చిరు కంపెనీ ఖాళీ
పార్టీ నుంచి టి.దేవేందర్ గౌడ్, పెద్దిరెడ్డి ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీలో ఉన్న తమ మాజీలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తిరిగి అహ్వానిస్తున్నారు. ఒక్కరొక్కరే వచ్చి వారు తిరిగి సైకిలెక్కుతున్నారు. తాజాగా తమ్మినేని సీతారాం, కళా వెంకటరావు, తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీ ఆవిర్భావానికి, నిర్మాణానికి తెర బయట లోపల కృషి చేసిన నాయకులంతా ఇప్పటికే వెళ్లిపోయారు. మిత్రా, పరకాల ప్రభాకర్, శివశంకర్ వంటి సీనియర్లు కంపెనీని ఖాళీ చేశారు. పర్వతనేని ఉపేంద్ర ఈ మధ్య కాలంలో ఏమీ మాట్లాడడం లేదు.
మరింత విశేషమంటే, చిరు బ్రదర్స్ చడీచప్పుడు చేయడం లేదు. నాగబాబు, పవన్ కళ్యాణ్ పార్టీ ఊసు కూడా ఎత్తడం లేదు. యువరాజ్యం అధినేతగా గాలిని మళ్లిస్తానని ధీమా వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ పార్టీకి దూరమైనట్లేనని చెబుతున్నారు. కాగా, చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ సినిమాలు తీయడంలో పూర్తిగా నిమగ్నమైనట్లున్నారు. మగధీర విజయం ఇచ్చిన కిక్ తో ఆయన మరిన్ని సినిమాల నిర్మాణానికి ఆయన ప్లాన్ వేసుకుంటున్నట్లు సమాచారం. గజిని హిందీ సినిమా కూడా ఆయన పెద్గగానే లాభాలు తెచ్చి పెట్టింది. మగధీర ఇప్పటికే లాభాలను ఆర్జించి పెట్టినట్లు చెబుతున్నారు.