తెర వెనక అల్లు అరవింద్
చిరంజీవి పార్టీకి సంబంధించిన ప్రతి కీలక నిర్ణయంలో ఆయన పాత్ర ఉంటూ వచ్చింది. తెర వెనక నుంచి మొదట పార్టీని నడిపించినా ఆ తర్వాత బహిరంగంగా ముందుకు వచ్చారు. పార్టీ పదవులకు ఎంపికలు, వామపక్షాలు, మనపార్టీతో పొత్తుల చర్చలు, విలీనాలు, ఎన్నికల సంఘంతో సంప్రదింపులు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలు అల్లు ప్రమేయంతోనే జరిగాయి. రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని కొందరు నాయకులు గట్టిగా సూచించారు. అరవింద్ పై వచ్చిన ఆరోపణలు, విమర్శల్ని అంతర్గత వేదికలపైనా, బహిరంగంగానూ చిరంజీవి గట్టిగా ఖండించారు. ఆయనను సమర్థించారు. రాజీనామా చేయాల్సిన అవసరమే లేదని వాదించారు. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగానే అరవింద్ చుట్టూనే అన్ని వ్యవహారాలూ నడుస్తాయని అంతా భావించారు.
పార్టీని పునర్వ్యవస్థీకరణకు అధ్యక్షుడు నియమించిన కమిటీలో కేంద్ర మాజీమంత్రి ఉపేంద్ర, పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు కె.వి.రావు, ఉమామల్లేశ్వరరావు, కార్యాలయ కార్యదర్శి రాధాకృష్ణలు సభ్యులుగా ఉన్నారు. వీరు తరచూ సమావేశమై చర్చిస్తున్నారు. ఇందులోనూ అరవింద్ పాల్గొనటం లేదు. వ్యూహాత్మకంగానే ఆయన ఇలా చేస్తున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఫలితాల అనంతరం వచ్చిన విమర్శల దృష్ట్యా కొంతకాలంపాటు తెరవెనక ఉండాలని అయన నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. బహిరంగంగా కనిపించక పోయినా కీలకాంశాల్లో ఆయన ప్రమేయం తప్పక ఉంటుందనేది కాదన లేని సత్యం.