మోదీకేర్పై రాష్ట్రాల్లో కేంద్ర అధ్యయనం ఇలా: ఇక ‘ఆరోగ్యశ్రీ’లో అక్రమాలకు చెక్!
న్యూఢిల్లీ / హైదరాబాద్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ నెల ఒకటో తేదీన దేశంలోని నిరుపేదలకు ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఆయుష్మాన్ భారత్ పేరిట..'జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం' ప్రారంభిస్తున్నట్లు లోక్ సభ సాక్షిగా ప్రకటించారు. వచ్చే ఏడాది బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించిన విత్త మంత్రి అరుణ్ జైట్లీ.. సదరు పథకం విధి విధానాలు, మార్గదర్శకాలు ఖరారు చేయకుండానే ప్రకటన చేశారు. తర్వాత టీవీ చానెల్ చర్చలోనూ విత్త మంత్రి అరుణ్ జైట్లీ ఈ అంశంపై స్పష్టతనివ్వలేదు. అప్పటికే ఒబామా కేర్ మాదిరిగా మోదీ కేర్ అన్న ప్రచారం మీడియాలో ఇబ్బడి ముబ్బడిగా జరిగిపోయింది. పేదల ఆరోగ్యం పట్ల నిబద్ధతను ఎవరూ ప్రశ్నించడం లేదు.
కానీ అందుకు అవసరమైన కసరత్తు చేయకుండానే విధాన ప్రకటన చేయాల్సిన తొందరేమిటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. గమ్మత్తేమిటంటే ఈ పథకం అమలుకు ఎంత ఖర్చవుతుందన్న వివరాలు కేంద్ర ఆర్థికశాఖ వద్ద అంచనాలు కూడా లేవంటే అతిశయోక్తి కాదు. అంతా పూర్తయ్యాక తాపీగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్య బీమా పథకాల పనితీరు అధ్యయనానికి కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
‘ఆరోగ్య శ్రీ' పథకం అమలుపై ఇలా ప్రజెంటేషన్
సోమవారం హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రధాన కార్యాలయంలో ట్రస్టు సీఈఓ మనోహర్ తదితరులతో జరిగిన భేటీలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రీతీ సుడాన్ ఇదే విషయంపై ప్రధానంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘జాతీయ ఆరోగ్య భద్రత పథకం' అమల్లోకి తేవడానికి ముందు.. రాష్ట్రాల్లో ఇప్పటికే అమలుచేస్తున్న వివిధ ఆరోగ్య పథకాలను పరిశీలించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సుడాన్, ఇతర కేంద్ర ఆరోగ్య ఉన్నతాధికారులు తెలంగాణలో ఆరోగ్యశ్రీ ట్రస్టును సందర్శించారు. ట్రస్టు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) డాక్టర్ మనోహర్ దృశ్యాత్మక ప్రదర్శనలో ఆరోగ్యశ్రీ పథకం అమలుతీరును వివరించారు.
నేడూ ఆరోగ్య శ్రీ ట్రస్టు అధికారులతో కేంద్ర ఆరోగ్య శాఖ అధికారుల భేటీ
ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవల్లో నాణ్యతా ప్రమాణాలు, అక్రమాలను గుర్తించడానికి ప్రత్యేక తనిఖీ వ్యవస్థను ఏర్పాటుచేయడంపై జరిగిన చర్చలో చికిత్స దశలోనే అక్రమాలను గుర్తించే విధంగా సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తే బాగుంటుందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సుడాన్ సూచించారు. దీనిపై ఆరోగ్యశ్రీ సీఈఓ మనోహర్ మాట్లాడుతూ ఈ విషయమై కూడా ఇప్పటికే చర్యలు చేపట్టామనీ, ఇటీవల దక్షిణ కొరియా బృందం ఆరోగ్యశ్రీని సందర్శించినప్పుడు అక్రమాలను తొలిదశలో గుర్తించే సాంకేతిక సమాచారం తీసుకున్నామనీ, త్వరలోనే తెలంగాణలో అక్రమాలను గుర్తించే సాఫ్ట్వేర్ను అమల్లోకి తీసుకొస్తున్నామని డాక్టర్ మనోహర్ తెలిపారు. ఇప్పటికే ఈ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే దిశగా ఆరోగ్యశ్రీ ట్రస్టు దృష్టి పెట్టిందని ప్రీతి సుడాన్ తో చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం అమలుపై మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి మంగళవారం కూడా కేంద్ర ఆరోగ్య ఉన్నతాధికారులు ట్రస్టు సీఈఓతో సమావేశం కానున్నారని వైద్యవర్గాలు తెలిపాయి. నిమ్స్లో అమలుచేస్తున్న సీడాక్ విధానాన్ని కూడా మంగళవారం కేంద్ర అధికారులు పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.
ఆరోగ్య శ్రీకి శ్రీకారం చుట్టిందీ వైఎస్ హయాంలోనే..
