ఊపిరి ఆడకనే మౌంటేనీర్ మల్లి మస్తాన్ బాబు మృతి
చిలీ: ఊపిరి ఆడక మృతి మల్లి మస్తాన్ బాబు మృతి చెందారని శవపరీక్షలో వెల్లడైంది. చిలీలోని ఆండీస్ పర్వతాలపై మృతి చెందిన మల్లి మృతదేహానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మల్లి కెమెరాలో ఉన్న ఛాయాచిత్రాల ఆధారంగా దీనిని నిర్ధారించారు.
పర్వత శిఖరం నుండి సుమారు 650 మీటర్లకు దిగువకు వచ్చిన తర్వాత మృతి చెందారని మృతదేహాన్ని కిందకు తీసుకు వచ్చిన హెర్మన్ బృందం వెల్లడించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీ జనసంఘానికి చెందిన మల్లి.. చిలీ, అర్టెంటీనా దేశాల మధ్యన ఉన్న ఆండీస్ పర్వతాలపై ఆరువేల మీటర్ల ఎత్తులో గత నెల 24న మృతి చెందిన విషయం తెలిసిందే.
మృతదేహాన్ని బుధవారం బేస్ క్యాంపునకు తీసుకు వచ్చారు. గురువారం అర్జెంటీనాలోని టుకుమాన్ పట్టణంలో వైద్యులు శవపరీక్షలు పూర్తి చేశారు. మల్లి సోదరి అర్జెంటీనాలో ఉన్నారు. మస్తాన్ బాబు మృతదేహాన్ని మరో రెండు రోజుల్లో స్వగ్రామానికి తీసుకు రానున్నారు.
కాగా, మల్లి మస్తాన్ బాబు పట్ల ఏ ప్రభుత్వమూ కనికరించలేదని సీపీఐ రాష్ట్ర నేత నారాయణ వాపోయారు. గురువారం నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజన సంఘం గ్రామంలో మస్తాన్ బాబు కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా మల్లి మస్తాన్ సజీవంగా ఉన్నప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అతని ప్రతిభను గుర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాయన్నారు. చిలీ, అర్జంటీనా ప్రభుత్వాలు పర్వతారోహకులు ప్రమాదాలకు గురైనప్పుడు సత్వర చర్యలకు శ్రీకారం చుట్టి ఉండినా మల్లి బతికి ఉండేవారన్నారు.