కలల సౌధంలో కలవరం: అగమ్య గోచరంగా ‘డ్రీమర్లు’
కాస్తోకూస్తో చదువుకున్న వారి నుంచి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యులకు ఏళ్ల తరబడి పలుకుతున్న ఆహ్వానాన్ని అందుకుని వెళ్లి అమెరికా సమాజంలో మమేకం అయ్యారు. పిల్లలు, కుటుంబాలను తీసుకెళ్లారు.
హైదరాబాద్/ వాషింగ్టన్: వలసదార్లకు ఆ దేశం స్వర్గధామం. అక్కడికెళ్లి ఉజ్వల భవిష్యత్ నిర్మించుకోవాలని కలలు కననివారు ఉండరు. కాస్తోకూస్తో చదువుకున్న వారి నుంచి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యులకు ఏళ్ల తరబడి పలుకుతున్న ఆహ్వానాన్ని అందుకుని వెళ్లి అమెరికా సమాజంలో మమేకం అయ్యారు. పిల్లలు, కుటుంబాలను తీసుకెళ్లారు. అదే తమ సర్వస్వం అనుకున్నారు.
ఆ దేశమే అమెరికా. వలసదారుల మేధస్సుకు పట్టం గట్టి అగ్రరాజ్యంగా ఎదిగింది. అలా దేశం కాని దేశం వెళ్లి తమ సర్వశక్తులూ ధారబోసినా వారికి ఇప్పుడు అనుకోని కష్టం ఎదురైంది. కానీ అమెరికా అధ్యక్షుడు ఒక కలం పోటుతో వారిని నడిరోడ్డు మీద నిలబెట్టారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అక్రమంగా అమెరికాలో అడుగుపెట్టి అక్కడే పెరిగి పెద్దవారైన వారు ఎందరో ఉన్నారు. అటువంటి వారికి ఇమిగ్రేషన్ చట్టాల నుంచి రక్షణ కల్పిస్తూ గత అధ్యక్షుడు బరాక్ ఒబామా డీఏసీఏ (డిఫర్డ్ యాక్షన్ ఫర్ ఛైల్డ్హుడ్ అరైవల్స్) కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. దీని కింద దరఖాస్తు చేసుకొని అనుమతి పొందిన వారు రెండేళ్లు పాటు అమెరికా నుంచి బహిష్కరణ ప్రమాదాన్ని తప్పించుకోగలుగుతారు. ఆ తర్వాత పొడిగింపు లేదా పనికి అనుమతి (వర్క్ పర్మిట్) పొందవచ్చు. తద్వారా చట్టబద్ధంగా అమెరికాలో నివసిస్తున్న వారవుతారు.
16 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నప్పుడు అమెరికా వచ్చి 30 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారందరికీ ఈ వసతి వర్తిస్తుంది. ఇటువంటి వారిని అమెరికాలో 'డ్రీమర్స్' అని వ్యవహరిస్తున్నారు. తాను గెలిస్తే డీఏసీఏను రద్దు చేస్తానని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అమలులోకి తెచ్చారు. ట్రంప్ నిర్ణయం ఫలితంగా డీఏసీఏ కార్యక్రమం కింద కొత్త దరఖాస్తుల స్వీకరణ నిలిచిపోయింది. అంతేగాక వచ్చే నెల 5వ తేదీ తర్వాత నుంచి పునరుద్ధరణ (రెన్యువల్) దరఖాస్తులనూ స్వీకరించరు. అమెరికా అధ్యక్షుడి తాజా నిర్ణయం వల్ల దాదాపు 8 లక్షల మంది భవిష్యత్ ప్రమాదంలో పడిపోయింది.
ఇలా ట్రంప్ ‘అమెరికా ఫస్ట్'
మూడు దశాబ్దాలుగా ప్రపంచీకరణ, హద్దుల్లేని వాణిజ్యానికి కేంద్రస్థానంగా అమెరికా ఎదిగింది. తద్వారా ఎన్నో దేశాల నుంచి నిపుణులను ఆకర్షించింది. అడ్డుగోడలు లేని సమాజం కావటంతో వారందరూ అక్కడికి వెళ్లి సామాజికంగా, వ్యక్తిగతంగా అభివృద్ధి చెందే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. దాంతో ప్రపంచానికి ఎన్నో శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాయి. అమెరికా విశేష ప్రగతి సాధించటంలో ఎన్నో ఇతర దేశాల భాగస్వామ్యం ఉందనేది వ్యతిరేకించలేని వాస్తవం. ఇప్పుడు దీనికి భిన్నంగా డోనాల్డ్ ట్రంప్ 1930- 1940 నాటి విధానాలను అమలు చేస్తున్నాన్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా ఫస్ట్ అనే నయా జాతీయవాదంతో అధికారంలోకి వచ్చిన ఆయన వలసదారులపై కఠినవైఖరిని అనుసరించటం ఈ కోవలేనిదేనని విశ్లేషిస్తున్నారు.
