ఎదురుచూపులకు మట్టికొట్టినట్టే?: ఆ దెబ్బతో ఎస్జీటీ అభ్యర్థుల విలవిల.. అప్పుడే ఓ ప్రాణం బలి!
ఆయా విభాగాలవారీగా కొన్ని జిల్లాల్లో పదుల సంఖ్యకే పోస్టులు పరిమితమయ్యాయి. దీంతో అభ్యర్థులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
హైదరాబాద్: జిల్లాల పునర్విభజన ఎస్జీటీ అభ్యర్థుల అవకాశాలకు గండి కొట్టిందా?.. టీచర్ పోస్టుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నవారి కళ్లలో మట్టి కొట్టినట్టేనా?.. టీఆర్టీ నోటిఫికేషన్ చూస్తే ఇదే అభిప్రాయం కలగకమానదు.
ప్రభుత్వం భర్తీ చేయబోతున్న పోస్టులు తక్కువ సంఖ్యలో ఉండటం.. దానికి తోడు జిల్లాల పునర్విభజనతో అభ్యర్థులకు అవకాశాలు తగ్గిపోయాయి. ఆయా విభాగాలవారీగా కొన్ని జిల్లాల్లో పదుల సంఖ్యకే పోస్టులు పరిమితమయ్యాయి. దీంతో అభ్యర్థులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
తెలుగు మీడియం పోస్టులే ఎక్కువ:
టీఆర్టీ నోటిఫికేషన్ ద్వారా 8792 పోస్టులను భర్తీ చేయబోతుండగా ఇందులో అత్యధికంగా 5415 పోస్టులు ఎస్టీటీలదే. అయితే ఇందులోను ఎక్కువ పోస్టులు తెలుగు మీడియం వారికే ఉండటంతో మిగతా అభ్యర్థులకు భంగపాటు తప్పలేదు.
ఉన్న జిల్లాల్లో కొన్నింటిలో పదుల సంఖ్యలో పోస్టులు ఉంటే, మరికొన్నింటిలో అసలు పోస్టులే లేకపోవడం గమనార్హం. ఏడు జిల్లాల్లో. వరంగల్ అర్బన్, రూరల్, జనగామ, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఎస్జీటీ పోస్టులు జీరోగా ఉన్నాయి.
కొత్త జిల్లాల దెబ్బ..:
ఉమ్మడి జిల్లాల ప్రకారం ఖాళీలను భర్తీ చేసి ఉంటే ఈ సమస్య తలెత్తేది కాదు. ఎస్జీటీ పోస్టుల్లో సిద్దిపేట జిల్లాలో 3, జగిత్యాల జిల్లాలో 5, మహబూబాబాద్ జిల్లాలో 8, కరీంనగర్ జిల్లాలో 11 ఎస్జీటీ తెలుగు మీడియం పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇక సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలో కేవలం ఒక పోస్టు మాత్రమే ఉండటం గమనార్హం. పైగా కొత్త రోస్టర్ ప్రకారం ఖాళీల్లో మొదటి మూడు పోస్టులు మహిళలకే రిజర్వ్ అయి ఉంటాయి. దీంతో ఎస్జీటీ ఉద్యోగాలపై చాలామంది నమ్మకం కోల్పోతున్నారు. మొత్తంగా ఎస్జీటీ పోస్టుల పరంగా 31 జిల్లాల్లో 4జిల్లాల్లోని అభ్యర్థులకే ప్రయోజనం జరిగే విధంగా నోటిఫికేషన్ ఉందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లోకల్, నాన్ లోకల్ సమస్య:
మెరిట్ ద్వారా ఏ జిల్లాలోనైనా జాబ్ కొట్టవచ్చునని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. అతి తక్కువ మందికి మాత్రమే దాని ద్వారా లబ్ది చేకూరనుంది. ఇక లోకల్, నాన్ లోకల్ సమస్య కూడా అభ్యర్థులను వెంటాడుతోంది.
ఉదాహరణకు వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఒక్క ఎస్జీటీ పోస్టు కూడా లేదు. భూపాలపల్లిలోనే కొన్ని పోస్టులు ఉన్నాయి. కొంత మంది పుట్టి పెరిగింది భూపాలపల్లిలో అయినా.. చదివింది వరంగల్ టౌన్లో కాబట్టి వరంగల్ అర్బన్కు స్థానిక అభ్యర్థులుగా భూపాలిపల్లికి నాన్ లోకల్ గా మారారు. దీంతో సొంత జిల్లా భూపాల్పల్లిలో పోస్టులు ఉన్నప్పటికీ వాటికి అర్హత సాధించలేకపోతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే స్థానికత నియమాలు ఉంటాయని ఇందులో తాము చేయగలిగిందేమి లేదని ప్రభుత్వం చెబుతోంది.
ఇలా అయితే ఎలా?:
పునర్విభజనకు ముందున్న జిల్లాల ఆధారంగానే పోస్టుల భర్తీ ప్రక్రియ జరిపితే న్యాయం జరుగుతుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇదే విషయమై విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని గుర్తుచేస్తున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో కూడా జోన్ 5, 6లో 10 జిల్లాల పేర్లు స్పష్టంగా ఉన్నాయని, 31 జిల్లాల పేర్లు లేవని, అలాంటప్పుడు 31 జిల్లాల ద్వారా ఎలా భర్తీ చేస్తారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కొత్త జిల్లాలతో కూడిన నోటిఫికేషన్ ద్వారా పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, దరఖాస్తు చేసుకోవాలన్న ఆసక్తి కూడా కలగడం లేదని వాపోతున్నారు.
అప్పుడే ఓ ప్రాణం బలి..:
తమ జిల్లాలో మేథమెటిక్స్ డిపార్ట్మెంట్లో కేవలం ఆరు పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ రావడంతో సందీప్(27) అనే యువకుడు తీవ్ర నిరాశ చెందాడు. మూడేళ్లుగా టీచర్ పోస్టుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న అతను.. శనివారం విడుదలైన నోటిఫికేషన్ చూసి షాక్ తిన్నాడు. జిల్లాలో సరిపడా పోస్టులు లేవని, తనకు ఇక ఉద్యోగం రాదనే బెంగతో ఆత్మహత్య చేసుకున్నాడు. కుమరం భీం జిల్లా కాగజ్నగర్లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.