యువీ ప్రత్యేక శిక్షణ: గెలుపు.. భారత్-ఆసిస్ సమానం
మొహాలీ: ప్రపంచ కప్లో భాగంగా ఆదివారం రాత్రి ఏడున్నర గంటలకు భారత్ - ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు సెమీస్లోకి వెళ్లనుంది. ఆసిస్తో మ్యాచ్ నేపథ్యంలో యువరాజ్ సింగ్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ మ్యాచ్లో మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కు వచ్చే అవకాశాలున్నాయి.
దీంతో, పరిస్థితులకు తగినట్టు ఆడేందుకు, భారత జట్టు అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్ నుంచి సలహాలు తీసుకుని బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. తప్పనిసరిగా గెలవాల్సిన ఈ మ్యాచ్లో యువరాజ్ సత్తా చాటేందుకు కృషి చేస్తున్నాడు. బంగ్లాదేశ్, న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లలో పెద్దగా ఆకట్టుకోలేకున్నా.. పాక్తో మ్యాచ్ లో మాత్రం పర్వాలేదనిపించాడు.
ప్రపంచ కప్ ఫేవరేట్లలో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. పైగా ఈ రెండు జట్లలో ఏది గెలిస్తే అది సెమీస్లోకి వెళ్తుంది. దీంతో ఆదివారం జరగనున్న మ్యాచ్ ఉత్కంఠను రేపుతోంది. ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ చేతిలో ఓటమితో టోర్నీని ఆరంభించారు. పాకిస్థాన్ను ఓడించారు. బంగ్లా మీద చెమటోడ్చి నెగ్గారు.
భారత్ కూడా న్యూజిలాండ్తో ఓటమితో ప్రారంభించింది. ఆ తర్వాత రెండు విజయాలతో దూసుకొచ్చింది. బంగ్లాదేశ్తో ఒక్క పరుగుతో ఓటమి నుంచి తప్పించుకుంది. అయితే, ఆస్ట్రేలియాతో జరిగి మ్యాచ్ భారత్కు చాలా ముఖ్యమైనది.
ప్రపంచకప్ ఆరంభం కావడానికి ముందు ఆస్ట్రేలియాను వాళ్ల గడ్డపై ట్వంటీ 20 సిరీస్లో వైట్వాష్ చేయడం భారత్కు విశ్వాసాన్నిచ్చే అంశం. మూడుకు మూడు ట్వంటీ 20ల్లోనూ భారతే గెలిచింది. అయితే ఆ సిరీస్లో ద్వితీయ శ్రేణి జట్టుతో ఆడింది ఆస్ట్రేలియా.
అప్పటితో పోలిస్తే ఇప్పుడు జట్టు బలంగా ఉంది. టోర్నీలో మొదట ఆ జట్టు తడబడ్డప్పటికీ తర్వాత బాగానే ఆడుతోంది. ఆందోళన కలిగిస్తున్న బ్యాటింగ్ విభాగం కూడా గత మ్యాచ్లో కుదురుకుంది. బ్యాట్సుమెన్ చెలరేగిపోతున్నారు. బ్యాటింగ్లో దాదాపుగా అందరూ మ్యాచ్ విన్నర్లే. ఇక్కడి పరిస్థితులు ఆసిస్కు బాగా తెలుసు.
మన జట్టులో... ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ల వైఫల్యం చెందుతున్నారు. సురేష్ రైనా, యువరాజ్ల నుంచి కూడా మరింత మంచి ప్రదర్శన ఆశిస్తోంది. సత్తా చాటుతున్న కోహ్లిపై ఎన్నో ఆశలు ఉన్నాయి. బ్యాట్స్మెన్ సమష్టిగా రాణించి భారీ స్కోరు చేయకపోతే.. సెమీస్పై ఆశలు వదులుకోవాల్సి వస్తుంది.
టోర్నీలో ఇప్పటిదాకా బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టే పిచ్లే ఎదురయ్యాయి. అయితే మొహాలిలో మాత్రం పరిస్థితులు బ్యాటింగ్కు అనుకూలం. ట్వంటీ 20 ప్రపంచ కప్లో భారత్, ఆస్ట్రేలియాలు పలుమార్లు తలపడ్డాయి. 2007, 2014 టోర్నీల్లో భారత్ గెలిస్తే, 2010, 2012ల్లో ఆస్ట్రేలియా గెలిచింది.