వ్యవసాయ క్షేత్రంలో అధికంగా మెక్సికన్లే
దాదాపు 30 కోట్లకు పైగా ఉన్న అమెరికా జనాభాలో అక్రమంగా వలస వచ్చిన వారు 1.2 కోట్ల వరకూ ఉంటే, వారిలో మెక్సికన్లు అధికం. మధ్య అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా దేశస్థులూ ఉంటారు. ఏళ్ల తరబడి అమెరికాలోనే నివసిస్తున్నా తగిన నివాస పత్రాలు లేని ఫలితంగా వారు అక్రమ వలసదార్లుగా ఉండిపోయారు. వాస్తవానికి అమెరికా వలసదార్ల దేశం. అమెరికా రిపబ్లిక్ను ఏర్పాటు చేసిందే ఐరోపా నుంచి వలస వచ్చిన తెల్లవారు. ఎన్నో ఏళ్లుగా విదేశాల నుంచి అమెరికాలో అడుగుపెట్టే వారిపై ఎటువంటి ఆంక్షలు అమల్లో లేవు. తత్ఫలితంగా అమెరికాలో వ్యవసాయ క్షేత్రాల్లో పనులు చేయటానికి పొరుగున ఉన్న మెక్సికో తదితర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో వలస వచ్చారు.
2006లో బుష్ ఇలా మెక్సికో సరిహద్దుల్లో ఫెన్సింగ్కు ఆదేశం
రెండు దశాబ్దాలుగా అమెరికాలో అక్రమ వలసదారుల సమస్య పెద్ద చర్చనీయాంశం అయింది. పార్టీలకు, ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ పరిణామాలే మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించాలనే ఆలోచనకు పునాది. 2006లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ అమెరికా- మెక్సికో సరిహద్దులో 1,000 కిలోమీటర్ల ఫెన్సింగ్ వేయటానికి ఆమోదముద్ర వేశారు. దాన్ని ముందుకు తీసుకువెళ్తూ గోడ కట్టి మెక్సికో సరిహద్దులను మూసివేస్తానని ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేశారు. అక్రమ వలసదారుల నుంచి వచ్చిన ఒత్తిడి ఫలితంగా డీఏసీఏ కార్యక్రమంలో అమల్లోకి వచ్చింది. దీనివల్ల పూర్తిస్థాయిలో అమెరికా పౌరసత్వం లభించకున్నా చట్టబద్ధంగా అమెరికాలో నివసించే అవకాశం ఏర్పడింది.
ఐవర్ హయాంలోనే విదేశీయులు బలవంతపు ఉద్వాసన
అక్రమ వలసదారులను అమెరికా నుంచి పెద్దఎత్తున వెనక్కి పంపివేయటం ఇటీవల కాలంలో లేదు. 1930 నుంచి 1940 మధ్య దాదాపు 20 లక్షల మంది మెక్సికన్లు- మెక్సికన్ అమెరికన్లను అమెరికాలోని వివిధ నగరాల నుంచి బలవంతంగా మెక్సికో పంపేశారు. 1929 నాటికి ‘గ్రేట్ డిప్రెషన్' దీనికి ప్రధాన కారణం. అప్పట్లో ఎంతో మంది అమెరికన్ యువకులు ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారు. ఉన్న ఉద్యోగాలను మెక్సికన్లు కొల్లగొడుతున్నారనే ఆగ్రహం వారిలో పెల్లుబికింది. దానిఫలితంగా మెక్సికన్లు భవిష్యత్ ఆశలు వదులకొని స్వదేశానికి తిరిగివెళ్లిపోయారు. 1954లో డ్విలైట్ ఐసెన్హోవర్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నకాలంలో మెక్సికన్లను పెద్దఎత్తున వెనక్కి పంపే కార్యక్రమం అమలైంది. అది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కాలం. అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచన మెక్సికన్లపై ఆగ్రహానికి కారణమైంది. తత్ఫలితంగా దాదాపు 13 లక్షల మంది మెక్సికన్లు బలవంతంగా వెనక్కి వెళ్లిపోవడంతో పెద్దఎత్తున హింసాత్మక సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. దీనికే ‘ఆపరేషన్ వెట్బ్యాక్' అనే పేరు వచ్చింది.
