బాబు టార్గెట్ వైయస్ జగన్
గాలి జనార్దన్ రెడ్డికి, జగన్ కు మధ్య వ్యాపార లావాదేవీలున్నాయని చెప్పడానికి కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు. జగన్ కు సంబంధించిన జగతి పబ్లికేషన్స్, ఆర్ఆరో గ్లోబల్, రెడ్ గోల్డ్ సంస్థలకు ఓబుళాపురం మైనింగ్ కంపెనీ నుంచి వాటాలు దక్కుతున్నాయని ఆయన చెబుతూ వస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఒక వార్తాకథనం ఈనాడు పత్రికలో సోమవారం ప్రచురితమైంది. తన వ్యాపారాలతో జగన్ కు సంబంధం లేదని గాలి జనార్దన్ రెడ్డి చెప్పిన మాట నిజం కాదని ఈనాడు వార్తా కథనం సారాంశం. ఈనాడు పత్రిక వరుస వార్తాకథనాలతో జగన్, గాలి జనార్దన్ రెడ్డిలపై దాడులు చేస్తుంటే, చంద్రబాబు మిగతా ప్రతిపక్షాలను కలుపుకుని ఉద్యమాలు చేస్తున్నారు. ఆయన ఉద్యమాలతో సిపిఐ, సిపిఎం, లోకసత్తా పార్టీలు కలిసి వస్తున్నాయి. ఈ పార్టీలన్నీ ఒకే సామాజిక వర్గానికి చెందినవారి నాయకత్వంలో సాగుతుండడం ఇక్కడ గమనార్హం.
ఇదే సమయంలో ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వం నిస్సహాయ స్థితిలో ఉందని కూడా చంద్రబాబు చెప్పదలుచుకున్నారు. రోశయ్య జగన్ పై చర్యలు తీసుకోవడానికి భయపడుతున్నారని ఆయన ఆరోపించారు కూడా. రాష్ట్రంలో బలహీనమైన ముఖ్యమంత్రి పాలన సాగుతోందని ఆయన ప్రజల ముందు పెట్టదలుచుకున్నారు. జగన్ ను రాజకీయంగా దెబ్బ తీసేందుకే చంద్రబాబు ఆరోపణులు చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటివాళ్లు అంటున్నారు. ఏమైనా చంద్రబాబు టార్గెట్ వైయస్ జగనేనని చెప్పక తప్పదు.