ట్విస్ట్: చేతులెత్తేసిన విజయరాణి, ఏమైంది?
తాను ఎవరినీ మోసం చేయలేదని, తానే పూర్తిగా మోసపోయానని ఆమె పోలీసుల వద్ద అన్నట్లు సమాచారం. బెంగళూరులో ఓ అద్దె భవనంలో ఉంటున్న ఆమెను సిసిఎసల్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. విచారణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. ప్రత్యేక దర్యాప్తు బృందం విజయరాణిని విచారిస్తోంది. విజయరాణితో పాటు మొత్తం పది మందిపై సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారినీ బెంగళూరు నుంచి నగరానికి తీసుకొచ్చారు.
పోలీసులకు చిక్కినవారిలో విజయరాణి చెల్లెలు, కుమారుడు, చెల్లెలు కుమారుడు ఉన్నారు. వీరందర్నీ వేర్వేరు గదుల్లో పోలీసులు విచారిస్తున్నట్లు. విజయరాణి అరెస్టు గురించి తెలియగానే బాధితులు ఆఘమేఘాల మీద సిసిఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. అటు విజయరాణిని, ఇటు బాధితులను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్ నగరం నుంచి సరంజామా సర్దుకుని చెక్కేసిన ఆమె నేరుగా బెంగళూరు వెళ్లింది. అక్కడ మొత్తం ఐదు ఇళ్లలో మకాం పెట్టింది. అరెస్టు చేయడానికి పోలీసులు హైదరాబాద్ నుంచి బయలుదేరే సమయానికి ఆమె ఠక్కున ఇల్లు మారిపోయేది. రెండు, మూడు ఇళ్లు మారగానే పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమె సెల్ఫోన్ నెంబర్పై నిఘా పెట్టారు. బాధితుల్లో కొందరు విచారణలో పోలీసులకు సహకరిస్తూనే అన్ని విషయాలను బెంగళూరులో ఉన్న విజయరాణికి చేరవేశారని దర్యాప్తు బృందాలు అనుమానించాయి. అలాగే బాధితుల్లో ఉన్న కొందరి సెల్ఫోన్ల నెంబర్లనూ పరిశీలించారు.
దాంతో కొత్త పద్ధతిలో వల వేసి విజయరాణిని పట్టుకున్నారు. తెలిసిన వివరాల ప్రకారం - విజయరాణితో మల్లేపల్లికి చెందిన హరిబాబు అనే వ్యక్తి చాలా సన్నిహితంగా వ్యవహరించాడు. అతడి ఇంటి దస్తావేజులను వడ్డీ వ్యాపారుల వద్ద పెట్టి ఆమె డబ్బులు తీసుకుంది. ఇలా ఇద్దరు, ముగ్గురు వ్యాపారుల వద్ద విజయరాణి అప్పులు చేసిందని తెలిసింది. వారందరినీ విచారణకు పిలిపించాలని పోలీసులు భావిస్తున్నారు. ఆమెకు శ్రీనగర్ కాలనీలో రెండు, మూడు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి. అప్పటి వరకు నిల్వతో ఉన్న అవన్నీ విజయరాణి పరారీకి ముందు రోజు ఖాళీ అయిపోయాయి. నగదు నిల్వలను పది రూపాయలకు పరిమితం చేసింది. ఆమె ముఖం చాటేసిన కొద్దిరోజులకే సిసిఎస్ పోలీసులు కారు, రెండు ఫ్లాట్లను జప్తు చేశారు. ఆమె మాటలను నమ్మడానికి వీలు లేదని బాధితులు అంటున్నారు.