చిరు పొత్తుల ఎత్తులు
జయప్రకాష్ నారాయణ నేతృత్వంలోని లోకసత్తా పొత్తుల కోసం చిరంజీవి చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. లోకసత్తా రాష్ట్రంలో గుర్తించదగిన వోటు బ్యాంకును సాధించిందనే విషయం లోకసభ, శాసనసభ ఎన్నికల ద్వారా రుజువైంది. పట్టణ మధ్యతరగతి,యువతలో లోకసత్తా మెల్లగా తన స్థానాన్ని పదిలపరుచుకుంటోంది. దీంతో హైదరాబాదులో లోకసత్తాతో పొత్తు వల్ల తమకు కలిసి వస్తుందని ప్రజారాజ్యం పార్టీ నాయకులు భావిస్తున్నారు.
అదే సమయంలో జాతీయ నాయకత్వం పట్టు వల్ల తెలుగుదేశం వైపు వెళ్లిన సిపిఐ రాష్ట్ర నాయకత్వం కచ్చితంగా తమతోనే ఉంటుందని ప్రజారాజ్యం పార్టీ నమ్ముతోంది. సిపిఎం తెలుగుదేశంతోనే వెళ్లడానికి సిద్ధపడిన పరిస్థితిలో సిపిఐ నాయకత్వం కమ్యూనిస్టుల సయోధ్య కన్నా ప్రజారాజ్యం పార్టీతో కలిసి రావడానికే ఇష్ట పడే అవకాశం ఉంది.
ఇక ఇప్పటి వరకు బిజెపితో కలిసేది లేదంటూ చెబుతూ వచ్చిన చిరంజీవి మనసు మారినట్లు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లో బిజెపితో కలిసి పనిచేయడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాదులో బిజెపి చెప్పుకోదగిన స్థాయిలో ఉండడమే అందుకు కారణమని చెబుతున్నారు. మొత్తం మీద చిరంజీవి పొత్తుల ఎత్తులకు పదును పెడుతున్నారు.