వివాదాలకు దూరంగా.. ఏపీపీఎస్సీలో పారదర్శకత
ఒకనాడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అంటే వివాదాలకు నిలయం. పరీక్ష అంటే వాయిదాలు! ఫలితాల వెంటనే కేసులు! ఇప్పుడు మొత్తం పరిస్థితి తారు మారైంది. నోటిఫికేషన్ల జోరు పెరిగింది.
హైదరాబాద్/ అమరావతి: ఒకనాడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అంటే వివాదాలకు నిలయం. పరీక్ష అంటే వాయిదాలు! ఫలితాల వెంటనే కేసులు! ఇప్పుడు మొత్తం పరిస్థితి తారు మారైంది. నోటిఫికేషన్ల జోరు పెరిగింది. క్యాలెండర్ మేరకు నోటిఫేషన్లు జారీచేస్తూ హెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తోంది. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, ఉద్యోగార్థుల్లో నమ్మకం పెంచుతూ ముందుకు సాగుతున్నది. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు.. వివాదాలకు తావులేకుండా విధానాలు.. నిర్దిష్ట గడువులోపే ఫలితాలు వెల్లడిస్తున్నది. నిరుద్యోగుల 'జీవితాలకు పరీక్ష' పెడుతుందన్న అపఖ్యాతిని ఏడాది కాలంలోనే ఏపీపీఎస్సీ చెరిపేసుకున్నది. చంద్రబాబు ప్రభుత్వం 2015 నవంబర్ 27న ఏపీపీఎస్సీ కొత్త ఛైర్మన్గా ప్రొఫెసర్ పిన్నమనేని ఉదయభాస్కర్ను నియమించింది. ఆ తర్వాత కార్యదర్శిగా వైవీఎస్టీ శాయిని నియమించింది. తర్వాత ఏడాదికి కొత్త కార్యవర్గం నియామకం పూర్తి చేయడంతో భిన్నంగా కమిషన్ పనితీరులో వేగం మొదలైంది. గత రిక్రూట్మెంట్ల తాలూకు పెండింగ్లో ఉన్న కోర్టు కేసులను.. ఒక్కొక్కటి పరిష్కారంతో పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. ఇంటర్వ్యూలపై నిరుద్యోగుల్లోని అపనమ్మకాన్ని పోగొట్టేలా రెండంచెల విధానానికి శ్రీకారం చుట్టింది. సాధ్యమైనంతమేరకు ఇంటర్వ్యూ లేకుండా ఖాళీలను భర్తీ చేయాలని సంకల్పించింది.
వ్యూహాత్మకంగా.. ప్రణాళికాబద్ధంగా..
గతేడాది జూన్లో 4009 పోస్టులను భర్తీచేసేందుకు ఆర్థికశాఖ అనుమతి ఇవ్వగా.. డిసెంబర్ 31లోగా ప్రధానమైన అన్ని నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ప్రస్తుత కమిషన్ మొత్తం 4,275 పోస్టుల భర్తీకి 34 నోటిఫికేషన్లు జారీచేసింది. వీటిలో ఇప్పటివరకు ఏడు నోటిఫికేషన్లకు చెందిన దాదాపు 1000 పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తిచేసి.. ప్రభుత్వ విభాగాలకు యూనిట్ జాబితాలు పంపింది. మిగిలిన 27 నోటిఫికేషన్ల కింద నియామకాలు కూడా వచ్చే డిసెంబర్ నెలాఖరు నాటికి కూడా ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధంచేసింది. ఇందులో భాగంగానే.. 982 పోస్టులకు చెందిన గ్రూప్-2 సర్వీసెస్, 1055 పోస్టులకు చెందిన గ్రూప్-3 సర్వీసెస్ రిక్రూట్మెంట్కు ఇప్పటికే స్ర్కీనింగ్ టెస్ట్ పూర్తి చేసింది. గ్రూప్-2 మెయిన్స్ వచ్చేనెల 15-16 తేదీల్లో, గ్రూప్-3 మెయిన్స్ ఆగస్టు 6న నిర్వహించాలని నిర్ణయించింది. వచ్చే సెప్టెంబర్లోగా ఈ రెండు నియామకాలు పూర్తిచేయాలన్న సంకల్పంతో ఉంది.
గత సమస్యలకూ చెక్
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రిక్రూట్మెంట్లపై ప్రతిష్ఠంభనకు తెరదించేందుకూ ఏపీపీఎస్సీ చర్యలు చేపట్టింది. 1999 నాటి గ్రూప్-2 సర్వీసెస్ నియామకానికి తాజాగా తుది సెలెక్షన్ లిస్టును విడుదల చేసి ప్రభుత్వ విభాగాలకు కూడా పంపింది. దాదాపు 17 సంవత్సరాలుగా ఈ రిక్రూట్మెంట్పై వివాదం నడుస్తోంది. ఇక 2008 నాటి జేఎల్స్ ఎకనామిక్స్ వివాదాన్ని కూడా ఏపీపీఎస్సీ తాజాగా ఓ కొలిక్కి తెచ్చింది. గ్రూప్-2011 సర్వీసెస్ రిక్రూట్మెంట్ వివాదాన్ని ఈ నెలాఖరులోగా పరిష్కరించే యోచనలో కమిషన్ ఉంది.
ముందుగానే సిద్ధం
2017లోనూ విడుదల చేయాల్సిన నోటిఫికేషన్లకు ఇయర్ క్యాలెండర్ను కూడా ఇటీవల ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు ఖాళీలను రోస్టర్ పాయింట్లతో కలిపి పంపిస్తే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని స్పష్టం చేస్తోంది. ప్రభుత్వ విభాగాల్లోని ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ క్లియరెన్స్ ఇచ్చిన 15 రోజుల్లోగా నోటిఫికేషన్లు ఇస్తామని కమిషన్ ఛైర్మన్ పీ ఉదయభాస్కర్ తెలిపారు. ఈసారి దాదాపు 6 వేల వరకు ఖాళీలు ఉండవచ్చని ఏపీపీఎస్సీ అంచనా వేసింది. ప్రభుత్వ, ఆర్థికశాఖ క్లియరెన్స్లు వస్తే ఆగస్టులో తొలి నోటిఫికేషన్ విడుదలకు సన్నద్ధమవుతోంది.