ఇంటర్ విద్యార్థుల కష్టాలు తొలిగేనా? వెయిటేజీకి మంగళం పలికేనా?
హైదరాబాద్: ఎట్టకేలకు తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు కష్టాలు తొలగిపోనున్నాయా? అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే జాతీయ స్థాయి ఇంజనీరింగ్ పరీక్ష.. జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్లోనే ఇంటర్ మార్కుల వెయిటేజీని ఎత్తివేసింది.
ఈ నేపథ్యంలో ఎంసెట్ ర్యాంకుల్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ అవసరం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భవిష్యత్లో ఇంజనీరింగ్ ప్రవేశాలను జాతీయ స్థాయి పరీక్ష ద్వారానే చేపట్టాలని కేంద్రం నిర్ణయించడం, రాష్ట్ర ప్రభు త్వం ఇంటర్లో గ్రేడింగ్ విధానం అమలు చేయాలని యోచిస్తుండడంతో వెయిటేజీ తొలగింపు అంశం తెరపైకి వచ్చింది.
ప్రైవేట్ విద్యాస్థంస్థల సలహా మండలిదీ అదే బాట
ఇటీవల ఒత్తిడితో విద్యార్థుల ఆత్మహత్యలతో ఇంటర్లో మార్కులు ప్రకటించకుండా గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై గతంలో కమిటీ కూడా వేసింది. ఇటీవల ప్రైవేట్ కాలేజీల యాజమాన్య ప్రతినిధుల భాగస్వామ్యం కలిగిన బోర్డు సలహా మండలి కూడా 2018 మార్చిలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో గ్రేడ్ల ప్రక్రియను ప్రారంభించాలని అభిప్రాయపడింది. అందుకనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో ఎంసెట్ ర్యాంకుల్లో ఇంటర్ మార్కుల వెయిటేజీ పరిస్థితి ఏమిటన్న చర్చ జరిగింది. ఈ సందర్భంగా మూడు రకాల ఆలోచనలు చేసింది. వీటిని కూడా త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నది.
వెయిటేజీ రద్దుకు ఇలా మూడు ప్రతిపాదనలు
ఇంటర్ బోర్డు సలహా మండలి మూడు రకాల ప్రతిపాదనలు చేస్తున్నా ప్రధానంగా వెయిటేజీ రద్దుపైనే దృష్టి సారించినట్లు సమాచారం. సబ్జెక్టుల వారీగా గ్రేడ్లను బట్టి వెయిటేజీ లెక్కించడం అశాస్త్రీయం అవుతుందన్న భావన ఉంది. మరో ప్రతిపాదన మేరకు ఎంసెట్ కన్వీనర్కు మార్కులను అందజేసినపుడు.. ఆ మార్కుల వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అభ్యర్థికి ఎంసెట్లో వచ్చిన ర్యాంకు నచ్చకుంటే తన ఇంటర్ మార్కుల కోసం, జవాబు పత్రం ఫొటో కాపీ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇలా కార్పొరేట్ సంస్థలు తమ విద్యార్థులతో జవాబుపత్రాల ఫొటో కాపీల కోసం దరఖాస్తు చేయించుకుని.. మార్కులను తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఇంటర్ వెయిటేజీని రద్దు చేయడమే మేలని భావిస్తున్నారు.
ఎన్టీఏ ద్వారానే ఇక అన్ని కోర్సుల ప్రవేశాలు
జాతీయ స్థాయి పరీక్ష అయిన జేఈఈ మెయిన్ ద్వారానే అన్ని రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ ప్రవేశాలు చేపట్టేలా ఇప్పటికే కేంద్రం కసరత్తు ప్రారంభించింది. కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)'ద్వారా జాతీయ స్థాయి పరీక్షలన్నీ నిర్వహించాలని కూడా ఇంతకుముందే నిర్ణయించింది. నీట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ వంటి పరీక్షలను ఎన్టీఏ పరిధిలోకి తేవాలని యోచిస్తోంది. 2019లో ఇది అమల్లోకి తెచ్చే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అసలు ఎంసెట్ పరీక్షే అవసరం లేదన్న భావన వ్యక్తమవుతోంది. జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలను చేపట్టాలని ఓ అధికారి పేర్కొన్నారు.
సబ్జెక్టుల వారీ ఇలా ఎంసెట్ ర్యాంక్ ఖరారు
ఇప్పటికే జేఈఈ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులకు వెయిటేజీని కేంద్రం తొలగించింది. అదే తరహాలో ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కుల వెయిటేజీని తొలగించి ఎంసెట్ మెరిట్ ఆధారంగానే ఇంజనీరింగ్ ప్రవేశాలు చేపట్టాలని ప్రతిపాదించింది. మార్కులకు బదులు సబ్జెక్టుల వారీగా గ్రేడ్లను పరిగణనలోకి తీసుకోవాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో వచ్చే గ్రేడ్లను బట్టి వెయిటేజీని లెక్కించి ఇవ్వాలి. విద్యార్థులకు గ్రేడ్లు ఇచ్చినా ఇంటర్ బోర్డు వద్ద మార్కులు ఉంటాయి. బోర్డు ఈ మార్కులను ఎంసెట్ కన్వీనర్కు అందజేస్తే.. ఆ మార్కుల ఆధారంగా వెయిటేజీ లెక్కించి ర్యాంకును ఖరారు చేయవచ్చు.