సచిన్ అల్విదా: ధోనీ మిషన్ కంప్లీట్ (పిక్చర్స్)
హైదరాబాద్: ఎట్టకేలకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టెస్టు క్రికెట్ నుంచి కూడా తప్పుకున్నాడు. తప్పుకోవాల్సిన అనివార్యతలో ఆయన పడ్డాడు. బిసిసిఐ సెలెక్షన్ కమిటీ చీఫ్గా సందీప్ పాటిల్ ఎంపికైన తర్వాత భారత జట్టుకు యువరక్తాన్ని ఎక్కించే వ్యూహాత్మకంగా అమలు జరిగిందనే చెప్పాలి. సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్తో భారత క్రికెట్ జట్టు మహేంద్ర సింగ్ ధోనీ మిషన్ పూర్తయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
భారత క్రికెట్ జట్టును ఆత్మరక్షణ విధానం నుంచి ఎదురుదాడికి సిద్ధం చేసిన కెప్టెన్గా సౌరవ్ గంగూలీని చెప్పుకోవాలి. అయితే, గంగూలీ తన వ్యూహాల ద్వారా, తానొక్కడై ఎదురు దాడిని ఆచరణలో పెడుతూ వచ్చాడు. తద్వారా భారత్కు విజయాలను రుచి చూపించాడు. ఆ తర్వాత ధోనీ తాను మాత్రమే కాకుండా జట్టు సభ్యులందరినీ ఎదురుదాడికి సిద్ధం చేస్తూ వచ్చాడు. ప్రతి జట్టు సభ్యుడు ఎదురుదాడినే లక్ష్యంగా ఎంచుకునేలా సిద్ధం చేశాడు.
తన వ్యూహాలకు, ఎదురుదాడి లక్ష్యాలకు ఆయనకు బహుశా సీనియర్ ఆటగాళ్లు అడ్డూ వస్తూ ఉండి ఉంటారు. అదే సమయంలో కెప్టెన్సీకి పోటీ పడుతూ తనకు ఆటంకంగా సినీయర్లు నిలుస్తూ వచ్చారు. ట్వంటీ 20, వన్డేల ఫార్మాట్ల నుంచే కాకుండా టెస్టు ఫార్మాట్ నుంచి సీనియర్లందరూ తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ధోనీకి స్పష్టమైన సామాజిక అవగాహన కూడా ఉంది.
మహానగరాలకు, చిన్నపట్టణాలకు మధ్య ఉన్న వ్యత్యాసం గురించి ఆయన రెండు మూడు సార్లు మాట్లాడాడు. తాను చిన్నపట్టణం నుంచి వచ్చానని, తాను అలాగే ఉంటానని, మహానగరాలకు చెందినవారికి తమ విషయాలు అర్థం కావని ఆయన సమయం వచ్చినప్పుడు చెబుతూ వచ్చాడు. మహానగరాలకు చెందిన ఆటగాళ్లకే కేంద్రంగా మారిన క్రికెట్ను చిన్న పట్టణాలకు చెందినవారికి కూడా అవకాశం కల్పించేలా చేశాడని అనుకోవచ్చునేమో..
ఏమైనా, ఇప్పుడు పూర్తిగా ధోనీ జట్టు రూపుదిద్దకుంది. ప్రపంచంలోనే మేటి కెప్టెన్గా పేరు సంపాదించుకున్న ధోనీకి ఇప్పుడు మూడు ఫార్మాట్లలోనూ తనదైన జట్టు ఏర్పడిందని చెప్పవచ్చు. పైగా, భవిష్యత్తు కెప్టెన్ను కూడా తానే నిర్ణయించే దశకు కూడా చేరుకున్నాడని చెప్పవచ్చు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటివాళ్ల పట్ల అతను వ్యవహరిస్తున్న తీరు అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
గంగూలీ నేర్పిన పాఠం..
భారత క్రికెట్ జట్టు ఆటతీరులో మౌలికమైన మార్పును తెచ్చిన కెప్టెన్గా సౌరవ్ గంగూలీ నిలిస్తే, దానికి మరింత పదును పెట్టి విజయాలనే తన కెప్టెన్సీకి ప్రతీకగా చేసుకున్న కెప్టెన్గా ధోనీ నిలుస్తున్నాడు.
