ఖాళీ చేసి వెళ్లిపోండి.. లేకపోతే చచ్చిపోతారు, అధికారుల హెచ్చరిక, భారతీయులు విలవిల, ఆకలి కేకలు!
తూర్పు టెక్సాస్ పై హార్వే హరికేన్ విరుచుకుపడి, కకావికలం చేసింది. వారం రోజుల్లో 132 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందంటే వరుణుడు ఏ స్థాయిలో విరుచుకుపడ్డాడో ఊహించుకోవచ్చు.
టెక్సాస్: అమెరికాను హార్వే హరికేన్ అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తూర్పు టెక్సాస్ వాసులకు అక్కడి ప్రభుత్వ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ''వెంటనే అక్కడ్నుంచి వెళ్లిపోండి.. లేకపోతే చచ్చిపోతారు'' అంటూ హెచ్చరించారు.
తూర్పు టెక్సాస్ పై హార్వే హరికేన్ విరుచుకుపడి, కకావికలం చేసింది. వారం రోజుల్లో 132 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందంటే వరుణుడు ఏ స్థాయిలో విరుచుకుపడ్డాడో ఊహించుకోవచ్చు. దీంతో హూస్టన్ నగరం సముద్రాన్ని తలపిస్తోంది. రిజర్వాయర్లలో నీటిమట్టం 82 అడుగులకు చేరింది.
అత్యంత తీవ్రమైన విపత్తుగా...
అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత తీవ్రమైన విపత్తు అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కేవలం టెక్సాస్ లోనే 12 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేశారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. 48,700 ఇళ్లు ధ్వంసమయ్యాయని, వెయ్యేళ్లకోసారి ఇలాంటి వర్షం కురుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తక్షణమే ఖాళీ చేయండి...
టేలర్ కౌంటీలోని నిషెస్, స్టీన్ హేగెన్ రిజర్వాయర్ల గేట్లు ఎత్తేయాల్సిందిగా ఆర్మీ ఆదేశించింది. ఈ గేట్లు ఎత్తేస్తే ఆ నీరు ఊళ్లను ముంచెత్తనుంది. దీంతో తక్షణం ఆ ఊళ్లను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. అలా కాకుండా అక్కడే ఉంటే బతికే అవకాశాలు చాలా తక్కువని స్పష్టం చేశారు. వరదల కారణంగా అమెరికాలో చమురు ధరలు అమాంతం పెరిగిపోయాయి. గ్యాలన్ పెట్రోలు ధర ఏకంగా రెండేళ్ల గరిష్టానికి చేరింది.
ప్రవాస భారతీయులు విలవిల...
హార్వే తుపాను ధాటికి అమెరికాలోని హూస్టన్ విలవిల్లాడుతోంది. వందలాది ఇళ్లు నీట మునిగాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. నిరాశ్రయులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన ప్రవాస భారతీయులు ఎక్కడికక్కడ ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు, విద్యాసంస్థల్లో శిబిరాలు ఏర్పాటు చేశారు. అలాగే సురక్షితంగా ఉన్న ఒక్కో కుటుంబమూ మరో రెండుమూడు కుటుంబాలకు ఆశ్రయం ఇచ్చింది. సోషల్ మీడియా ద్వారా అన్నార్తులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తెలుగు కుటుంబాల ఆకలి కేకలు...
హూస్టన్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు రెండు లక్షల మంది ప్రవాస భారతీయులు నివసిస్తుండగా వారిలో తెలుగువారే ఎక్కువ. తుపాను కారణంగా హూస్టన్ అతలాకుతలమవడంతో ఏమీ దొరకని పరిస్థితి నెలకొంది. హరికేన్లో చిక్కుకుని తెలుగు కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు అక్కడి ప్రవాస భారతీయ హోటళ్లు ముందుకొచ్చాయి. ఒక్కో హోటల్ రెండువేల మందికి ఆహారాన్ని సరఫరా చేస్తోంది.
కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు...
బుధవారం రెండోసారి లూసియానా తీరాన్ని దాటిన క్రమంలో భారీ వర్షాలతో టెక్సాస్ సరిహద్దు ప్రాంతాలను వరదతో ముంచెత్తింది. హూస్టన్ రాష్ట్రంలో 32 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారని, పునరావాస కేంద్రంలో 30 వేల మందికి మందికి సరిపోయే ఏర్పాట్లు చేశామని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ చెప్పారు. హూస్టన్ సమీపంలోని ఓ రసాయన పరిశ్రమలో రెండు పేలుళ్లు సంభవించాయి. హార్వే హరికేన్ సృష్టించిన విధ్వంసాన్ని మరచిపోకముందే తూర్పు అట్లాంటిక్ సముద్రంలో ఇర్మా హరికేన్ ఏర్పడినట్లు మియామీలోని నేషనల్ హరికేన్ సెంటర్ అధికారులు తెలిపారు.