ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక గౌరి లంకేశ్
అవును.. ఆమె చెప్పారంటే అది నిజమే మంగళవారం హత్యకు గురైన జర్నలిస్టు గౌరీ లంకేశ్ గురించి బెంగళూరువాసులను అడిగితే వచ్చే జవాబిది.
బెంగళూరు: అవును.. ఆమె చెప్పారంటే అది నిజమే మంగళవారం హత్యకు గురైన జర్నలిస్టు గౌరీ లంకేశ్ గురించి బెంగళూరువాసులను అడిగితే వచ్చే జవాబిది. తప్పు అనిపించే ప్రతి అంశాన్ని ఆమె ప్రశ్నిస్తారని.. అవినీతిపై ఎదురుదాడి చేస్తారని వారి నమ్మకం. రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడంలోనూ ఆమె ముందు ఉంటారు. 1992లో బాబ్రీ మసీదు ధ్వంసానికి వ్యతిరేకంగా, మతతత్వానికి వ్యతిరేకంగా నిలిచిన జర్నలిస్టుల్లో ఆమె ఒకరు.
ప్రస్తుతం జాతీయ స్థాయిలో కాషాయ పూరితంగా జరుగుతున్న మతాంతీకరణతో కూడిన రాజకీయాల పునరేకీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో నిలిచారు. ఆమె ధైర్యం ఎంతో మందికి స్ఫూర్తి. జర్నలిజంలో ఆమె ఎంతోమందికి రోల్ మోడల్. ఒక వైపు జర్నలిస్టుగా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూనే.. మరోవైపు సామాజిక ఉద్యమకారిణిగా ఎదిగారు. 1962లో జన్మించిన గౌరీ లంకేశ్ 1980వ దశకంలో జర్నలిజంలోకి వచ్చారు. ఆమె తండ్రి పీ లంకేశ్ సీనియర్ జర్నలిస్టు. గౌరి స్వయంకృషితో ఎదిగి తండ్రికి తగ్గ బిడ్డ అనిపించుకున్నారు.
గౌరి తండ్రి పీ లంకేశ్ 1980లో లంకేశ్ పత్రికె పేరుతో ఓ దిన పత్రిను ప్రారంభించారు. ఆయన 2000లో మరణించిన తర్వాత ఆ పత్రిక బాధ్యతలను ఆయన కొడుకు ఇంద్రజిత్ తీసుకున్నారు. గౌరి అందులో జర్నలిస్టుగా కొనసాగారు. కొన్నాళ్లకు గౌరి, ఇంద్రజిత్ మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయి. దీంతో ఆమె 2005లో సొంతంగా 'గౌరీ లంకేశ్ పత్రికె' పేరుతో దినపత్రికను ప్రారంభించారు. మంగళవారం హత్యకు గురయ్యే వరకు ఆ పత్రిక ఎడిటర్గా కొనసాగారు. అతివాద హిందుత్వ రాజకీయాలను ఆమె తీవ్రంగా వ్యతిరేకించేవారు. తన మనసులో ఏమున్నదో కుండబద్ధలు కొట్టినట్టు చెప్పేవారు.
సామాజిక కార్యకర్తగా నిలిచారిలా
గౌరి మరణంపై వెల్లువెత్తుతున్న సానుభూతి ఆమె ప్రాణాలకు తెగించి జరిపిన పోరాటాలకు నిదర్శనంగా నిలుస్తున్నది. గౌరి కేవలం వ్యాసాలు రాసి చేతులు దులుపుకొనే రకం కాదు. కథనం వెనుక ఉన్న ఆసక్తికర కోణాలను పరిశోధించేవారు. గిరిజన గూడెల్లో, అడవుల్లో జీవనం సాగిస్తున్న వారికి న్యాయం కోసం పోరాటం సాగించారు. చీకట్లో దాగున్న వ్యక్తులను బయటికి లాగేవారు. బాధితులకు అండగా నిలిచేవారు. అదే ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది అని ఆమె కేసులను వాదించిన లాయర్ బీటీ వెంకటేశ్ పేర్కొన్నారు. 2005లో కర్ణాటకకు చెందిన నక్సల్స్ నాయకుడు సాకేత్ రాజన్ను ఎన్కౌంటర్ చేయడంతో నిరసనలు ఉవ్వెత్తున ఎగిశాయి. ఎన్కౌంటర్ను నిరసిస్తూ జరిగిన పోరాటంలో గౌరీ లంకేశ్ నేరుగా పాల్గొన్నారు. ఆ ఘటన ఆమెలోని సామాజిక కార్యకర్తను వెలుగులోకి తెచ్చింది అని బెంగళూరుకు చెందిన సీనియర్ జర్నలిస్టు దక్షిణామూర్తి పేర్కొన్నారు.
ప్రహ్లాద్ కేసులో ఇలా బెయిల్ పొందారు
జన జీవన స్రవంతిలో కలిసిన నక్సల్స్ కుటుంబాలకు పునరావాసం కోసం కూడా ఆమె పని చేశారు. కర్ణాటకలో మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడే కొము సౌహార్ద వేదికే అనే స్వచ్ఛంద సంస్థలో గౌరీ లంకేశ్ చేరారు. బాధితుల పక్షాన నిలబడ్డారు. ఆమె అణగదొక్కబడిన వారి పక్షాన పోరాడేవారు. వారికి న్యాయం జరిగేవరకు శ్రమించేవారు అని ఆల్ ఇండియా డెమోక్రాటిక్ ఉమెన్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు కేఎస్ విమల చెప్పారు. మేం ఇద్దరం 1980 నుంచి స్నేహితులం.
ఆమె ఎంతో దూకుడుగా, ధైర్యంగా ఉండేవారు. సామాజిక పోరాటాల్లో ఒకరికొకరం సహకరించుకునేవాళ్లం అని గౌరి స్నేహితురాలు, రచయిత్రి సీకే మీనా గుర్తు చేసుకున్నారు. గౌరీలంకేశ్ తమ పరువుకు భంగం కలిగించారంటూ బీజేపీ నాయకులు ప్రహ్లాద్ జోషి, పరువునష్టం దావా వేశారు. కేసు రుజువు కావడంతో 2016 నవంబర్లో ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష పడింది. ఈ మేరకు పోలీసులు అరెస్ట్ చేయగా, తర్వాత బెయిల్ పొందారు. ఆరెస్సెస్, బీజేపీ, వాటి అనుబంధ సంస్థలకు వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభించి.. ఆమె భారీగానే శత్రువులను కూడగట్టుకున్నారు. పలుసార్లు ఆమె రాజకీయ వ్యతిరేకులు దుర్భాషలాడేందుకు కూడా వెనుకాడలేదు. ఎంఎం కల్బుర్గి హత్యకు వ్యతిరేకంగా గళం విప్పడంలో ముందున్న గౌరి లంకేశ్.. తనపైనా అటువంటి దాడే పొంచి ఉన్నదని గుర్తించలేకపోయారు.