బాబు 'జాతీయ' పాట్లు
చంద్రబాబు జాతీయ పోరులో రెండు ప్రధానాంశాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి - తన ప్రత్యర్థిగా ఉంటూ వచ్చిన దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైయస్ జగన్ ను రాజకీయంగా బలహీనపరచడం, రెండోది - జాతీయ స్థాయిలో తాను తిరిగి ప్రాబల్యం సంపాదించుకోవడం. జగన్ కు, గాలి జనార్దన్ రెడ్డికి మధ్య అక్రమ లావాదేవీలున్నాయని ప్రచారం చేయడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని అప్రతిష్ట పాలు చేయడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనేది ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా, జగన్ ను కాంగ్రెసు పార్టీ అధిష్టానం వద్దం అభాసు పాలు చేయడమనేది ఆయన ముఖ్యోద్దేశ్యమని చెబుతున్నారు.
కాగా, జాతీయ రాజకీయాల్లో ఆయన మొదటి నుంచి ప్రముఖ పాత్ర వహిస్తూ వస్తున్నారు. లోకసభ ఎన్నికలకు ముందు వామపక్షాలు, ఇతర పార్టీలతో కలిసి ఆయన తృతీయ కూటమి కట్టారు. అయితే అది ఏ మాత్రం ఫలితం ఇవ్వలేదు. మరోసారి తృతీయ ఫ్రంట్ ప్రయత్నాన్ని ప్రారంభించినట్లు చెప్పవచ్చు. కాంగ్రెసు, బిజెపిలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో తృతీయ కూటమి ద్వారా ఢిల్లీ రాజకీయాలను ఏదో మేరకు నడపాలనేది ఆయన ఆశయంగా కనిపిస్తోంది. అయితే, వామపక్షాలు వరుస అపజయాలతో నీరసపడి ఉన్నాయి. సొంత గూళ్లను చక్కబెట్టుకోవడమే వాటికి కనాకష్టంగా ఉంది. ఈ స్థితిలో అవి జాతీయ స్థాయిలో ఒక శక్తిని ఏర్పాటు చేసే స్థితిలో లేవు. చంద్రబాబు ఎంచుకున్న మిగతా పార్టీలు చాలా చిన్నవి. ఏమైనా, చంద్రబాబు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో క్రియాశీలకంగా ఉన్నారని చెప్పవచ్చు.