ఏపీ రాజధాని: సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ఇదే..!
రాజమండ్రి: నవ్యాంధ్ర నూతన రాజధాని 'అమరావతి'కి సంబంధించిన సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ను సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఈరోజే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి అందించనున్నారు. ఇందుకు గాను సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో పాటు 30 మంది సభ్యుల బృందం సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకుంది.
ముందుగా రాజమండ్రిలో సీఎం చంద్రబాబుతో సింగపూర్ ప్రతినిధుల బృందం భేటీ అవుతుంది. అనంతరం సింగపూర్ మంత్రి ఈశ్వరన్, సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడతారు. ఈ నేపథ్యంలో నవ్యాంధ్ర నూతన రాజధాని ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.
నవ్యాంధ్ర నూతన రాజధాని సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ఇదే:
* ఏపీ నూతన రాజధాని నదీతీర రాజధానిగా ఏర్పాటు కానుంది.
* 8 కిమీ నది తీరం వెంబడి పొడవునా సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ప్రధాన పరిపాలన, వాణిజ్య కేంద్రాలు రానున్నాయి.
* సీఆర్డీఏ పరిధిలోని లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, తల్లాయపాలెం, మోదుగ లంకపాలెం, వెలగపూడి, మల్కాపురం, రాయపాలెంకు దగ్గర్లో నదీతీరానికి ఆనుకుని సీడ్క్యాపిటల్ ఏర్పాటయ్యే అవకాశం.
* రాజధాని ప్రణాళికలో భాగంగా కృష్ణానదిలో ఉన్న భవానీ ద్వీపాలను అభివృద్ధి చేయనున్నారు.
* వాటిలో కొన్నింటిని పార్కులుగా తీర్చిదిద్దనున్నారు.
* కొండవీటి వాగును 1200 ఎకరాల్లో మంచి నీటి జలాశయంగా మార్చనున్నారు.
* రాజధానిలోని అన్ని కాలువలు, జలాశయంలో కలిపి 0.75 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం ఉండేలా ప్లాన్లో ఉంది.
* భవానీ ద్వీపంతో పాటు, ఇతర చిన్న చిన్న ద్వీపాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి.
రాజధాని ఎక్కువ భాగం గుంటూరు వైపే:
* భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాజధాని సీడ్ క్యాపిటల్ ప్లాన్ను సవరించారు. ముందుగా అనుకున్న దానిలో కాస్త మార్పులు చేర్చారు.
* రాజధానిని 217 చ.కి.మీ. విస్తీర్ణంలోనే అభివృద్ధి చేయనున్నప్పటికీ భవిష్యత్తులో రాజధాని విస్తరించేందుకు మరో 162 చ.కి.మీ. విస్తీర్ణాన్ని అదనంగా గుర్తించారు.
* కొన్ని ప్రత్యేక అంశాలను దృష్టిలో పెట్టుకుని రాజధాని విస్తరణకు గుంటూరువైపే విస్తరించే అవకాశం ఉంది.
* భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అక్కడ రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తారు.
* సవరించిన రాజధాని సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్లో 32 గ్రామాలున్నాయి.
* దీంతో రాజధాని విస్తీర్ణం 374 చ.కి.మీ.కు చేరింది.
* హెరిటేజ్ గ్రామంగా మందడం
* సీడ్ క్యాపిటల్ ప్లాన్లో రవాణాకు ఎక్కువ ప్రాముఖ్యత కల్పించారు.
* మెరుగైన రవాణా ఏర్పాట్లు చేశారు.
* సీడ్క్యాపిటల్ నుంచి మూడు మెట్రో మార్గాలు ఉన్నాయి.
* మెట్రో మార్గం-1, మెట్రోమార్గం-2తో అనుసంధానం.
* మెట్రోమార్గం-1ని కలుపుతూ రాజధాని కీలకప్రాంత సరిహద్దు మీదుగా సెమీ ఎక్స్ప్రెస్వే.
* సెమీ ఎక్స్ప్రెస్వే, మెట్రోరైలు మార్గం-2ను అనుసంధానిస్తూ హైస్పీడ్ రైలు మార్గం.
* రాజధాని మధ్యలో ప్రవహించనున్న నది.
* రాజధానిలోని మురుగునీటిని మళ్లించేందుకు ప్రత్యేక మార్గాన్ని సూచించింది.
* మురుగు నీటిని నదిలోకి మళ్లించడానికి ముందుగానే శుద్ధికేంద్రాల్లో శుద్ధి చేస్తారు.
* శుద్ధిచేసిన మురుగునీటిని కృష్ణానదిలోకి మళ్లించేందుకు గాను ఐదు ప్రధాన మార్గాలను సూచించింది.
* ప్రధాన మార్గానికి అనుసంధానంగా మరో రెండు మార్గాలు ఏర్పాటు చేశారు.