అఎn్గాన్ యుద్ధానికి మతం రంగు
హైదరాబాద్: కాంగ్రెస్కు మరో శత్రువు అక్కర్లేదు. కాంగ్రెస్కు కాంగ్రెసే శత్రువు. ఈ విషయం కాంగ్రెస్వారి కన్నా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు బాగా తెలుసు. అందుకే ఆయన కాస్తా ధీమాగానే కనిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)తో పొత్తు తర్వాత తెలుగుదేశం పార్టీ కాస్తా ఇబ్బందిలో పడిన మాట నిజమే. కానీ ఆ తర్వాత మెల్లమెల్లగా కోలుకుంటున్నట్లు కనబడుతోంది. ఇందుకు కారణం కాంగ్రెస్ నాయకులే కావడం గమనార్హం.
టిఆర్ఎస్తో పొత్తు తర్వాత కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు తెలంగాణ ప్రజలను అయోమయంలో పడేసే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల అంశమే కాదని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పి) మాజీ నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు. రెండో రాష్ట్రాల పునర్విభజన కమీషన్ (ఎస్ఆర్సి)కి కట్టుబడి వుంటామని ఆయన చెప్పారు. రెండో రాష్ట్రాల పునర్విభజన కమీషన్ అంటే పెద్ద తతంగం. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కొత్త రాష్ట్రాల పునర్విభజన కమీషన్ను వేస్తుంది. అయితే మొదటి నుంచీ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) కొత్తగా రాష్ట్రాల పునర్విభజన కమీషన్ ఏర్పాటు అవసరం లేదని, ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు ఫజల్ అలీ నేతృత్వంలోని రాష్ట్రాల పునర్విభజన కమీషన్ సూచనలను అమలు చేయాలని అంటోంది. తెలంగాణ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. ఈ విషయంలో పట్టుబట్టిన టిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు కాంగ్రెస్ నుంచి స్పష్టమైన హామీ ఇవ్వకుండానే సీట్ల సర్దుబాటుకు అంగీకరించారా అనేది ప్రశ్న. ఆంధ్రరాష్ట్రంలో తెలంగాణ విలీనం భార్యాభర్తల బంధం లాంటిదని, సుతి కుదరకపోతే విడాకులు తీసుకోవచ్చునని అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు అన్నారు. నిజానికి తెలంగాణ ప్రజలు విడాకులే కోరుతున్నారు. టిఆర్ఎస్ కూడా ఇదే వైఖరితో ముందుకు వచ్చింది. ఇప్పుడు వైయస్ మాటలు చూస్తుంటే పరిస్థితి మారిపోయినట్లు కనిపిస్తోంది.
ఇక, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) మాజీ అధ్యక్షుడు ఎం. సత్యనారాయణరావు మరో బాంబు పేల్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్లో కలిసిపోతుందని ఆయన సంచలనాత్మక ప్రకటన చేశారు. చంద్రబాబునాయుడు ఏదైతే చెబుతున్నారో అదే సత్యనారాయణరావు నోటి వెంట రావడం విచిత్రంగానే ఉంది. ఇది కాంగ్రెస్కు నష్టం చేసేదే తప్ప మేలు చేసేది కాదు. కాంగ్రెస్ నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరించకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు మాట్లాడడం పెద్ద సమస్యగా మారింది.
మొత్తం మీద కాంగ్రెస్ వ్యవహారశైలి ఆ పార్టీకే కాకుండా టిఆర్ఎస్కు కూడా నష్టం చేసే పరిస్థితులకు పునాదులు వేస్తున్నాయి. ఇదే పద్ధతిలో వ్యవహరిస్తే కాంగ్రెస్ది భస్మాసుర హస్తమే అయినా ఆశ్చర్యపోనక్కరలేదు.