ఛలో మంథని: కులోన్మాదానికి బలైన 'మధుకర్' పాశవిక హత్యను నిరసిస్తూ..
మోకాళ్లు విరగకొట్టి, మర్మాంగాలు కోసివేసి, ముఖం పై పత్తి మందు చల్లబడి హృదయ విధారకమైన స్థితిలో మధుకర్ మృతదేహం లభ్యమైంది.
మంథని: కులాన్ని కమ్మగా పాడుకునే సమాజంలో 'మధుకర్' లాంటోళ్లు ఎలిజీలుగా మిగిలిపోతారు. ప్రేమ కలలు రక్తంతో తడుస్తూనే ఉంటాయన్న హెచ్చరికలు మళ్లీ మళ్లీ జారీ అవుతూనే ఉంటాయి. మనుస్మృతిని తలపించేలా 'మధుకర్'పై జరిగిన దాడి సమాజం మొత్తానికి ఇప్పుడొక హెచ్చరిక లాంటిది.
ఇంతలా తెగించి హత్య చేయడానికి ఎక్కడినుంచి వచ్చింది ధైర్యం?.. అత్యంత హేయంగా హత్య జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా.. పోలీసులు దాన్ని ఆత్మహత్య అని కప్పిపుచ్చుతున్నారంటే.. దీని వెనుకాల ఎవరున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మధుకర్ది ఆత్మహత్య కాదు హత్యే అని సోషల్ మీడియాలో పలువురు బలంగా అభిప్రాయపడుతున్నారు.
అదే సమయంలో ఈ ఘటనపై మౌనం వహిస్తున్న మేదావులపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంబేడ్కర్ కలల రాజ్యం రావాలని గొప్పలు పోయే కొంతమంది దళిత మేదావులు, దళిత నాయకులు.. అధికారం పంచెన చేరగానే నోళ్లకు కుట్లేసుకున్నారని మండిపడుతున్నారు. అడిగేవాళ్లెవరూ?.. అందుకే ఈ నిస్సహాయతను బద్దలు కొట్టడానికి మానవతా హృదయం ఉన్న ప్రతీ ఒక్కరు ఇప్పుడు ఛలో మంథని అంటూ కదులుతున్నారు...
ప్రేమ వ్యవహారం:
సోషల్ మీడియా కథనం ప్రకారం.. మంథని మండలం ఖానపూర్ గ్రామంలో మంథని మల్లయ్య, రాయమల్లమ్మ అనే దళితు దంపతుల కొడుకు మంథని మధుకర్ (25 ఏళ్ళు). పక్క గ్రామమైన వెంకటాపూర్ లో కాపు కుటుంభం వద్ద ట్రాక్టర్ డ్రైవర్ గా (పాలేరు) గా పని చేస్తున్నాడు. ఆ కాపు కుటుంబం అమ్మాయికి (20 ఏళ్లు). మధుకర్, అమ్మాయి గత 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
హత్యకు ముందు అదృశ్యం:
హత్యకు రెండు రోజుల ముందు మధుకర్ అదృశ్యమైనట్లుగా చెబుతున్నారు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా అతని ఆచూకీ లభించలేదు. అదృశ్యమైన రోజు రాత్రి 9.30గం. వరకు రింగ్ అయిన అతని మొబైల్ ఆ తర్వాత స్విచ్చాఫ్ వచ్చినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరుసటి రోజు స్నేహితులతో కలిసి మధుకర్ అన్న ఊరంతా గాలించాడు. ఎక్కడ ఏ ఆచూకీ లభ్యం కాలేదు.
అమ్మాయి ఫోన్ తో అసలు విషయం:
రెండు రోజులుగా మధుకర్ కోసం గాలిస్తున్న కుటుంబ సభ్యులకు అతను ప్రేమించిన అమ్మాయి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. " మధుకర్ ఇంటికి వచ్చాడా?" అంటూ ఆందోళన చెందిన అమ్మాయి.. గ్రామ కాలువల్లో, గట్టు చుట్టూ వెతకాలని ప్రస్తుతం తాను ఆసుపత్రిలో ఉన్నానని చెప్పింది. ఇంతలోనే అమ్మాయి వాళ్ల అమ్మ ఫోన్ లాగేసుకోవడంతో కనెక్షన్ కట్ అయిపోయింది.
సర్పంచే చెప్పాడా?:
అమ్మాయి చెప్పిన సమాచారంతో కుటుంబ సభ్యులంతా మరోసారి మధుకర్ కోసం వెతుకుతున్న సమయంలో.. ఖానాపూర్ గ్రామ సర్పంచ్ (అమ్మాయి మేనమామ, స్థానిక అధికార పార్టీ నాయకుడు) "కాలువ గట్టు పక్కన ముళ్ల పొదల్లో డ్రైవర్ మధుకర్ గాడి శవం ఉందంటా" అంటూ సమాచారం ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
అత్యంత హేయమైన స్థితిలో:
సర్పంచ్ ఇచ్చిన సమాచారంతో అటువైపు వెళ్లి వెతకగా అత్యంత హేయమైన స్థితిలో మధుకర్ మృతదేహం కుటుంబ సభ్యులకు దొరికింది. మోకాళ్లు విరగకొట్టి, మర్మాంగాలు కోసివేసి, ముఖం పై పత్తి మందు చల్లబడి హృదయ విధారకమైన స్థితిలో మధుకర్ మృతదేహం పడి ఉన్నది.
మనుస్మృతిని తలపించేలా:
"హీనజాతి పురుషుడు ఉన్నతజాతి స్త్రీని వలచినను మోహించినను వానికి 'లింగచ్ఛేదము, వధ, యసు దండమునకు అర్హుడు'(మనుస్మృతి:8-36). ఇది మనుస్మృతిలో రాసి ఉన్న వాక్యం. అచ్చు దీన్ని తలపించేలా ఇప్పుడు మధుకర్ హత్య జరిగింది.
ఛలో మంథని:
మధుకర్ హత్యపై సోషల్ మీడియాలో పెద్ద యుద్దమే జరుగుతోంది. పోరాటం ద్వారానే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలని భావిస్తున్న చాలామంది ప్రజాస్వామిక వాదులు 'ఛలో మంథని'కి పిలుపునిస్తున్నారు. ఏప్రిల్2, ఆదివారం నాడు మధుకర్ హత్యకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. హత్యలో స్థానిక ఎమ్మెల్యే పాత్ర ఉందన్న ఆరోపణలు ఉండటంతో.. అధికార పార్టీ మౌనాన్ని వీరంతా ప్రశ్నిస్తున్నారు. మధుకర్ కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు.