ఐటీకి ఏమైంది?: కెరీర్పై నిజంగానే కత్తి వేలాడుతోందా?, ఇదీ అసలు మర్మం..
మునుపటిలా సాఫ్ట్ వేర్ కంపెనీలకు బ్యాంకింగ్, రిటైల్, ఇంధన రంగం నుంచి ఆశించిన మేర ప్రాజెక్టులు అందకపోవడం కూడా దీనికి కారణంగా తెలుస్తోంది.
హైదరాబాద్: ఏం చేస్తున్నావని ఎవరైనా అడిగితే.. కాలర్ ఎగిరేసి మరీ 'ఐటీ' కొలువు అని చెప్పుకునే పరిస్థితి ఒకప్పుడు ఉండేది. ఎదుటివాళ్లు కూడా ఐటీ కొలువంటే అదో అద్భుతం లానే భావించేవారు. కానీ ఇప్పుడలాంటి సమాధానం వింటే.. ఐటీనా? అంటూ అదేదో వినకూడని పదంలా ముఖం తిప్పుకునే పరిస్థితి వచ్చింది.
ఉద్యోగ భద్రత కరువవడంతో.. ఐటీ జీవుల మనుగడ దినదినగండాన్నే తలపిస్తోంది. ముందస్తు సమాచారం లేకుండా.. ఉన్నపలంగా ఉద్యోగం ఊడిపోతే ఎలా? అన్న టెన్షన్ వారిని వెంటాడుతోంది. దీంతో ఐటీని కెరీర్ గా ఎంచుకోవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
టెక్కీలకు షాక్: ఉద్యోగాల కల్పన తగ్గుదల, స్కిల్స్ పెంచుకోవాల్సిందే
సరే, బయటి వ్యక్తుల మాటెలా ఉన్నప్పటికీ.. ఐటీ ఫీల్ట్ లో వాస్తవాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం.
ఇటీ టీసీఎస్ పరిస్థితి?:
దేశంలో ఐటీ దిగ్గజాలుగా చెప్పుకునే టీసీఎస్, ఇన్ఫోసిస్ కంపెనీలు ఉద్యోగాల కోత పెడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం 2017-18, ఏప్రిల్-జూన్, క్యూ-1 ఫలితాల్లో ఉద్యోగాల సంఖ్య తగ్గుతున్నట్లు స్పష్టమైంది.
టీసీఎస్ క్యూ-1లో స్థూలంగా 11,202మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకోగా.. అదే సమయంలో కంపెనీని వీడినవారు 12,616 కావడం గమనార్హం. దీంతో నికరంగా 1,414 ఉద్యోగాలు తగ్గిపోయాయి. ఉద్యోగ వలసల రేటు క్యూ-1లో 12శాతానికి ఎగబాకింది. మార్చి నెలాఖరుకు కంపెనీ ఉద్యోగుల సంఖ్య 3,87,223కాగా జూన్ నెలఖారుకు ఈ సంఖ్య 3,85,809కి పడిపోయింది.
గడిచిన మూడు నెలల్లో కంపెనీ ఎవరిని తొలగించలేదని టీసీఎస్ హెచ్ఆర్ హెడ్ అజోయ్ ముఖర్జీ తెలిపారు. అయితే కొత్త ఉద్యోగాల కల్పన కూడా తక్కువగానే ఉంటుందని ఆయన చెప్పడం గమనార్హం.
ఇన్ఫోసిస్ లో ఇదీ కథ:
ఈ ఏడాది ఏప్రిల్-జూన్ కాలానికి ఇన్ఫోసిస్ లో నికరంగా 1,811 ఉద్యోగాలు తగ్గిపోయాయి. దీంతో జూన్ చివరినాటికి ఇన్ఫీ మొత్తం సిబ్బంది సంఖ్య 1,98,553కు చేరింది. మార్చి క్వార్టర్ లో 17.1శాతంగా ఉన్న వలసల రేటు జూన్ త్రైమాసికంలో వలసల రేటు(అట్రిషన్) 21శాతానికి ఎగబాకడం గమనార్హం.
హైరింగ్ కొనసాగుతుందని చెబుతూనే త్రైమాసిక ఫలితాల్లో తగ్గిన వృద్ధి రీత్యా.. దాని ప్రభావం నియామకాలపై ఉంటుందని ఇన్ఫోసిస్ చీఫ్ విశాల్ సిక్కా చెప్పారు. వలసల రేటు పెరగడం, నియామకాల ప్రక్రియ మందగించడం.. కంపెనీ అంతర్గత ఎత్తుగడేనా? అన్న అనుమానం కూడా వినిపిస్తోంది.
