విజయవాడలో ‘శివగామి’: మనవడిని కాపాడి కన్నుమూసింది
విజయవాడ: బాహుబలి చిత్రంలో బాహుబలిని రమ్యకృష్ట నీటిలో మునిగిపోతూ కాపాడిన విషయం ఆ సినిమా చూసిన వారందరికీ తెలిసిందే. ఇలాంటి ఘటనే కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. కాల్వలో పడిపోయిన మనుమడిని చేతులతో పైకెత్తి పట్టుకుని కాపాడి తాను నీట మునిగి ఓ వృద్ధురాలు మృతి చెందింది.
శనివారం చోటు చేసుకున్న ఈ విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి.. ఉయ్యూరు కొబ్బరితోట ప్రాంతం పుల్లేరు కాల్వకట్టపై చిరిమాల అమ్మణమ్మ(49) నివశిస్తోంది. ఇంటి వెనుక పుల్లేరుకాల్వ ఒడ్డున తన రెండేళ్ళ మనవడు జశ్వంత్ మూత్ర విసర్జన చేస్తూ జారి కాల్వలో పడిపోయాడు. దీనిని గమనించిన అమ్మణమ్మ ఒక్క ఉదుటన కాల్వలో దూకింది.
కాల్వలో నీరు నిండుగా ఉండటంతో మునిగిపోతూ మనుమడిని చేతులపై పైకిలేపి పట్టుకుని ప్రవాహంలో కొట్టుకుపోయింది. బాలుడు నీటిలో తేలి కొట్టుకుపోవడం చూసిన స్థానికులు కాల్వలో దూకి అతడిని కాపాడారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు కలసి అమ్మణమ్మ కోసం గాలించి ఆమె మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తన మనవడిని కాపాడటం కోసం అమ్మణమ్మ తన ప్రాణం త్యాగం చేసిందని స్థానికులు పేర్కొన్నారు.