చిరుకు బాబు కౌంటర్
చంద్రబాబు ప్రారంభించిన కౌంటర్ వైయస్ రాజశేఖర రెడ్డికి కాకుండా ప్రజారాజ్యం పార్టీ నేత చిరంజీవికి కౌంటర్ గా మారింది. ప్రజారాజ్యం పార్టీతో విసిగిపోయిన పలువురు మాజీ తెలుగుదేశం నాయకులు తిరిగి సొంత గూటికి రావడానికి ఉత్సుకత చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దేవేందర్ గౌడ్ తో సహా ఎవరు వచ్చిన ఆహ్వానిస్తామని తెలుగుదేశం నాయకుడు కె ఎర్రంనాయుడు చెప్పారు. అంతటితో ఆగకుండా వారికి తెలుగుదేశం పార్టీ పెద్ద యెత్తున గాలం వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మాజీ పార్లమెంటు సభ్యుడు మల్యాల రాజయ్య ఇటీవలే ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇంకా కొంత మంది ఈ బాట పట్టవచ్చునని ప్రచారం జరుగుతోంది. టి.దేవేందర్ గౌడ్, తమ్మినేని సీతారాం, కోటగిరి విద్యాధర రావు వంటి నేతలు కూడా తెలుగుదేశం వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, వైయస్ రాజశేఖర రెడ్డి వారి యత్నాలను సాగినిస్తారా అనేది ప్రశ్నగానే ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు చెందిన మాజీ తెలుగుదేశం నాయకులు కొంత మంది కూడా సొంతగూటికి రావచ్చునంటున్నారు. వీరిలో మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ ను ప్రముఖంగా చెబుతున్నారు. చంద్రశేఖర్ తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావుపై అసమ్మతి వ్యక్తం చేసి తిరిగి రాజీ పడ్డారు. అయితే రాజీ పడిన తర్వాత ఆయన పరిస్థితి ఏమీ బాగా లేదట. కక్కలేక మింగలేక ఆయన సతమతమవుతున్నట్లు సమాచారం. ఈ స్థితిలో ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావచ్చునని అంటున్నారు.
చిరంజీవి పార్టీకి చెందిన నాయకులను తన పార్టీలోకి ఆహ్వానించడానికి చంద్రబాబు పక్కా ప్రణాళికతోనే ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీని చిన్న పార్టీలు ఎదుర్కోలేవని ఆయన అన్నట్లు భావించవచ్చు. దీనివల్లనే చిరంజీవి శనివారం చంద్రబాబుపై నిప్పులు కురిపించారు. చంద్రబాబు ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బ తీస్తున్నారని, చంద్రబాబు కాంగ్రెసు ట్రాప్ లో పడ్డారని ఆయన విమర్శించారు. ఈ స్థితిలో చిరంజీవికి, చంద్రబాబుకు మధ్య మాటల యుద్ధం కొనసాగే అవకాశాలున్నాయి.