నైపుణ్యం పేరు చెప్పి పనిరాదన్న ముద్ర వేసి ఉద్యోగులను సాగనంపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా సాగనంపుతున్నవారందరిని 'వలస' వెళ్లిన ఉద్యోగులుగా చూపించడం వల్లే అట్రిషన్ రేటు అంత ఎక్కువగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రాజెక్టుల మందగమనం:
మునుపటిలా సాఫ్ట్ వేర్ కంపెనీలకు బ్యాంకింగ్, రిటైల్, ఇంధన రంగం నుంచి ఆశించిన మేర ప్రాజెక్టులు అందడం లేదని తెలుస్తోంది. దేశ ఐటీ ఆదాయంలో ఈ రంగాల నుంచి వచ్చే ప్రాజెక్టులదే మెజారిటీ వాటా. హఠాత్తుగా ఈ రంగాల నుంచి ప్రాజెక్టులు తగ్గిపోవడంతో.. ఆ ప్రభావం కిందిస్థాయి ఉద్యోగుల కోతకు కారణమైంది.
దేశీ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫీ సంపాదిస్తున్న ప్రతీ 5డాలర్లు 4డాలర్లు ఈ కంపెనీల నుంచే వస్తున్నాయి. బ్యాంకింగ్, రిటైల్ రంగాల క్లయింట్లు కూడా డిజిటల్, క్లౌడ్ వంటి టెక్నాలజీల వైపు వ్యయాలను మళ్లిస్తుండటంతో.. ఐటీ కంపెనీలకు వాటిల్లోను పెట్టుబడులు పెట్టక తప్పట్లేదు.
ఈ ప్రభావంతో తమ ఉద్యోగులకు డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పించడానికి టీసీఎస్ భారీగానే ఖర్చ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 2.15లక్షల మందికి టీసీఎస్ శిక్షణ ఇప్పించినట్లు చెబుతున్నారు. మరోవైపు అమెరికాలో పరిస్థితులు కూడా ఐటీ ఆదాయానికి గండిపెడుతున్నాయి. అమెరికన్లనే ఎక్కువ జీతాలకు నియమించుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడటంతో.. అక్కడి వేతనాలకు భారీగానే ఖర్చు చేయాల్సి వస్తోంది.
అప్డేట్ అవకపోతే కష్టమే?:
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కంపెనీలు తమ ఉద్యోగులకు ఆయా విభాగాల్లో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. లేనిపక్షంలో వారిని తొలగించి కొత్తవారిని నియమించుకోవాలి. ఉన్నపలంగా భారీ సంఖ్యలో నిపుణులు దొరకడం కష్టం కాబట్టి.. అంతర్గతంగా ఆ ప్రక్రియ చేపట్టినట్లు టీసీఎస్ హెచ్ఆర్ హెడ్ అజయ్ ముఖర్జీ అన్నారు.
డిజిటల్, క్లౌడ్ వంటి కొత్త సేవల్లో అనుభవం ఉన్నవారిని పూర్తిగా బయటినుంచి తీసుకోవడం కష్టం కాబట్టి, కంపెనీలో ఇప్పుడు కొనసాగుతున్నవారికే ఆ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. సిబ్బంది ఉత్పాదకత ఇటీవలి కాలంలో 2శాతం మేర పెరిగిందని, అయితే డాలరుతో రూపాయి మారకం విలువ పెరగడం ఫలితాలను దెబ్బతిసిందని అన్నారు. ఇన్ఫీ మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్ మోహన్ దాస్ పాయ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు.
కంపెనీల వ్యయాలు తగ్గడం కూడా ఆయా సంస్థల మార్జిన్లకు ఎసరేనని అంటున్నారు. ఇన్ఫోసిస్ నిర్వహణ మార్జిన్ క్యూ1లో అరశాతం తగ్గి 24.1శాతానికి పడిపోయింది. ఇక టీసీఎస్ మార్జిన్స్ 2.3శాతం దిగజారి, 23.4శాతానికి పడిపోయింది. ఈ తరుణంలో మార్జిన్లు పడిపోకుండా ఉండాలంటే కొత్త నియామకాలు చేపట్టకుండా ఉండాలని కంపెనీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
నాస్కామ్ లెక్కలివి:
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ ఊటీ ఎగుమతుల విషయంలో నాస్కామ్ అంచనా నిరాశకు గురిచేస్తోంది. ఎగుమతుల వృద్ధి అంచనాలను తగ్గించిన నాస్కామ్ వరుసగా రెండో ఏడాది కూడా సింగిల్ డిజిట్ కే వృద్ధి రేటును పరిమితం చేసింది.
కాగా, గతేడాది ఎగుమతులు 8.3శాతం మేర పెరిగాయి. దేశీయంగా పరిశ్రమ ఆదాయం 8.6% వృద్ధితో 38 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో మొత్తం ఐటీ ఆదాయం 155బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారత స్థూల జాతీయోత్పత్తిలో ఇది 7.7శాతంలా ఉండగా, ఈ ఏడాది దేశీ ఐటీ కంపెనీలు 1.5లక్షల కొత్త ఉద్యోగాలు కల్పిస్తాయనేది నాస్కామ్ అంచనా.
దీంతో మొత్తం కొలువుల సంఖ్య 38.5లక్షలకు చేరవచ్చునని నాస్కామ్ భావిస్తోంది. గతేడాది(2016-17)లో 1.73లక్షలు, అంతకుముందు ఏడాది (2015-16)తో పోలిస్తే నియామకాల ప్రక్రియ మరింత మందగిస్తోందని తేటతెల్లమవుతోంది.