భూకంప వేళ సెల్ఫీ పిచ్చి: ప్రబుద్ధుల జోకులు
ఖాట్మాండ్: నేపాల్లో భారీ భూ కంపం సృష్టించిన విధ్వంసం మాటల్లో చెప్పలేనిది. వేలాది మంది ప్రాణాలను బలితీసుకున్న ఈ భూకంపం, నేపాల్ నగరాలను నేలమట్టం చేసింది. కాగా, తమకు ఇవేమి పట్టనట్లుగా, కొందరు అక్కడ తమ సెల్ఫోన్లలో సెల్ఫీలు తీసుకుంటూ కనిపించారు.
తాజా భూకంప తీవ్రత ధాటికి కాఠ్మాండులో కుప్పకూలిన ప్రఖ్యాత ధర్హరా టవర్ ముందు స్థానిక యువకులు, పర్యాటకులు సెల్ఫీలు, ఫొటోలతో హోరెత్తిస్తున్నారు. ఇంతటి విషాదంలోనూ కూలిన టవర్ ముందు నవ్వుతూ సెల్ఫీలు తీసుకోవడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, విషాద తీవ్రతను ప్రజలు అర్థం చేసుకోవడానికే విధ్వంస ప్రాంతాలను సెల్ఫీలో బంధిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నామని మరికొందరు అంటున్నారు.
ఇది ఇలా ఉండగా మరికొందరు ప్రబుద్ధులు నేపాల్లో సంభవించిన ఘోర భూకంపంపై జోకులు పేలుస్తున్నారు. గల్లంతైన వారిని కనుగొనేందుకు ఒకవైపు విశేషమైన పాత్ర పోషిస్తున్న సోషల్ మీడియాలో కొందరు సందర్భాన్ని పట్టించుకోకుండా తమ అతి తెలివితేటలు బయటపెట్టుకుంటున్నారు.
వేల మంది అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారన్న విచక్షణ మరిచిపోయి తమ వింత నైజాన్ని ప్రదర్శిస్తున్నారు. ఓ ప్రబుద్ధుడు హంప్టిడంప్టి శాట్ ఆన్ ఏ వాల్.. అనే చిన్న పిల్లల రైమ్ను మార్చివేసి.. తన్మయ్ భట్ శాట్ ఆన్ ఏ వాల్.. తన్మయ్భట్ హ్యాడ్ ఏ గ్రేట్ ఫాల్.. అని ట్విటర్లో పోస్టు చేశాడు.
మరొకడు దీనిని ప్రముఖ సినీనటుడు రజనీకాంత్తో ముడిపెడుతూ ఆయన షూటింగ్లో ఉండగా, కాలు స్లిప్ అయింది.. అందుకే భూకంపం వచ్చింది అని పోస్టు పెట్టాడు. ఇక లెన్స్కార్ట్ అనే సంస్థ తమ కళ్లజోళ్ల ధరలు భూకంపంలా తగ్గిపోయాయని యాడ్ ఇచ్చి వింద దోరణిని ప్రదర్శించింది. సందర్భాన్ని అర్థం చేసుకోకుండా ఇలాంటి వింత ప్రకటనలు చేస్తున్న వారిపై పలువురు మండిపడుతున్నారు.