారు. సాక్షి, దీపా గొప్పగా ఆడారు. సచిన్ మాటలు మాలో ఎంతో స్ఫూర్తిని రగిలించాయి. అకాడమీ ప్రారంభించినప్పుడు ఒలింపిక్స్ పతకం గెలవాలన్నది నా లక్ష్యమన్నప్పుడు అంతా నవ్వారు. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. క్రీడాకారులకు చాముండి ఇస్తున్న ప్రోత్సాహం మరువలేనిది' అని గోపీచంద్ అన్నారు.