ఏది ఏమైనా మోదీకేర్ అమలుపై కేంద్ర ఆరోగ్య శాఖ కసరత్తు ప్రారంభించింది. వచ్చే స్వాతంత్ర్య దినోత్సవం నాడు గానీ, అక్టోబర్ రెండో తేదీన జాతిపిత మహాత్మాగాంధీ జయంతి నాడు గానీ ఈ పథకాన్ని ప్రారంబించనున్న సంగతి తెలిసిందే. దీని విధి విధానాల రూపకల్పన కోసం ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఆరోగ్య బీమా పథకాలను కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ.. వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన ఆరోగ్య బీమా పథకం అమలుతీరుపై సోమ, మంగళవారం సంబంధిత ట్రస్ట్ సీఈఓ మనోహర్తో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ చర్చిస్తుండటం ఈ పథకం ప్రాధాన్యం చెప్పకనే చెప్పింది.
హరిదాస్పూర్లో వైద్య శిబిర నిర్వహణపై ఇలా నజర్
కేంద్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ప్రీతీ సుడాన్ సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్నిసోమవారం పరిశీలించారు. ‘ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డింగ్' (ఈహెచ్ఆర్)ను ప్రారంభించారు. దీని ద్వారా వైద్యశాలకు వచ్చే రోగుల వివరాలు అంతర్జాలంలో నమోదు అవుతాయన్నారు. ఇప్పటి నుంచి రోగులు తప్పని సరిగా ఆధార్కార్డు వెంట తేవాలని పేర్కొన్నారు. రోగి అధార్ నంబర్తోపాటు అతని చరవాణి నంబర్ వివరాలు అంతర్జాలంలో నమోదు చేస్తారన్నారు. తర్వాత హరిదాస్పూర్ గ్రామానికి వెళ్లి పీహెచ్సి ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్యశిబిరాన్ని పరిశీలించారు. వైద్యశాలలో రోజువారీ ప్రసవాలు, కుని శస్త్రచికిత్సలు, 102 వాహనం వినియోగం, కేసీఆర్ కిట్ల పంపిణీకి సంబంధించిన రికార్డులు, రోగుల వివరాలు, సిబ్బంది హాజరు పట్టిక, పరిసరాలను పరిశీలించారు.
కేసీఆర్ కిట్ల పంపిణీ తదితర అంశాల పరిశీలన ఇలా
కొండాపూర్ ఆసుపత్రిలోని రికార్డులు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ పరిశీలించారు. వైద్యాధికారిణి రేష్మను ఆసుపత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యశాలలో ప్రసవాలు, కుటుంబనియంత్రణ శస్త్ర చికిత్సల సంఖ్య పెరగడంతో వైద్యురాలితో పాటు సిబ్బందిని అభినందించారు. ప్రీతి సుడాన్ వెంట రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, కుటుంబ వైద్యారోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణ, రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ లలితకుమారి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మాణిక్కరాజ్ ఉన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ జితేష్ వి.పాటిల్, జిల్లా డీఎంహెచ్ఓ గాయత్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
యాంటిబయాటిక్స్ వాడకంపై తస్మాత్ జాగ్రత్త!
మనలో చాలా మంది ఏదో ఒక సందర్భంలో యాంటిబయోటిక్ మందులను వాడుతుంటాం. ఈ సారి నుంచి వాటిని వేసుకునేప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే మన దేశంలో దొరుకుతున్న యాంటిబయోటిక్లలో 64శాతం నకిలీవేనట. వాటిని విక్రయించేందుకు ఎలాంటి అనుమతులు లేవట. యూకే నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా యాంటిబయోటిక్ మందుల వినియోగంపై లండన్లోని క్వీన్ మేరీ యూనివర్సిటీ, న్యూక్యాసిల్ యూనివర్శిటీలోని పరిశోధకులు సంయుక్తంగా ఓ అధ్యయనం చేపట్టారు. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ క్లినికల్ ఫార్మకాలజీలో ఈ అధ్యయనాన్నిప్రచురించారు. దీని ప్రకారం.. భారత మార్కెట్లో లక్షల సంఖ్యలో విక్రయిస్తున్న యాంటిబయోటిక్ మందులకు ఎలాంటి అనుమతులు లేనట్లు తెలిసింది.
సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనుమతుల్లేనివి 64 శాతం
2007 నుంచి 2012 మధ్య భారత్లో 118 రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్(ఎఫ్డీసీ) ఫార్ములేషన్స్ను గుర్తించారు. ఇందులో 64శాతం మందులకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీవో) నుంచి ఎలాంటి అనుమతులు లేవని వెల్లడైంది. అనుమతిలేని కొత్త మందులను విక్రయించడం, సరఫరా చేయడం భారత్లో చట్టవ్యతిరేకం అయినప్పటికీ.. ఈ మందులను యథేచ్ఛగా అమ్ముతున్నట్లు తెలిసింది.ప్రపంచవ్యాప్తంగా యాంటిబయోటిక్ మందులను అత్యధికంగా వినియోగిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. దేశంలో 3,300 బ్రాండ్ల పేర్లతో ఎఫ్డీసీ యాంటిబయోటిక్స్ విక్రయం అవుతున్నాయి. వీటిని 500 ఫార్మాస్యూటికల్ కంపెనీలు తయారుచేస్తున్నాయి. ఇందులో 12 బహుళజాతి సంస్థలు కూడా ఉన్నాయి.