ఏమిటీ వ్యాపమ్?: మధ్యప్రదేశ్లో అదో కిల్లర్ స్కామ్
భోపాల్: వ్యాపమ్ దేశప్రజల్లో వణుకు పుట్టిస్తోంది. ఈ వ్యాపం ఏమిటనే విషయం కూడా ప్రజలను కలచివేస్తోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వృత్తివిద్యా (వ్యవసాయిక్) పరీక్ష మండలికి సంక్షిప్త రూపం వ్యాపమ్. మధ్యప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాలు, వివిధవిద్యాసంస్థల్లో ప్రవేశాలు నిర్వహించే సంస్థే వ్యావసాయిక్ పరీక్షా మండ ల్ (వ్యాపమ్). దీనిని మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేష న్ బోర్డు (ఎంపీపీఈబీ) అని కూడా పిలుస్తారు.
ఉపాధ్యాయులు, కానిస్టేబుళ్లు, వైద్యాధికారులు, తదితర ఉద్యోగుల భర్తీకి వ్యాపమ్ పరీక్షలు నిర్వహిస్తుంది. ఇప్పుడు వ్యాపమ్ కుంభకోణం దేశాన్ని కుదిపేస్తోంది. ఇది ఇప్పుడు కిల్లర్ స్కామ్గా మారింది. 2004 నుంచి ఈ పరీక్షల్లో అవకతవకలు జరిగిన విషయం వెలుగు చూసినా 2009లో తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారణ ప్రారంభమైంది. 2013లో ఆ కుంభకోణం తీవ్రత ఏమిటో తెలిసి వచ్చింది.
ఈ వ్యాపమ్ కుంభకోణం ఇప్పుడు మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. మధ్యప్రదేశ్లోని వ్యాపం స్కాంలో మరణించినంత మంది ఎక్కడా చనిపోలేదని గణాంకాలు చెప్తున్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం ఈ కుంభకోణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న 35 మంది అంతుబట్టని రీతిలో మరణించారు. కిల్లర్ స్కాంగా మారిన ఈ కుంభకోణం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నది.
ఇలా మరణించారు..
వ్యాపమ్తో సంబంధం ఉన్నవారు 25 మంది మరణించారని మధ్యప్రదేశ్ ప్రభుత్వం అంటోంది. మీడియా మాత్రం 48 మంది మరణించినట్లు లెక్కలు చూపుతోంది. పోలీసు రికార్డులు 38 మంది వ్యాపమ్ కుంభకోణానికి సంబంధించిన మరణాలు సంభవించినట్లు చెబుతున్నాయి.
వ్యాపమ్ కుంభకోణంతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్నవారిలో 12 మంది అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఐడుగురు ఆత్మహత్య చేసుకున్నారు. 11 మంది ప్రమాదాల్లో మరణించారు. ఆరుగురు అనారోగ్యంతో మరణించినట్లు లెక్కలు చెబుతున్నాయి.
కుంభకోణం కేసు ఇలా...
2009లో ప్రీ మెడికల్ టెస్ట్ (పీఎంటీ), ఉపాధ్యాయులు, వైద్యుల భర్తీ పరీక్షల్లో భారీగా లంచాలు చేతులు మారాయని ఆరోపణలు చెలరేగాయి. 2012లో నిర్వహించిన ప్రీ పీజీ, ఫుడ్ ఇన్స్పెక్టర్, మిల్క్ ఫెడరేషన్, సుబేదార్ సబ్ ఇన్స్పెక్టర్, ప్ల్లాటూన్ కమాండర్, పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల్లో కోట్ల రూపాయల లంచాలు చేతులుమారాయని పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ కుంభకోణంలో రాష్ట్ర గవర్నర్ రాంనరేశ్యాదవ్, సీఎం శివరాజ్సింగ్ చౌహాన్కు ప్రత్యక్ష సంబంధాలున్నాయని ఆర్టీఐ కార్యకర్త ఆనంద్రాయ్ 2013లో ఆధారాలు బయటపెట్టడం సంచలనం కలిగించింది. ఈ కుంభకోణంలో దాదాపు 2,500 మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
2014లో సీబీఐ దర్యాప్తు చేయాలన్న పిటిషన్ను తిరస్కరించిన మధ్యప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీని నియమించి ఎస్టీఎఫ్ దర్యాప్తు కొనసాగించేందుకు ఆదేశాలిచ్చింది.
-కుంభకోణంలో ఇప్పటివరకు దాదాపు 2000 మందిని అరెస్టుచేశారు. 1,900 మంది జైల్లో ఉన్నారు. 55 కేసులు నమోదయ్యాయి. వ్యాపం ద్వారా ఉద్యోగాలు, అడ్మిషన్ల కోసం 77 లక్షల మంది అభ్యర్థులు అధికారులకు లంచాలిచ్చారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది.
అరెస్టయిన వారిలో మధ్యప్రదేశ్ మాజీ మంత్రి, బీజేపీ నేత లక్ష్మీకాంత్శర్మ, కుంభకోణంలో కీలక నిందితుడు వినోద్ భండారీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకాధికారి ఓపీ శుక్లా, వ్యాపం ఎగ్జామినేషన్ కంట్రోలర్ పంకజ్ త్రివేదీ, మైనింగ్ డాన్ సుధీర్శర్మ, వ్యాపం అధికారి కేఎస్ మిశ్రా, ఐపీఎస్ అధికారి ఆర్కే శివ్హరే, రెవిన్యూ జాయింట్ కమిషనర్ రవికాంత్ ద్వివేదీ, ఇండోర్ అరబిందో దవాఖాన సీవోవో జీఎస్ ఖనూజా తదితరులున్నారు.