టెక్కీ దెబ్బ: ఉద్యోగాలు గోవిందా, 'మహా" రెవెన్యూ ‘పోటు’
చండీగఢ్ నగరవాసి హర్మాన్ సిద్ధూ (46) అనే టెక్కీ దాఖలు చేసిన పిటిషన్ వల్లే దేశమంతా హైవేలపై మద్యం దుకాణాల ఎత్తివేయాల్సి వస్తున్నది.
న్యూఢిల్లీ/ ముంబై: హైవేలపై మద్యం దుకాణాలను ఎత్తివేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో వివిధ రాష్ట్రాల పర్యాటక రంగ ప్రగతి మీదా ప్రతికూల ప్రభావం చూపనున్నది. దీనివల్ల ఆబ్కారీ శాఖతోపాటు టూరిజం ద్వారా వివిధ రాష్ట్రాలకు వచ్చే ఆదాయం పడిపోనున్నది. ఆయా మద్యం దుకాణాలను మూసివేయడం వల్ల వాటిపై ఆధారపడి జీవిస్తున్న వారి కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం పొంచి ఉంది.
అందువల్లే సుప్రీంకోర్టు ఆదేశాల పది లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఓ) అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించారు. వివిధ పర్యాటక ప్రాంతాలకు వచ్చే వారు మద్యం సేవిస్తారు. కనుక రెండు విధాల రాష్ట్రాలు ఆదాయం కోల్పోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. హైవేలపై ప్రమాదాల నివారణకు 500 మీటర్ల పరిధిలో గల మద్యం దుకాణాలను ఎత్తివేయాలన్న సుప్రీం తీర్పుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
కేవలం పశ్చిమ భారతదేశంలోనే 35 వేల దుకాణాలను మూసివేయడం గానీ, మరో ప్రాంతానికి గానీ తరలించాల్సిన దుస్థితి నెలకొన్నది. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్లోనూ సుప్రీం ఆదేశాలను అనుసరించి జాతీయ, రాష్ట్ర రహదారులను డీ నోటిఫై చేసేస్తున్నారు.
ఒకవేళ ఎవరైనా మద్యం దుకాణాలు నడిపినా, బార్లు, రెస్టారెంట్లలో మద్యం విక్రయాలు సాగించినా పోలీసులు బలవంతంగా మూసివేయిస్తున్నారు. జాతీయ రహదారులపై డ్రంకెన్ డ్రైవ్ నియంత్రణకు సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను అభినందనీయమేనని, కానీ దానివల్ల పర్యాటక, ఆతిథ్య రంగాలు దెబ్బ తినకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నదని సెలెక్ట్ గ్రూప్ సంస్థ ఎండీ అర్జున్ శర్మ వ్యాఖ్యానించారు.
అల్లాడుతున్న బార్లు, పబ్ల యజమానులు
దేశ రాజధాని శివారుల్లోని గుర్గావ్ పరిధిలో దాదాపు 200 బార్లు, పబ్లు, రెస్టారెంట్లలో మద్యం విక్రయాలు నిలిపేయాల్సిన దుస్థితి ఏర్పడింది. శుక్రవారం నుంచి ఇప్పటివరకు హైవేలపై 100కి పైగా వైన్ షాపులు, రెస్టారెంట్లు మూతబడ్డాయి. జాతీయ రహదారులు వెళ్లే రాష్ర్టాలు భారీగా రెవెన్యూ కోల్పోనున్నాయి. ఆరు జాతీయ రహదారులు వెళ్లే ఢిల్లీ పరిధిలో ఫైవ్స్టార్ హోటళ్లు సహా 100 రెస్టారెంట్లు, మద్యం దుకాణాల యజమానుల సంఘాలు తాము సుప్రీం తీర్పు పరిధిలోకి రాబోమని ప్రభుత్వానికి విజ్ఞప్తులు సమర్పించాయి. నొయిడాలోని గుర్గావ్ పరిధిలో 292 బార్లలో 106 బార్ల పరిధిలో సుప్రీంతీర్పు వర్తిస్తుంది.
భారీగా రూ.7000 కోట్ల రెవెన్యూ లోటు?
హైవేలపై మద్యం షాపుల ఎత్తివేతతో మహారాష్ట్ర ప్రభుత్వం రూ.7000 కోట్ల ఆదాయాన్ని కోల్పోనున్నది. ముంబైలోని దేశీయ విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్ పరిధిలోని బార్లు, పబ్లు, రెస్టారెంట్లు మొదలు మహారాష్ట్రలో కనీసం వెయ్యి హోటళ్లు మూసేయక తప్పదని భారతీయ హోటళ్లు, రెస్టారెంట్ల సంఘం (ఏహెచ్ఏఆర్) అధ్యక్షుడు ఆదర్శ్ శెట్టి ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి చంద్రశేఖర్ బవాంకులే మాట్లాడుతూ మద్యం దుకాణాలను మూసివేస్తే నష్టపోయే రెవెన్యూ లోటును పూడ్చుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని తెలిపారు.