1965 తర్వాత ఇలా వలసలపై ఆంక్షల తగ్గుదల
1882లో చైనీస్ ఎక్స్క్లూజన్ యాక్ట్, కూడా ఇటువంటిదే. అమెరికాలో నిర్మాణ రంగంలో పని చేయటానికి భారీగా వలస వచ్చిన చైనా కార్మికులను అమెరికా సమాజం భరించలేకపోయింది. దీంతో అమెరికా కాంగ్రెస్ 1882 చట్టం తెచ్చింది. చైనా కార్మికులు పదేళ్ల పాటు అమెరికాలో అడుగుపెట్టకుండా ఈ చట్టం నిషేధించింది. దీని కాలపరిమితి తీరిపోయిన తర్వాత 1892లో గేరీ యాక్ట్ వచ్చింది. 1965లో ఇమిగ్రేషన్ రిఫార్మ్ యాక్ట్, వలసదారులను జాతీయత, పుట్టిన ప్రదేశం, దేశం అనే పేరులో వివక్ష కూడదని స్పష్టం చేసిన తర్వాత వలసలపై ఆంక్షలు తగ్గాయి. చట్టబద్ధంగా ఇతర దేశాల నుంచి అమెరికా వెళ్లే వీలుకలిగింది. అయినా అనధికారిక వలసలు ఆగలేదు. అలా అమెరికాలో అక్రమ వలసదార్ల సంఖ్య పెరిగి ఇప్పుడు రాజకీయం, సామాజిక సమస్య అయింది.
ట్రంప్ ఎన్నికయ్యాక ఇలా
ఒబామా తెచ్చిన డీఏసీఏ కార్యక్రమాన్ని అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. డోనాల్ట్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఆ రాష్ట్రాల నుంచి దీన్ని రద్దు చేయాలని ఒత్తిడి పెరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఆమోదముద్ర లేదని, చట్టవ్యతిరేకమనేది ఆయా రాష్ట్రాల వాదన. కారణమేదైనా ‘డీఏసీఏ' కార్యక్రమం రద్దు అమెరికాలోని వలసదారుల్లో ప్రకంపనలు సృష్టించింది. దీనికి కారణం తాననే అభిప్రాయం కలగకూడదనే ఆలోచన ట్రంప్లో కనిపించింది. డీఏసీఏ కార్యక్రమ చట్టబద్ధానికి అమెరికా కాంగ్రెస్కు ఆరు నెలలు సమయం ఉందని, అది జరగని పక్షంలో ఈ అంశాన్ని తాను తిరిగి పరిశీలిస్తానని ఈ నెల 6న ఉదయం ట్వీట్ ఇచ్చారు. ఈ విషయంలో తాను రిపబ్లికన్లు, డెమాక్రట్లతో కలిసి పనిచేస్తానని మరొక ట్వీట్ ఇచ్చారు. దీన్ని బట్టి ఈ వ్యవహారంలో ఏదైనా పరిష్కారం లభిస్తుందని అక్రమ వలసదారులు ఆశిస్తున్నారు.
పొంచి ఉన్న బహిష్కరణ ముప్పు
ఒబామా ప్రభుత్వం తెచ్చిన డీఏసీఏ కార్యక్రమాన్ని రద్దు చేయటానికి డోనాల్డ్ ట్రంప్ సంకల్పించినప్పటి అమెరికాలోని భారతీయుల్లో భయాలు మొదలయ్యాయి. ఈ రద్దు వల్ల నష్టపోతారని భావిస్తున్న 8 లక్షల మందిలో భారతీయులు సైతం అధికంగా ఉన్నారు. భారతదేశం నుంచి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అమెరికా వెళ్లి అక్కడే పెరిగి పెద్దయిన వారి సంఖ్య 20 వేల కంటే ఎక్కువగా ఉంటుందని సౌత్ ఏషియన్ అమెరికన్స్ లీడింగ్ టుగెదర్ (సాల్ట్) లెక్క కడుతోంది. అమెరికాలో చట్టబద్ధంగా పనిచేసేందుకు డీఏసీఏ కింద అనుమతి పొందిన 27వేల మంది ఆసియన్ అమెరికన్లలో భారతీయులు, పాకిస్థానీయులు 5,500 మంది ఉన్నారు.
ఇంకా డీఏసీఏ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులైన భారతీయులు 17వేల మంది, పాకిస్థానీయులు 6,000 మంది ఉంటారని అంచనా. తద్వారా ఈ కార్యక్రమం కింద అధికంగా లబ్ది పొందే పది దేశాల వారిలో భారతీయులు ఉంటున్నారు. ట్రంప్ ప్రభుత్వం పునరాలోచించకుంటే వీరందరికీ బహిష్కరణ ముప్పు పొంచి ఉంటుంది.