రాహుల్ ద్రావిడ్ రిటైర్మెంట్..
రాహుల్ ద్రావిడ్ తప్పుకున్న తర్వాత సచిన్ టెండూల్కర్ సూచన మేరకు అనూహ్యంగా ధోనీకి కెప్టెన్సీ అవకాశం అంది వచ్చింది. రాహుల్ ద్రావిడ్ రిటైర్ కావడం వల్ల ఏర్పడిన ఖాళీని ధోనీ టెస్టు క్రికెట్లో ఛతేశ్వర్ పుజారాతో భర్తీ చేసుకున్నాడు.
వివియల్ లక్ష్మణ్తో వివాదం..
హైదరాబాద్ స్టయిలిష్ బ్యాట్స్మన్ వివియస్ లక్ష్మణ్ రిటైర్మెంటుకు పూర్తిగా ధోనీనే కారణమనే విమర్శలు వచ్చాయి. వివియస్కు, ధోనీకి మధ్య వివాదం నడిచింది. లక్ష్మణ్ ధోనీ తీరుకు నొచ్చుకుని అప్పటికప్పుడు క్రికెట్ నుంచి తప్పుకున్నాడు.
సెహ్వాగ్తో వివాదాలే వివాదాలే..
భారత క్రికెట్ జట్టులో వీరేంద్ర సెహ్వాగ్ ఒక వెలుగు వెలిగాడు. అతను మేటి క్రికెటర్గా ముందుకు వచ్చాడు. అయితే, ధోనీకీ సెహ్వాగ్కు మధ్య ఎడతెగని వివాదం చెలరేగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే సెహ్వాగ్ ఆట తీసికట్టుగా మారింది. ఈ సమయంలోనే సెహ్వాగ్ను జట్టు నుంచి తప్పించారు. మళ్లీ ఆయన జట్టులో స్థానం పొందే అవకాశాలు లేకుండా పోయాయి.
గౌతం గంభీర్ కూడా..
మేటి ఓపెనర్గా, నిలకడైన బ్యాట్స్మన్గా పేరు పొందిన గౌతం గంభీర్ కూడా త్వరలోనే జట్టులో స్థానం కోల్పోయాడు. భారత జట్టుకు కెప్టెన్సీ కోసం అతను పోటీ పడ్డాడని అంటారు. కానీ, అతను ఆటలో విఫలమవుతూ వచ్చాడు. దీంతో అతన్ని జట్టు నుంచి తొలగించారు. అతను తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం లేకుండా పోయింది.
హర్భజన్ సింగ్ ఔటే..
భారత మేటి స్పిన్నర్గా ముందుకు వచ్చిన హర్భజన్ సింగ్కు కూడా తిరిగి జట్టులో స్థానం దొరక్కపోవచ్చు. రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడు ఆల్ రౌండర్గా ముందుకు వచ్చాడు.
జహీర్ ఖాన్ ఆట ముగిసినట్లే..
భారత పేస్ బౌలింగ్కు వెన్నెముకగా పేరు పొందిన జహీర్ ఖాన్ ఆట కూడా ముగిసినట్లే కనిపిస్తోంది. కొత్త పేస్ బౌలర్లు అతని స్థానాన్ని భర్తీ చేసేశారు.
యువరాజ్ను విధి వెనక్కి..
యువరాజ్ సింగ్ కూడా ధోనీకి పోటీ వచ్చేవాడే. కానీ, క్రమశిక్షణ కొరవడిన కారణంగా అతనికి కెప్టెన్సీ దూరమైంది. అతన్ని దురదృష్టవశాత్తు క్యాన్సర్ చుట్టుముట్టడంతో జట్టులో ఏదో విధంగా ఉంటే చాలుననే నిర్ణయానికి వచ్చాడు.
చివరగా సచిన్ టెండూల్కర్..
జట్టులో మిగిలిన ఏకైక సీనియర్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ఎట్టకేలకు తప్పుకున్నాడు. ఇప్పుడు జట్టుకే కాదు, జట్టు కెప్టెన్ ధోనీకి సీనియర్ల బరువు లేకుండా పోయింది.