30 శాతం దుకాణాలు క్లోజే
మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, పబ్లు మూసివేసే రాష్ట్రం రాజస్థాన్. ఆ రాష్ట్రంలోని 7760 మద్యం దుకాణాలకు 2800 మూసి వేయాల్సిందే. దీనివల్ల ఎంత రెవెన్యూ లోటు ఏర్పడుతుందో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం చివరి నాటికి తెలుస్తుందని రాజస్థాన్ ఎక్సైజ్ కమిషనర్ ఓపీ యాదవ్ తెలిపారు.
కేరళకు జంట సవాళ్లు..
కేరళలో మద్య నిషేధంతోపాటు పర్యాటక రంగంపైనా ప్రతికూల ప్రభావం పడనున్నది. కేరళలో 1956 బార్లు మూసేయాల్సి ఉంటుందని కేరళ ఆబ్కారీ మంత్రి జీ సుధాకరన్ చెప్పారు. ఇక చెన్నై నగరంలో వివిధ క్యాటగిరీల్లోని 35 స్టార్ హోటళ్లతోపాటు తమిళనాడులో 250 మద్యం దుకాణాలపై ప్రతికూల ప్రభావం పడనున్నది. కేరళలో కంటే చౌకధరకు మద్యం విక్రయిస్తున్న పుదుచ్చేరిలోని మహేలో 32 షాపులు మూసేయాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.60 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని పుదుచ్చేరి ఎక్సైజ్శాఖ మంత్రి నమశివం చెప్పారు. కర్ణాటకలో 60 - 70 శాతం మద్యం దుకాణాలు మూసేయాలని రాష్ట్ర మద్యం వ్యాపారుల సంఘం ప్రధాన కార్యదర్శి హొన్నాగిరి గౌడ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే తమను కాపాడాలని సీఎం సిద్ధరామయ్యకు కర్ణాటక రాష్ట్ర మద్యం వ్యాపారుల సంఘం ప్రతినిధి బ్రుందం మెమొరాండం సమర్పించింది.
గోవాలోనూ అదే....
గోవాలో 30 శాతం మద్యం దుకాణాలు మూసి వేయాల్సి రావడంతో రెండు రోజుల క్రితమే సీఎం మనోహర్ పారికర్తో మద్యం వ్యాపారుల ప్రతినిధి బృందం సమావేశమైంది.
ఈశాన్య రాష్ట్రాలపై
ఈశాన్య రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, మేఘాలయ రాష్ర్టాల్లో జాతీయ రహదారులపై మద్యం షాపుల ఎత్తివేతపై సుప్రీం తీర్పులో కొన్ని సడలింపులు ఇచ్చింది. ఈ రాష్ట్రాల పరిధిలో 20 వేల లోపు జనాభా గల ప్రాంతాలను తీర్పు అమలు నుంచి దేశ సర్వోన్నత న్యాయస్థానం మినహాయింపునిచ్చింది.
సిద్ధూ వల్లే..
చండీగఢ్ నగరవాసి హర్మాన్ సిద్ధూ (46) అనే టెక్కీ దాఖలు చేసిన పిటిషన్ వల్లే దేశమంతా హైవేలపై మద్యం దుకాణాల ఎత్తివేయాల్సి వస్తున్నది. 1996లో హిమాచల్ ప్రదేశ్ నుంచి వస్తుండగా కారు లోయలో పడి మెడపై గాయాలతో పక్షవాతానికి గురైన హర్మాన్ సిద్దూ.. వీల్ చైర్ కే పరిమితమయ్యారు. కానీ ఆయన హైవేలపై మద్యం దుకాణాల ఏర్పాటుకు వ్యతిరేకంగా పంజాబ్ ప్లస్ హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన రెండు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు.. హైవేలపై మద్యం దుకాణాలు ఎత్తేయాలని ఇచ్చిన తీర్పును.. పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు సుప్రీంలో సవాల్ చేశాయి. కానీ అక్కడా వాటికి చుక్కెదురైంది. పంజాబ్ & హర్యానా హైకోర్టు తీర్పును ధ్రువీకరించింది. గమ్మత్తేమిటంటే హర్మాన్ సిద్ధూ మద్యం సేవిస్తాడు. కానీ మద్యం తాగినప్పుడు మాత్రం డ్రైవింగ్ దూరంగా ఉంటానని తెలిపాడు.